దివ్యప్రబంధ సరళ మార్గదర్శిని – మొదటి భాగం (తనియన్, తిరుపల్లాండు, కణ్ణినుణ్ శిరుత్తాంబు)

శ్రీ:  శ్రీమతే శఠగోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః 

పూర్తి వ్యాసమాలిక

<< పరిచయం 

ఇంతకు మునుపు మనం ఆళ్వార్లు, అరుళిచెయల్, వాటి విభజన వేదముల వలె నాలుగు భాగాలుగా చేయబడటం గురించి తెలుకున్నాం. వేదాలు విస్తృతంగా ఉండటం వలన, సంస్కృతంలో ఉండటం వలన అందరికీ అర్థం కాకపోవచ్చు. అయితే, దివ్యప్రబంధం తమిళంలో ఉండి, విస్తృతంగా లేక పోవడం చేత ప్రతి ఒక్కరికీ నేర్చుకోవడం సాధ్యం.

దివ్యప్రబంధాలు ఆళ్వారుల భక్తి ప్రవాహం. వారు మనపై అపారమైన కరుణతో ఈ పాశురాలను మన కోసం రచించారు.

ఆళ్వారుల కాలం ద్వాపరయుగాంతం మరియు కలియుగ ఆరంభంలోనిది. ఈ పాశురాలను ఆ తరువాత శ్రీమాన్ నాథమునిగళ్ “కణ్ణినుణ్ శిరుత్తాంబు”  12,000 సార్లు జపించగా, నమ్మాళ్వారు అనుగ్రహించి ఆయనకు సంపూర్ణ దివ్యప్రబంధాలతో మరియు వాటి అర్థాలతో కూడిన జ్ఞానంతో కరుణించారు.

ఈ దివ్యప్రబంధాన్ని మన పూర్వాచార్యులు -నాథమునిగళ్, ఉయ్యకొండార్, మణక్కాళ్ నంబి, ఆళవందార్, ఎంపెరుమానార్, ఎంబార్, శ్రీ పరాశర భట్టార్, నంజీయార్, నమ్బిల్లై, వడక్కుత్తిరువీది పిళ్ళై ,  పిళ్ళై  లోకాచార్యులు మొదలైన వారు వ్యాప్తి చేశారు.  పిళ్ళై  లోకాచార్యులు, ఆళ్వారుల పాశురాలు మరియు ఆచార్యుల వ్యాఖ్యానాల ఆధారంగా రహస్య గ్రంథాలను కృపతో రచించారు. నంపిళ్లై యొక్క మరో శిష్యుడు, పెరియవాచ్చాన్  పిళ్ళై , మొత్తం 4000 పాసురాలకు వ్యాఖ్యానాలు రాశారు.

తరువాత తిరువామొళి  పిళ్ళై మరియు మణవాళ మామునిగళ్ కూడా దివ్యప్రబంధాన్ని విస్తృతంగా ప్రచారం చేశారు. మణవాళ మామునిగళ్ “ఈడు 36000 పడి” అనే నంపిళ్లై యొక్కతిరువాయిమొళి  వ్యాఖ్యానాన్ని కంఠస్థం చేసి, శ్రీరంగంలో ఒక సంవత్సరం పాటు కాలక్షేపం చేశారు. ఆ సంవత్సరంలో నంపెరుమాళ్ అన్నీ ఉత్సవాలను ఆపివేసి ఆ కాలక్షేపాన్ని పూర్తిగా విన్నారు. అంతేకాక, చిన్న బాలుడి రూపంలో ప్రత్యక్షమై తన ఆచార్యులైన మణవాళ మామునిగళ్‌కు “శ్రీశైలేశ” తనియన్‌ను సమర్పించారు. .

మణవాళ మామునిగళ్ దివ్యప్రబంధాలు మరియు వాటి వ్యాఖ్యానాల ప్రతులను తయారుచేసి, మన కోసం వాటిని భద్రపరిచారు.

4000 దివ్యప్రబంధాలు నాలుగు భాగాలుగా విభజించబడ్డాయి: మొదటి వేయి, రెండవ వేయి, ఇయర్పా మరియు తిరువాయిమొళి. 

ఇయర్పా అనేది రాగం లేకుండా పారాయణం చేయబడుతుంది. మిగతా 3000 పాశురాలు ఇవాళ్టికీ సంగీతంతో పాడబడుతున్నాయి, ఇది ‘అరయ్యర్ సేవై’లో మనం చూడవచ్చు. ఉత్సవ సమయాల్లో పెరుమాళ్ ఊరేగింపు సమయంలో ఇయర్పా పారాయణం చేయబడుతుంది.

ఇప్పుడు ఈ పరిచయంలోని రెండవ భాగానికి ప్రవేశిదాం. ఇప్పుడు మనం ఒక్కొక్క ప్రబంధానికి సంక్షిప్త పరిచయం మరియు ముఖ్యమైన లక్షణాలను చూద్దాం.

తనియన్లు ఆచార్య వందనం. ఇవి గురుపరంపరకి మన ప్రార్థన. సామాన్య తనియన్లు (పొదు తనియన్) మరియు ప్రతి ప్రబంధానికి ప్రత్యేక తనియన్లు ఉంటాయి.

పెరియ పెరుమాళ్ మణవాళ మామునిగాళ్ ని తన ఆచార్యులగా స్వీకరించి, ఈ తనియన్‌ను సమర్పించారు:

శ్రీశైలేశ దయాపాత్రం ధీభక్త్యాది గుణార్ణవం |
యతీంద్ర ప్రవణం వందే రమ్య జామాతరం మునిం ||

ప్రతి ప్రబంధ పారాయణం ప్రారంభించే ముందు ఇది మొదటి తనియన్‌గా పారాయణం చేయబడుతుంది.

( జ్ఞానం, భక్తి, వైరాగ్యం వంటి గుణాలతో నిండినవారు, యతీంద్రుడైన రామానుజునిపై గొప్ప ప్రేమ కలిగినవారు, తన గురువు తిరువాయ్మొళిపిళ్లై యొక్క అనుగ్రహాన్ని పొందినవారు అయిన రమ్య జామాతృ ముని (మణవాళ మాముని)కి నమస్కరిస్తున్నాను.)

రమ్య జామాతృయోగీంద్ర పాదరేఖామయం సదా |
తథా యత్తాత్మ సత్తాధిం రామానుజ మునిం భజే ||

(పొన్నడికాళ్ జీయర్ యొక్క అష్ట దిగ్గజాలలో ఒకరైన దొడ్డయ్యంగార్ అప్పై రచించిన తనియన్)

ఇది వనమామలై మొదటి జీయర్ శ్రీ పొన్నడికాళ్ జీయర్ పై రచించిన తనియన్. ఇది మణవాళ మామునిగళ్ పాదరేఖల వలె అనిపించే శిష్యుని గూర్చి.

లక్ష్మీనాథ సమారంభాం నాథయామున మధ్యమాం |
అస్మదాచార్య పర్యంతాం వందే గురుపరంపరాం ||

ఇది శ్రీ కూరత్తాళ్వాన్ ఇచ్చిన తనియన్.

( లక్ష్మిదేవితో కలిసిఉన్న శ్రీమన్నారాయణుని నుండి ప్రారంభమై, నాథముని, యామునాచార్యుడు వంటి మహానుభావుల ద్వారా కొనసాగి, మధ్యలో రామానుజాచార్యునితో పాటు ఉన్న గురుపరంపరను నేను నమస్కరిస్తున్నాను. ఇది మనందరికీ వర్తిస్తుంది ఎందుకంటే మనము మన ఆచార్యుల గురుపరంపరపై ధ్యానం చేయవచ్చు)

యో నిత్యం అచ్యుత పదాంభుజ యుగ్మ రుక్మ
వ్యామోహతస్తథితరాణి తృణాయ మేనే |
అస్మద్గురోః భగవతోస్య దయైక సింధోః
రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే ||

ఇది జగదాచార్యులైన శ్రీ రామానుజుల పై గల తనియన్, దీనిని కూరత్తాళ్వాన్ సమర్పించారు. నమ్పెరుమాళ్ మన సంప్రదాయాన్నని ఎమ్పెరుమానార్ దరిశనమ్ అని పిలిచారు. 

(నిత్యం భగవంతుడైన అచ్యుతుని పాదపద్మాలపై గాఢమైన భక్తితో ఉండి, ఇతర వస్తువులను గడ్డి పోచ గ భావించే శ్రీ రామానుజాల పాదములను శరణముగా స్వీకరిస్తున్నాను.) 

మాతా పితా యువతయః తనయా విభూతిః
సర్వం యదేవ నియమేన మధన్వయానాం |
ఆధ్యస్య నః కులపతేః వకులాభిరామం
శ్రీమత్ తదంగ్రియుగలం ప్రణమామి మూర్ధ్నా ||

ఇది ఆళవందారు నమ్మాళ్వార్ పై చేసిన తనియన్.

( నమ్మాళ్వార్ నాకు అన్నీ – తల్లి, తండ్రి, సంతానం, సంపత్తి – ఆయనే. ప్రపన్నకుల నాయకులై, వకుళ పుష్పముల తో అలంకరించుకున్న వారి పాదములను ఎల్లప్పుడూ నా తల పై ధరిస్తున్నాను)

భూతం సరశ్చ మహదాహ్వయ భట్టనాథ
శ్రీ భక్తిసార కులశేఖర యోగివాహాన్ |
భక్తాంగ్రిరేణు పరకాల యతీంద్ర మిశ్రాన్
శ్రీమత్ పరాంకుశ మునిం ప్రణతోస్మి నిత్యం ||

శ్రీ పరాశర భట్టర్ ఇచ్చిన ఈ తనియన్ అందరు ఆళ్వార్లను నమ్మాళ్వార్ యొక్క అవయవాలుగా చూపిస్తుంది.

(ఈ తనియం లో నమ్మాళ్వార్ ని అవయవిగా, మిగిలిన ఆళ్వార్లన్నీ వారి  శరీరంలోని అవయవాల గా, రామానుజులని వారి పాదములుగా భావించడం జరిగింది.)

ఇప్పుడు మొదటి ప్రబంధం, ముదలాయిరం గురించి చూద్దాం. ముదలాయిరంలో ఈ క్రింద ఇవ్వబడ్డ ప్రబంధాలు ఉన్నాయి:

1. తిరుప్పల్లాండు (పెరియాళ్వార్)
2. కణ్ణినుణ్ శిరుత్తాంబు (మధురకవి ఆళ్వార్)
3. పెరియాళ్వార్ తిరుమొళి (పెరియాళ్వార్)
4. తిరుప్పావై (శ్రీ ఆండాళ్)
5. నాచ్చియార్ తిరుమొళి (శ్రీ ఆండాళ్)
6. పెరుమాళ్ తిరుమొళి (కులశేఖర ఆళ్వార్)
7. తిరుమాలై (తోండరడిప్పొడి ఆళ్వార్)
8. తిరుప్పళ్ళియెళుచ్చి (తోండరడిప్పొడి ఆళ్వార్)
9. అమలనాదిపిరాన్ (తిరుప్పాణాళ్వర్)
10. తిరుచ్ఛన్దవిరుత్తం (తిరుమజిశైయాళ్వార్)

శ్రీ నాథమునిగళ్ దివ్యప్రబంధాలను విభజించారు. అందులో మొదటి ప్రబంధం తిరుపల్లాండు. దీని తర్వాత కణ్ణినుణ్ శిరుత్తాంబు ఉంటుంది. ఆళ్వార్ తిరునగరిలోని ఆళ్వార్ సన్నిధిలో, ఎల్లప్పుడు మొదటగా కణ్ణినుణ్ శిరుత్తాంబు  పఠిస్తారు. అలాగే తిరునారాయణపురం దివ్యదేశంలో కూడా మొదటగా కణ్ణినుణ్ శిరుత్తాంబునే పఠించడం ఒక సంప్రదాయంగా ఉంది.

ముందుగా తిరుపల్లాండు గురించి చూద్దాం — మన సంప్రదాయంలో ఇది ప్రణవంకి సమానమైనదిగా భావించబడుతుంది. ఉపదేశరత్నమాలలోని 19వ పాశురంలో మామునిగళ్ ఇదే చెబుతూ, తిరుపల్లాండుని ప్రణవంతో పోల్చారు. వేదం పారాయణం ప్రణవంతో మొదలవుతుంది, అంతే కాక చివరికి కూడా ప్రణవంతో ముగుస్తుంది కదా. అదే విధంగా, దివ్యప్రబంధం పారాయణం తిరుపల్లాండుతో మొదలై తిరిగి తిరుపల్లాండుతోనే ముగుస్తుంది.

ఇంకా, ప్రణవం లో వేదసారం ఉన్నట్టే, తిరుపల్లాండులో కూడా దివ్యప్రబంధ సంపూర్ణ సారం ఉంది.

పెరియాళ్వార్ శ్రీవిల్లిపుత్తూరులో జన్మించారు. అక్కడ వారు  ఎంపెరుమాన్‌కి పుష్ప కైంకర్యం చేశారు. వారికి  కన్నన్ ఎంపెరుమాన్పై అపారమైన భక్తి ఉండేది. శ్రీమద్భాగవతంలోని మాలాకారుని చరిత్రను చదివిన తర్వాత, ఆ ప్రభావంతో నిర్మలమైన, మహత్తరమైన పుష్పమాలల కైంకర్యం చేయాలని సంకల్పించారు.

అలాంటి సమయంలో, పాండ్య రాజు ఒక ప్రకటన చేసాడు. ఈ లోకంలో వచ్చే ఫలితాలు మరియు పరమపదంలో వచ్చే ఫలితాల మధ్య తేడా ఏమిటో చెప్పి, నిజమైన పరతత్వం ఎవరో నిరూపణం చేసిన వారికి బంగారపు నాణేలతో నిండిన మూట బహుమతిగా ఇస్తానని రాజు ప్రకటిచాడు. ఆయన మంత్రి శెల్వ నంబి, ఈ పద్ధతిని సూచిస్తాడు.
ఈ సమయంలో ఎంపెరుమాన్ ఆజ్ఞ మరియు కృపతో, పెరియాళ్వార్ అక్కడకు వెళ్లి పరతత్వాన్ని స్థాపించి, ఆ బహుమతిని గెలుచుకుంటారు.

రాజు ఆనందంతో ఆళ్వార్‌ని తన రాజ ఏనుగుపై కూర్చోబెట్టి, ఊరంతా ఊరేగింపుగా తీసుకెళ్తాడు.
అప్పుడు గరుడ వాహనంపై శ్రీమన్నారాయణుడు, లక్ష్మీ దేవితో కలసి ఆకాశంలో దర్శనం ఇస్తాడు.

అందరూ చూస్తుండగా, పెరియాళ్వార్ భక్తి భావనతో విపరీతమైన ఆనందంలో మునిగి, ఎంపెరుమాన్‌కు ఏదైనా హాని జరుగుతుందేమో అన్న భయంతో, వెంటనే: “పల్లాండు. పల్లాండు.”
అని మంగళాశాసనం చేస్తూ ఆలపించటం ప్రారంభిస్తారు.

మంగళాశాసనం అంటే పెద్దవారు చిన్నవారికి ఆశీర్వాదం చేయడం మాత్రమే కాదు — ఎవరికైనా, ఎవరి హృదయంలో భక్తితో కూడిన ప్రేమ ఎక్కువగా ఉంటే, వారు కూడా మంగళాశాసనం చేయవచ్చు.
అందుకే, వారికి “పెరియాళ్వార్” అనే విశిష్టమైన పేరు వచ్చింది. వారి అన్ని పాశురాలు మంగళశాసన రూపంగానే ఉంటాయి. భక్తులందరిని కూడబెట్టి పెరుమాళ్ళకు మంగళశాసనం చేయించాలని వారి కోరిక. 

పెరియాళ్వార్ తనియన్ ఒక ముఖ్యమైన విషయాన్ని సూచిస్తుంది — అంటే, ఈ ఆళ్వార్‌ ఏ ఆచార్యుని దగ్గర విద్యను అభ్యసించి జ్ఞానాన్ని పొందలేదు. ఎంపెరుమాన్ ఆయన్ని స్వయంగా ఎంచుకుని, దోషరహితమైన జ్ఞానాన్ని ప్రసాదించాడు. ఇదే ఆయన ప్రత్యేకతల్లో ఒకటి. ఇంకొక విశేషం ఏమిటంటే — ఆయన శ్రీ రంగనాథుని మామగారు కావడం. తిరుపల్లాండు మొదటి రెండు పాశురాలలో, ఆళ్వార్ తనవంతుగా మాత్రమే ఎంపెరుమాన్‌కు మంగళాశాసనం చేస్తాడు. మూడవ పాశురంలో, తనలాంటి ఇతర భాగవతులను పిలుస్తాడు — “మీరు కూడా వచ్చి మంగళాశాసనం చేయండి.” అని. నాలుగవ పాశురంలో, కైవల్యార్థుల్ని (అంటే, తమ ఆత్మ స్వరూపాన్ని ఆనందించడం లో మాత్రమే తప్ప, ఎంపెరుమాన్‌కు కైంకర్యం చేయాలని ఆసక్తి లేని వారు) పిలుస్తారు . ఐదవ పాశురంలో, ఐశ్వర్యార్థులను పిలుస్తారు — అంటే, ఈ లోకంలో కొత్త ధనం సంపాదించాలనుకుంటున్నవారు లేదా కోల్పోయిన ధనాన్ని తిరిగి పొందాలనుకునేవారు. ఆరవ నుండి ఎనిమిదవ పాశురాల వరకు, వీరు ఒక్కొక్కరిగా విచ్చేస్తారు. తొమ్మిదవ నుండి పదకొండవ పాశురాల వరకు, పెరియాళ్వార్ వారందరితో కలసి మంగళాశాసనం చేస్తారు. చివరిగా, పన్నెండవ పాశురంలో, ఈ ప్రబంధాన్ని ముగిస్తూ, ఈ మంగళాశాసనాల ఫలితాన్ని (ఫలమ్) వివరంగా తెలియజేస్తారు- ఈ లోకంలోను, పరమపదంలోను కూడా – శాశ్వతముగా ఎంపెరుమాన్‌కి మంగళాశాసనం చేయగల గొప్ప వరం (ప్రాప్తి) లభిస్తుంది. ఈ మంగళాశాసనం అనే లక్షణం, మన జీవాత్మ స్వరూపానికి అనుగుణమైనది. మన నిజ స్వరూపం ఏమిటంటే — జీవుడు ఎల్లప్పుడూ పరమాత్మకు అధీనుడై ఉండాలి, అన్న భావన. కావున, మనకు కావలసిన ఆశయమే — మన యజమాని అయిన ఎంపెరుమాన్‌కు ఎప్పటికప్పుడు మంగళము చేకూరాలని ఆలోచిస్తూ, ఆయనకు ఎప్పుడూ శుభం, జయం కలగాలనే కోరిక ఉండాలి. దీనివల్ల ఈ ప్రబంధం యొక్క అసలైన ఫలితం జీవుడు ఎప్పటికీ ఎంపెరుమాన్‌కి మంగళాశాసనం చేస్తూ ఉండే స్థితిని పొందడమే.

కణ్ణినుణ్ శిరుత్తాంబు

“కణ్ణినుణ్ శిరుత్తాంబు” ని మధురకవి ఆళ్వార్ మనకు ఇచ్చారు. వారు అవతరించిన స్థలం తిరుక్కొల్లుర్ దివ్యదేశం, ఇది అళ్వార్ తిరునగరి సమీపంలో ఉంది. అక్కడి ప్రధాన దైవం  శ్రీ శ్రీ వైత్తమానిధి పెరుమాళ్. ఆళ్వార్ ఉత్తర భారతదేశం వరకు ప్రయాణించి అక్కడ కైంకర్యం చేసేవారు. ఆయన అక్కడ నివసిస్తున్నప్పుడు, ఒక రోజు, తన నిత్య కర్మలు చేస్తున్నప్పుడు, దక్షిణం నుండి ఒక ప్రకాశమైన కాంతిని గమనించారు. ఆసక్తి వల్ల, ఆ కాంతిని అనుసరించి, అళ్వార్ తిరునగరికి చేరుకున్నారు. కాంతి మాయమవడంతో, ఆయన చుట్టూ ఎవరైనా జ్ఞానవంతులు మరియు మహానుభావులు ఉన్నారో అని అన్వేషించారు. పట్టణ ప్రజలు ఆయనకు తిరుప్పులియాజ్వారును సూచించారు (దివ్యమైన చింత చెట్టు) మరియు ఆ చెట్టు క్రింద డెహణం లో ఉన్న నమ్మాళ్వార్ల గురించి చెప్పారు.

మధురకవి ఆళ్వార్, నమ్మాళ్వార్ కన్నా వయస్సులో పెద్దవారు. ఆయన నమ్మాళ్వార్లని చూసినప్పుడు అనుభూతి చెందిన అవ్యఖ్యాత ఆనందం, ఆయనను ఒక మహా జ్ఞాని మరియు ఎమ్పెరుమానుడి అద్భుత భక్తుడిగా భావించడం వల్ల. ధ్యాన స్థితి నుండి ఆయనను బయటకు తేవడానికి, మధురకవి ఆళ్వార్ ఒక చిన్న రాయి వారి ముందుకు విసిరారు. నమ్మాళ్వార్ కన్నులు తెరిచి, మధురకవి ఆళ్వార్ ని చూసారు. అప్పుడు మధురకవి ఆళ్వార్ ఒక ప్రశ్న అడిగారు – “సెత్తత్తిన్ వైరిలో సిరియదు పిరందాల్, ఎత్తైతిన్ ఎంగే కిడక్కుమ?”

నమ్మాళ్వార్ తమ మొదటి పలుకులు ఇలా పలికారు “అత్థయిత్ తిన్రు  అంగే కిడక్కుమ్”

ఈ వాక్యం యొక్క అర్థం – ఒక జీవాత్మ ఒక అచిత్ (శరీరము) లో ఉన్నప్పుడు – అది ఏం ఆనందించు మరియు ఎక్కడ ఉంటుంది? దీని మీద నమ్మాళ్వార్  ఈ విధంగా సమాధానం ఇస్తారు, “జీవాత్మ కర్మలో నిమగ్నమైనప్పుడు, అది శరీరంలో ఉంటుంది మరియు అదే ఆనందాన్ని అనుభవిస్తుంది.” ఇది విన్నప్పుడు, మధురకవి ఆళ్వార్ స్పష్టతను పొందారు మరియు నమ్మాళ్వార్ యొక్క గొప్ప జ్ఞానాన్ని గ్రహించారు. ఆయన ఆళ్వార్ యొక్క గొప్పతన్నాని అర్థం చేసుకుని ఆయనను తన ఆచార్యులగా సేవించడం మొదలుపెట్టారు ఆయన తిరువాయ్మోళి మరియు ఇతర ప్రబంధాలను నమ్మాళ్వార్ నుండి నేర్చుకున్నారు. ఆయన ఈ ప్రబంధాలను భవిష్యత్తు కోసం నమోదు చేసి, నమ్మాళ్వార్ కు సేవలు కొనసాగించారు. 32 సంవత్సరాల తర్వాత నమ్మాళ్వార్ పరమపదానికి వేంచేయగా, మధురకవి ఆళ్వార్ తన ఆచార్యుల పట్ల విరహం వల్ల దుఃఖంతో మునిగిపోతారు. అయితే, తన ఆచార్యుల  వైభవాన్ని ప్రపంచంలో విస్తరించడానికి, “కణ్ణినుణ్ శిరుత్తాంబు” అనే ప్రబంధాన్ని రచించారు. ఇది ఒక చిన్న మరియు మధురమైన ప్రబంధం. మణవాళ మామునిగల్ తన ఉపదేశ రత్తినమాలై, పాశురం 26 లో ఈ ప్రబంధం యొక్క గొప్పతనాన్ని వర్ణించారు.

వాయ్ త్త తిరుమందరత్తిన్ మత్తిమమామ్ పదంబోల్ 
శీర్ త్త  మధురకవి శెయ్ కలయై  ఆర్త పుగళ్
ఆరియర్ గళ్ అరుళిచ్చెయళ్ నడువే
శేర్ విత్తార్ తార్పఱియమ్  తేర్ న్దు

అంటే మధురకవి ఆళ్వార్ రాసిన ఈ ప్రసిద్ధి “తిరుమంత్రం”లోని మధ్యభాగమైన “నమః” వలె ఉంది. మన పూర్వాచార్యులు ఈ ప్రబంధంలోని గంభీరార్థాన్ని తెలుసుకుని, అది నమ్మాళ్వార్‌పై ఆధారపడి ఉండటాన్ని గుర్తించి, దీన్ని దివ్యప్రబంధంలో భాగంగా చేర్చారు. ఈ ప్రబంధం స్పష్టంగా చెబుతుంది — ఎమ్పెరుమాన్ కన్నా ఆయన భక్తుడికి సేవ చేయడమే అసలైన మార్గమని.

మధురకవి ఆళ్వార్ ఈ ప్రబంధం ద్వారా తన ఆచార్యులైన నమ్మాళ్వార్ల  వైభవాన్ని వివరించారు. అందుకే, శ్రీమన్నాథముని మొదలైన మన పూర్వాచార్యులు, దీనిని తిరుమంత్రంలో “నమః” భాగంతో సమానంగా భావించారు.

ఈ ప్రబంధంలో — మధురకవి ఆళ్వార్ చెబుతున్నారు:
“తేవు మత్తరియేన్, కురుగూర్ నమ్బి, పావినిన్నిశై పాడిత్తిరివనే”
అంటే, “నా ఆచార్యులైన కురుగూర్ నంబిని తప్ప ఇంకెవరినీ దేవుడిగా నేను అనుకోను. ఆయన పాటలను పాడుతూ నా జీవితాన్ని గడుపుతాను.”

ఈ విధంగా, ఆయన ఆచార్య భక్తిని — భగవద్భక్తికన్నా గొప్పదిగా స్థాపించారు. అందుకే మధురకవి ఆళ్వార్, ఇతర ఆళ్వార్లకంటే ప్రత్యేక స్థానం పొందారు. మన పూర్వాచార్యులు — మధురకవి ఆళ్వార్, వడుగ నంబిలాగే ఉండాలని ఆకాంక్షించారు. వడుగ నంబికి రామానుజులవారే అన్నీ. మధురకవికి నమ్మాళ్వార్లే అన్నీ.

ఈ ప్రబంధంలో మొత్తం 11 పాశురాలు ఉన్నాయి. వీటిలో నమ్మాళ్వార్ వైభవం చక్కగా చెప్పబడింది .
“మిక్క వేదియర్ వేదత్తినుట్పొరుళ్…” పాశురంలో వేదాల్లో నిపుణులైన వారు నా అజ్ఞానం వలన నన్ను అంగీకరించలేదు. కానీ నమ్మాళ్వార్ నన్ను ఎలాంటి సంశయం లేకుండా అంగీకరించి, సత్యమైన జ్ఞానాన్ని దయతో నాకు ప్రసాదించారు. నన్ను తీర్చిదిద్దారు. “పయనంరాగిలుం పాంగలర్ ఆగిలుం, సేయల్ నన్రాగ త్తిరుత్తి పనికొల్వాన్”  అంటే — “నా వల్ల ఏ ఉపయోగం లేక పోయినా, నన్ను సరిచేస్తూ,  కైంకర్యానికి అర్హుడిగా చేసినవారు నమ్మాళ్వారే.”

అలాగే, నమ్మాళ్వార్ యొక్క కృప, ఎమ్పెరుమాన్  కృపకన్నా గొప్పది, ఈ లోకంలో దొరికే ఎటువంటి కృప కన్నా గొప్పది అని సాయించారు. ఎమ్పెరుమాన్ మనకు శ్రీ భగవద్గీతను ఇచ్చాడు — అది అర్థం చేసుకోవడం చాలా క్లిష్టమైనది, కేవలం కొంతమంది అర్హులైనవారే దాన్ని అధ్యయనం చేయగలరు.
అయితే నమ్మాళ్వార్ మనకు తిరువాయిమొళి ఇచ్చారు, అది సులభంగా అర్థమయ్యేలా ఉండి, అందరికీ చదవదగినది ఉంది.

ఈ ప్రబంధంలోని చివరి పాశురంలో,  “నా ఆచార్యులకి అత్యంత ప్రీతిపాత్రుడైన నేను, చెప్పిన ఆచార్యభక్తిని అంగీకరిస్తారో వారు తప్పకుండా శ్రీవైకుంఠానికి చేరుకుంటారు” అని సాయించారు. ఇక్కడ మన పూర్వాచార్యులు అద్భుతమైన వ్యాఖ్యానం అందించారు.  మధురకవి ఆళ్వార్ శ్రీవైకుంఠం లభిస్తుందని ఎందుకు చెప్పాడు? తిరుకురుగూరు (నమ్మాళ్వార్ నివాసస్థలం) లభిస్తుందని ఎందుకు చెప్పలేదు?
ఇందుకు అళగియ మణవాళపెరుమాళ్ నాయనార్ వంటి వ్యాఖ్యాతలు తిరుకురుగూర్ను ఆధి పిరాన్ ఎమ్పెరుమాన్ మరియు నమ్మాళ్వార్ కలిసి పాలిస్తారు. కానీ శ్రీవైకుంఠంను కేవలం వానవర్ (ఎమ్పెరుమాన్ భక్తులు) మాత్రమే పాలిస్తారు.  అందువల్ల అక్కడ నమ్మాళ్వార్ రాజులా ఉంటారు అని చెబుతారు. ఇంకా, మధురకవి ఆళ్వార్ ఎమ్పెరుమాన్ ని దర్శించుకోవడమూ, తమ ఆచార్యులకి ఆనందంగా ఉండాలని మాత్రమే, కానీ తనకు ఎమ్పెరుమాన్  కృప కావాలని కాదు. అందుకే, ఈ ప్రబంధం ఎంతో అమూల్యమైనదిగా భావించబడుతుంది. ఇది ప్రణవం (తిరుప్పల్లాండు) తర్వాత వచ్చే “నమః” పదానికి సమానంగా భావింపబడుతుంది. ఇతర దివ్యప్రబంధాలు అన్నీ ఎమ్పెరుమాన్ వైభవం, లీలలు, కళ్యాణగుణాలు వర్ణించాయి. 

అడియేన్ ఉషా రామానుజ దాసి
అడియేన్ శ్రీకాంత్ రామానుజాదాసన్ 

ఆధారం: https://youtu.be/0-xCdMtv1tg

ఆంగ్లం లో: https://divyaprabandham.koyil.org/index.php/2023/11/simple-guide-to-dhivyaprabandham-part-1/

మూలము : https://divyaprabandham.koyil.org

ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org