ఆర్తి ప్రబంధం – 57

శ్రీః
శ్రీమతే శఠకోపాయ నమః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమత్ వరవరమునయే నమః

ఆర్తి ప్రబంధం

<< ఆర్తి ప్రబంధం – 56

పరిచయము:

శ్రీ రామానుజుల మనస్సులో ఒక ప్రశ్న ఉందని ఊహించిన మాముణులు, ఈ పాశురములో ఆ ప్రశ్నకి సమాధానం ఇస్తున్నారు. శ్రీ రామానుజుల మనస్సులో ఉందని భావించిన ప్రశ్న ఈ విధంగా ఉంది. శ్రీ రామానుజులు అంటున్నారు – “హే మాముని! నేను మీ అభ్యర్థనలను విన్నాను. నీవు ఒక దాని తరువాత ఒకటి కొన్ని విషయాలను అడిగావు. నిన్ను నేను ఒక విషయము అడగవచ్చా? నీవు చేసిన ఈ విన్నపాలకి నీవైపు నుండి ఏదైన బలమైన శిఫార్సు ఉందా? ఎవరైనా ఉన్నారా?”. ఈ ప్రశ్నకు మాముణులు బదులు ఇలా ఉంది – “అవును. నా ఆచార్యులు  ‘తిరువాయ్మొళి పిళ్ళై’ లకి శరణాగతులైన తరువాత నన్ను నేను ఒక వస్థువుగా భావిస్తున్నాను. నా గొప్ప అర్హత అదే. దయచేసి నా వద్ద ఉన్నఈ అరుదైన వజ్రాన్ని పరిగణలోకి తీసుకోండి. హే ఎంబెరుమానారే! మీరు నాలో లోపాలను ఎన్నకండి.  ‘యతీశ్వర శృణు శ్రీమాన్ కృపయా పరయా తవ’ అని చెప్పినట్లుగా, దయచేసి ఈ దాసుని అల్ప మాటలను మీ చెవిలో పెడేలా చేయండి”.

పాశురము 57:

దేశిగర్గళ్ పోఱ్ఱుం తిరువాయ్మొళి పిళ్ళై
వాశమలర్ తాళ్ అడైంద వత్తువెన్నుం
నేశత్తాల్ ఎన్ పిళైగళ్ కాణా ఎతిరాశరే
అడియేన్ పున్పగర్వై కేళుం పొఱుత్తు

ప్రతి పద్ధార్ధములు:

వాశమలర్ తాళ్ అడైంద వత్తువెన్నుం – దివ్య సుగంధముతో నిండి ఉన్న వారి మృదువైన పాదాల యందు శరణాగతి చేసిన నేను ఒక వస్తువుని.
దేశిగర్గళ్ పోఱ్ఱుం తిరువాయ్మొళి పిళ్ళై – తిరువాయ్మొళి పిళ్ళైని “శెంతమిళ్ వేద తిరుమలయాళ్వార్ వాళి” అని మన పూర్వాచార్యులు కీర్తిస్తారు. నమ్మాళ్వార్లు, వారి గ్రంథాలను ఎంతగానో సేవించి, అపారమైన సేవాభావం ప్రదర్శించిన వ్యక్తి వారు. మాధుర్యముతో నిండిన నమ్మాళ్వార్ల పాశురములను ఊపిరిగా తమ జీవనము గడిపారు.
నేశత్తాల్ – ఈ సాంగత్యము కారణంగా
ఎతిరాశరే– ఎంబెరుమానారే!!!
కేళుం – దయచేసి వినండి
అడియేన్ – నేను
పున్పగర్వై – తక్కువైన మాటలు
ఎన్ పిళైగళ్ కాణా – నాలో తప్పులెంచకుండా, వాటిపైన దృష్థి పెట్టకుండా
పోఱ్ఱుం – కోప్పడకుండా

సరళ అనువాదము:

శ్రీ రామానుజులకు తిరువాయ్మొళి పిళ్ళై (వారి ఆచార్యులు) లతో ఉన్న గొప్ప అనుబంధాన్నికీర్తిస్తున్నారు మాముణులు. తన లోపాలను పట్టించుకోవద్దని, తన అల్ప మాటలను కోపగించు కోకుండా వినమని శ్రీ రామానుజులను ప్రార్థిస్తున్నారు.

వివరణ: 

మాముణులు శ్రీ రామానుజులతో ఇలా అంటున్నారు – “శెంతమిళ్ వేద తిరుమలయాళ్వార్ వాళి” అని తిరువాయ్మొళి పిళ్ళైని మన పూర్వాచార్యులు కీర్తించారు. అటువంటి వారి దివ్య సువానతో నిండిన చరణాలకు శరణాగతులైన నేను ఒక వస్తువు వంటి వాడను. నమ్మాళ్వార్లు  మరియు వారి గ్రంథాలకు ఎనలేని కృషిచేసి, అప్పరమైన దాస్యాన్ని ప్రదర్శించిన వ్యక్తి వారు. మాధుర్యముతో నిండిన నమ్మాళ్వార్ల పాశురములను ఊపిరిగా తమ జీవనము గడిపారు”.

ఎంబెరుమానారే !!! ఈ  సంబంధము కారణంగా, దయచేసి నాలో లోపాలను ఎంచక వాటిపై దృష్టి పెట్టకుండా, దయచేసి ఈ దాసుని అల్ప మాటలను కోపగించుకోకుండా వినండి.

అడియేన్ శ్రీదేవి రామానుజదాసి

మూలము : http://divyaprabandham.koyil.org/index.php/2017/03/arththi-prabandham-57/

పొందుపరిచిన స్థానము – http://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org

Leave a Comment