ఆర్తి ప్రబంధం – 49

శ్రీః
శ్రీమతే శఠకోపాయ నమః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమత్ వరవరమునయే నమః

ఆర్తి ప్రబంధం

<< ఆర్తి ప్రబంధం – 48

పరిచయము:

మునుపటి పాశురములో, మాముణులు “ఎతిరాశ అడి నణ్ణాదవరై ఎణ్ణాదు” అని పలుకుతూ ఈ భూమిపై ప్రాపంచిక మనుషుల పట్ల తనకున్న నిరాసక్తిని వెల్లడిచేస్తున్నారు. అయినప్పటికీ, అందరి పట్ల సున్నితమైన మృదు స్వభావి అయిన మాముణులు, తన తోటి ప్రజలు ఉన్న దుర్భర స్థితిని చూసి భరించలేకపోతున్నారు. తోటి మానవుల పట్ల దయ కారణంగా, వారికి ఎంబెరుమానార్ల దివ్య పాద పద్మ యుగళి యందు మోక్షానికి మార్గము చూపించి, అవసరమైన నియమాలను నిర్దేశిస్తున్నారు.

పాశురము 49:

నందా నరగత్తు అళుందామై వేణ్డిడిల్ నానిలత్తీర్
ఎన్ తాదైయాన ఎతిరాశనై నణ్ణుం ఎన్ఱుం అవన్
అందాది తన్నై అనుసందియుం అవన్ తొండరుడన్
సిందాకులం కెడచ్ చేర్ందిరుం ముత్తి పిన్ శిత్తికుమే!!!

ప్రతి పద్ధార్ధములు:

నానిలత్తీర్ – ఓ!!! నాలుగు రకాల ఈ ప్రపంచవాసులారా!!!
వేణ్డిడిల్ – నీవు ఆశిస్తే
అళుందామై – ఇమిడించుకొనక
నరగత్తు – “సంసార సాగరము” అనే నరకము
నందా – అనుభవించి పూర్తి చేయలేము (నా మాట వినుము)
నణ్ణుం – వెళ్ళి ఆశ్రయించుము
ఎన్ – నా (మా)
తాదైయాన – తండ్రియైన
ఎతిరాశనై – ఎంబెరుమానార్లని
అనుసందియుం – జపించి మరియు ధ్యానించి
ఎన్ఱుం – నిత్యమూ
అవన్ అందాది తన్నై – ఎంబెరుమానార్ల నామాలు ప్రతిధ్వనించే “ప్రపన్న గాయిత్రి” గా పిలువబడే ఇరామానుశ నూఱ్ఱందాది, మన మోక్షానికి దారినిస్తుంది.
చేర్ందిరుం – సేవలో ఉండండి
అవన్ తొండరుడన్ – వారి భక్తులు ఉత్తమ శ్రీవైష్ణవులు.
సిందాకులం – ఈ ప్రపంచంలోని ఇతర విషయాలతో సంబంధం వల్ల కలిగే నొప్పి మరియు బాధలు
కెడ – దానిచే నిర్మూలించబడుతుంది
ముత్తి – విముక్తి
పిన్ శిత్తికుమే – సరైన సమయంలో సంభవిస్తుంది

సరళ అనువాదము:

మాముణులు, ఈ పాశురములో, ఈ ప్రపంచ ప్రజల దయనీయ స్థితిని చూసి, వారికి ముక్తి పొందే సులభమైన మార్గం గురించి వివరిస్తున్నారు. నరకముగా భావించబడే ఈ ప్రపంచాన్ని, వాటి సంకెళ్ళ నుండి విముక్తి పొందాలని కోరుకునే వాళ్ళని, తమ తండ్రి అయిన ఎంబెరుమానార్ల దివ్య పాద పద్మాలను ఆశ్రయించమని కోరుతున్నారు. ఎంబెరుమానార్ల దివ్య నామము ప్రతి పాశురములో ఉన్న “ఇరామానుశ నూఱ్ఱందాది” ని జపించి ధ్యానం చేయమని వారిని కోరుతున్నారు. ఎంబెరుమానార్ల  భక్తులకు సేవ చేయమని కోరుతున్నారు. ఇలా చేయుట వలన, ఎంబెరుమానార్ల దివ్య శ్రీ చరణాల ఆశ్రయం పొందక ముందు అనుభవించిన ఎనేక వేదనలను మరియు బాధలను తుడిచివేస్తుంది. ఆపై సమయం వచ్చినప్పుడు, వారు ఖచ్చితంగా విముక్తి పొందుతారని మాముణులు హామీ ఇస్తున్నారు.

వివరణ: 

మాముణులు మరింత వివరణ ఇక్కడ ఇస్తున్నారు – “మన గ్రంథాలలో ఈ ప్రపంచాన్ని నరకముగా వర్ణించారు. “నందా  నరగత్తాళుందా వగై (పెరియ తిరుమొళి 11.8.9)”, “నరగత్తిడై నణుంగా వగై (పెరియ తిరుమొళి 7.9.5)”, “మఱ్ఱై నరగమ్ (తిరువాయ్మొళి 8.1.9)” అని ఆళ్వార్ల పాశురాల నుండి కొన్నింటిని ఇక్కడ ఉల్లేఖిస్తున్నారు. “ప్రపంచం” అనే ఈ నరకంలో,  బాధలకు దుఃఖాలకు అంతులేదు. హే! ఈ ప్రపంచంలో ఉంటున్న నా ప్రియమైన తోటి భూలోక వాసులారా !!! ఈ నరకంలో మునిగిపోకుండా ఇక్కడి నుండి మీరు తప్పించుకొని విముక్తి పొందాలనుకుంటే,  మీరు ఇలా చేయాలి.  నా తండ్రి అయిన ఎంబెరుమానార్ల వద్దకు వెళ్లి దయచేసి వారిని ఆశ్రయించండి. “ప్రపన్న గాయిత్రి” (ప్రపన్నులకు నిత్యానుసంధానమైనది యను అర్థము) అని పిలువబడే “ఇరామానుశ నూఱ్ఱదాది” ప్రతి పాశురములో, మోక్షానికి మార్గం సుగమం చేసే వారి నామాలు ఉన్నాయి. ఆ నామాలను ధ్యానించండి. “ఉన్ తొణ్డర్గళుక్కే” అని ఇరామానుశ నూఱ్ఱదాది 107వ పాసురములో వివరించినట్లుగా, వెళ్లి ఎంబెరుమానార్ల దాసుల చరణాల నిత్య సాంగత్యములో ఉండాలని దయచేసి ప్రయత్నించండి. ఇంతవరకు మీరు పడుతున్న బాధలన్నీ తొలగించబడతాయి. ఆపై, సరైన సమయం ఆసన్నమైనప్పుడు మీరు విముక్తి పొందుతారు.

అడియేన్ శ్రీదేవి రామానుజదాసి

మూలము : http://divyaprabandham.koyil.org/index.php/2017/03/arththi-prabandham-49/

పొందుపరిచిన స్థానము – http://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org

Leave a Comment