దివ్యప్రబంధ  సరళ మార్గదర్శిని – నాల్గవ భాగం (పెరియ తిరుమొళి, తిరుక్కుఱున్దాణ్డకమ్, తిరునెడున్దాణ్డమ్)

శ్రీ:  శ్రీమతే శఠగోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

పూర్తి వ్యాసమాలిక

మూడవ భాగం

ఈ వ్యాసంలో మనం పెరియ తిరుమొళి, తిరుక్కుఱున్దాణ్డకమ్, తిరువెళుక్కూర్ర్టిరుక్కై, శిరియ తిరుమడల్, పెరియ తిరుమడల్, తిరునెడున్దాణ్డకమ్ గురించి తెలుసుకోబోతున్నాము.

మునుపటి వ్యాసాలలో మనం ఈ క్రింది ముఖ్య విషయాలను తెలుసుకున్నాము:

  • దివ్య ప్రబంధం అంటే ఏమిటి?
  • ప్రతి దివ్య ప్రబంధం యొక్క లక్ష్యం ఏమిటి?
  • దివ్య ప్రబంధం ఎలా ప్రకటించబడింది?
  • దివ్య ప్రబంధాన్ని ఎవరు రక్షించారు?
  • పత్తు/పదిగం అంటే ఏమిటి?

ఇప్పుడు మనం తిరుమంగై ఆళ్వార్లుల గ్రంథాలను పరిశీలించబోతున్నాము.

తిరుమంగై ఆళ్వార్లు రచించిన దివ్యప్రబంధాలు:
పెరియ తిరుమొళి, తిరుక్కుఱున్దాణ్డకమ్, శిరియ తిరుమడల్,  తిరునెడున్దాణ్డకమ్, పెరియ తిరుమడల్. 

వీటిలో, పెరియ తిరుమొళి, వీటిలో తిరుక్కుఱున్దాణ్డకమ్,తిరునెడున్దాణ్డకమ్ రెండవ ఆయిరంలో (ఇరండాం ఆయిరం) ఉన్నాయి.

మిగతా మూడు, తిరువెళుక్కూఱ్రిరుక్కై, శిరియ తిరుమడల్ , పెరియ తిరుమడల్ ఇయర్పాలో (ఇయర్పా), మూడవ ఆయిరంలో ఉన్నాయి.

తిరుమంగై ఆళ్వార్ చరిత్ర:

ఆళ్వార్లు తిరుక్కురయిలూర్ (తిరువాళి-తిరునగరి సమీపంలో) జన్మించారు. వీరికి  చిన్నతనంలో ఎమ్పెరుమాన్ మరియు భగవత్ విషయాల పట్ల ఆసక్తి ఉండేది కాదు. శక్తివంతమైన శరీరం, పోరాట పటిమ,  జ్ఞానం కలిగిన వీరిని రాజు సైన్యాధిపతిగా నియమించి ఒక చిన్న ప్రాంతాన్ని పాలించేందుకు ఇచ్చాడు.

ఆ తర్వాత ఎమ్పెరుమాన్ వారికి  “మయర్వర మధినలమ్” అన్నట్టుగా అనుగ్రహించి , నిజమైన జ్ఞానాన్ని, భక్తిని ప్రసాదించి వారి లోని అజ్ఞానాన్ని తొలగించాడు.

ఈ కృప ద్వారా, మొదట ఆయనకు భాగవత సంబంధం కలిగింది, కుముధవల్లి నాచ్చియార్ ద్వారా. ఆమె ఒక దేవతా స్త్రీ. ఆమెను చూసిన వెంటనే ఆమె అందానికి ఆకర్షితులైన నీలన్ (ఆళ్వార్లు) ఆమెను వివాహం చేసుకోవాలని కోరతారు. ఆమె ఒక శ్రీవైష్ణవుడిని మాత్రమే  తాను పెళ్లి చేసుకుంటానని, ఆ శ్రీవైష్ణవుడు పంచసంస్కారం పొందినవాడై ఉండాలని చెబుతుంది. వెంటనే నీలన్ తిరునరయూరు నంబిని ఆశ్రయించి పంచసంస్కారం అనుగ్రహించమని ప్రార్ధిస్తారు. 

ఆ తర్వాత తమకు ఉన్న సంపదతో ప్రతిరోజూ తదీయారాధన (శ్రీవైష్ణవులను ప్రసాదంతో భోజనం పెట్టడం) చేయడం ప్రారంభిస్తారు. చివరకు సంపద అంతా ఖర్చవుతుంది. అయినప్పటికీ, దైవ సేవను కొనసాగించాలని సంకల్పించి తన ప్రాంతం గుండా వెళ్ళే ధనికులను దోచుకోవడం ప్రారంభిస్తారు.

శ్రీమన్నారాయణుడు, ఆచార్య స్వరూపంగా మానవరూపంలో అవతరించి బద్ధజీవులను కాపాడతాడని చెబుతారు. ఆ ప్రకారంగా, ఎమ్పెరుమాన్ నాచ్చియార్‌తో కలిసి కళ్యాణ వస్త్రధారణలో తిరుమంగై ఆళ్వార్లు ఉండే ప్రాంతానికి వస్తాడు. ఆళ్వార్లు, చాలా ధనం దొరుకుతుందన్న ఆశతో, పెండ్లి బృందాన్ని దోచుకుంటారు. చివరికి ఎమ్పెరుమాన్ పాదాలకు ఉన్న మెట్టెలను పంటితో తీసుకుంటారు. అయితే ఆ డబ్బు, ఆభరణాలతో ఉన్న మూటను ఎత్తలేకపోతారు. 

ఆళ్వార్లు, వధువుతో ఉన్న వరుణ్ని చూసి “నువ్వు ఏదో మంత్రం వేసి  ఈ బరువును ఎత్తనివ్వకుండా చేశావు” అంటాడు. అప్పుడాయన “అవును, మంత్రం ఉంది; వింటానంటే చెబుతాను” అంటాడు. వెంటనే ఆళ్వార్లు ఖడ్గం చూపించి చెప్పుమనగా, ఎమ్పెరుమాన్ తిరుమంత్రంను (ఓం నమో నారాయణాయ) ఉపదేశిస్తాడు – ఇది శ్రవణానందదాయకం, వేదసారాంశం, మానవుడిని బంధనాల నుండి విముక్తి చేసే శక్తి గలది. దీనివల్ల ఐశ్వర్యం, కైవల్యం, భగవత్ కైంకర్యం, ఎవరికీ ఏది కావాలంటే అది పొందవచ్చు. 

ఆళ్వార్లు తిరుమంత్రాన్ని విన్న అనంతరం, ఎమ్పెరుమాన్ శ్రీమహాలక్ష్మితో పాటు, గరుడుని మీద కూర్చున్న తన దివ్యమూర్తిని దర్షింపచేస్తాడు. అనంతరం, ఆయనకు నిర్హేతుక కృపతో నిర్మల జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. ఆళ్వార్లు మారిపోతారు; తమ జీవితాన్ని భగవత్ కైంకర్యానికి అంకితం చేస్తారు.

ఆళ్వార్లు, ఎమ్పెరుమాన్ అనుగ్రహాన్ని తెలుసుకొని, శ్రీమహాలక్ష్మితాయార్ యొక్క పురుషకారాన్ని అర్థం చేసుకుని, పెరియ తిరుమొళి, తిరువెళుక్కూర్ర్టిరుక్కై, శిరియ తిరుమడల్, పెరియ తిరుమడల్, తిరునెడున్దాణ్డకమ్ అనే 6 ప్రబంధాలను ప్రసాదించారు.  ఇవి నమ్మాళ్వార్లు యొక్క నాలుగు దివ్యప్రబంధాలకు అనుబంధంగా ఉన్న 6 అంగాలుగా పరిగణించబడతాయి.

చివరిగా ఎమ్పెరుమాన్ ఆళ్వార్లుకు ఆజ్ఞాపించి, తన శిష్యులతో కలిసి వివిధ దివ్యదేశాలకు వెళ్లి, అక్కడి అర్చావతార మూర్తులకు మంగళాశాసనము చేయమంటాడు. ఆ తర్వాత వారు పరమపదానికి వెళ్లుతారు.

ఆళ్వార్లు భారతదేశం అంతటా ప్రయాణించి 80కిపైగా దివ్యదేశాలు సందర్శించారు. అందులో 40కి పైగా దివ్యదేశాలను వారు మాత్రమే స్తుతించారు, ఇతర ఆళ్వార్లు గానం చేయలేదు. పెరియ తిరుమొళిలో, ఆళ్వార్లు ఈ దివ్యదేశాలకు మంగళాశాసనం చేస్తూ, పరమపదాన్ని అనుభవించినట్లు ఎమ్పెరుమాన్ వారికి అనుగ్రహించారు.

పెరియ తిరుమొళి త‌నియన్‌ 

కలయామి కలిధ్వంసం కవిం లోకదివాకరమ్
యస్య గోభిః ప్రకాశాభిరవిద్యాం నిహతం తమః

అర్ధం:
లోకానికి సూర్యుడిలా ప్రకాశించే కవిగా, కలియుగ దోషాలను నాశనం చేసే పరకాలనందనుడిని (తిరుమంగై ఆళ్వార్‌ను) ధ్యానిస్తున్నాను.
ఆయన తేజస్సుతో చీకటికి దారితీసే అజ్ఞానాన్ని తొలగిస్తారు. 

పెరియ తిరుమొళి మరియు ఆళ్వార్ యొక్క ఇతర రచనలను మనం అనుసంధానం చేస్తున్నప్పుడు  మరికొన్ని తనియన్లు కనిపిస్తాయి. 

ఆళ్వార్లు ఎమ్పెరుమాన్‌తో చాలా అనుబంధం కలిగి  ఉండేవారు, అదే విధంగా పెరుమాళ్ళకి కూడా ఆళ్వార్లంటే ఎంతో ప్రీతి. 

మామునిగళ్ తిరుమంగై ఆళ్వార్‌పై వడివళగు (వారి తిరుమేని యొక్క దివ్య సౌందర్యం) సమర్పించారు . 

తిరుమంగై ఆళ్వార్ రచనలు:

పెరియ తిరుమొళి:

ఆరు ప్రబంధములలో పెరియ తిరుమొళి మొదటిది. ఈ మధురమైన ప్రబంధంలో, తిరుమంగై ఆళ్వార్ ఎమ్పెరుమాన్ ఉన్న వివిధ దివ్యదేశాలను అనుభవించారు. ఆళ్వార్ తమ పాశురాలలో పేర్కొన్న ప్రతి దివ్యదేశానికి వేంచేసి, దివ్యదేశములకు మరియు ఎమ్పెరుమాన్లకు మంగళాశాసనము చేసిన సంగతి తెలిసిందే. వారు ప్రకృతి సౌందర్యం, జంతువులు, సరస్సు, చెట్లను కూడా అనుభవించారు, తమ ప్రబంధాలలో వివరించారు.

వీరు గతంలో ఆత్మను ఎండలో ఉంచి, శరీరాన్ని నీడలో ఉంచినవారు. ఆత్మను ఎండలో ఉంచడం అంటే—వీరు మొదట్లో భగవత్ విషయాల్లో ఆసక్తిని చూపకపోవడం. శరీరాన్ని నీడలో ఉంచడం అంటే—అనాదికాలంగా ఈలోక భోగాల్లో ఆసక్తి చూపుతూ, శరీర సంరక్షణలో నిమగ్నమై ఉండడం. కానీ నిజమైన నీడ భగవత్ విషయమే.

ఎంపెరుమాన్ ఆళ్వార్లు తమ కంటితో చూడలేని దాన్ని విశ్వసించరని గమనించి, ఇలా భావించెను: “ఈ లోకసుఖాల వలెనే నేను కూడా వారి కళ్ల ముందే ప్రత్యక్షంగా ఉంటే, వారు నన్ను తిరస్కరించలేరు.” అని భావించి, తాను ఎంతో ఇష్టపడే దివ్యదేశాలను (ఉగందరుళిన నిలయాలను) ఆశ్రయించి, ఆళ్వార్లులను అంగీకరించాడు. తన సమస్త స్వరూపాలను, లక్షణాలను ఆళ్వార్లులకూ దర్శింపజేసి, ఆళ్వార్లులకు ఆ పరమానందానుభవాన్ని అనుభవింపజేశాడు. దీని వలన ఆళ్వార్లు ఆయన విరహాన్ని తట్టుకోలేని స్థితికి చేరారు. భూలోకంలోనే ఉండగలిగినంతకాలం పరమపదవాసుల స్థితిని పొందారు. చివరికి ఆ పరమపదాన్ని పొందేందుకు కూడా ఎంపెరుమాన్ అవకాశం కల్పించాడు. ఇవన్నీ ఈ ప్రబంధాల్లో వివరించబడ్డాయి.

ఎంపెరుమాన్ తన సౌందర్యాన్ని (తిరుమేని అళగు) ఆళ్వార్లులకు చూపించి, వారిని మంత్రిముగ్ధుల్ని చేశాడు.

పెరియ తిరుమొళిలోని మొదటి పదిగం ‘వాడినేన్ వాడి’లో ఆళ్వార్లులు తిరుమంత్ర మహిమను వివరించారు. ఈ తిరుమంత్రం బదరికాశ్రమంలో ఉద్భవించింది. ఈ తిరుమంత్రం మనం మనకు రక్షకులు కాదని, ఎంపెరుమాన్ కి సేవకులమని స్పష్టంగా తెలుపుతుంది. ఈ  విషయాన్ని మనం దివ్యదేశాలలో ఉన్న ఆర్చా మూర్తుల వద్ద శరణాగతి చేసి గ్రహించవచ్చు అనే విషయాన్ని మనకు దివ్యప్రబంధాలు బోధిస్తాయి.

తొలుత, ఆళ్వార్లులు భౌతిక విషయాలలో లీనమై ఉన్నారన్న విషయాన్ని గమనించిన ఎంపెరుమాన్, “శాస్త్రం చూపిస్తే లాభం లేదు, ఎందుకంటే వీరు ఇతర విషయాలలో ఆసక్తి కలిగి ఉన్నారు; కాబట్టి నా తిరుమేనిఅళగును చూపించి వీరిని ఆకర్షించాలి” అని ఆలోచించి, ఆ ఆసక్తిని సాధనంగా భావించి తన అందాన్ని ఆళ్వార్లులకు దర్శింపజేశాడు.

ఆళ్వార్లులు దివ్యదేశాలలో ఎంపెరుమానిని దర్శించునపుడు, పరమపదానుభవాన్ని వారికి అనుగ్రహించాడు. 

ఇది చూసిన ఆళ్వార్లులు ‘వాడినేన్ వాడి [పెరియా తిరుమొళి మొదటి శతకం]’ నుండి ‘ఒరునల్ శుర్ట్రమ్ [పెరియా తిరుమొళి శతకం10వ శతకం]’ వరకూ ఎంపెరుమాని వేంచేసి ఉన్న దివ్యదేశాలను శరణ్యంగా, సాధనంగా భావించి, వాటి అనుభవంలోనే మునిగిపోయారు. 

ఆళ్వార్లులు ఎల్లప్పుడూ దివ్యదేశాల పట్ల ఆసక్తిగా ఉండటం గమనించిన ఎంపెరుమాన్, “ఇతడు నా అందాన్ని ఈ లోకంలోనే అంతగా ఆస్వాదిస్తే, పరమపదానికి వెళ్లే ఆసక్తి ఎలా కలుగుతుంది? కాబట్టి, ఈ అనుభవాన్ని ఎటువంటి అంతరాయం లేకుండా కొనసాగించదగిన ప్రత్యేక స్థలమైన పరమపదానికి తీసుకెళ్లాలి. అందుకు ముందు ఈ లోకంలోని దోషాలను చూపాలి” అని ఆలోచించాడు. అందుకే ఈ సంసారంలోని చెడును చూపించాడు. 

దీనిని గమనించిన ఆళ్వార్లులు విపరీతంగా భయపడిపోయారు. ‘మార్ట్రమ్ ఉళ’ [పెరియ తిరుమొళి 11.8],లో ఎమ్పెరుమాన్ ని ‘ఇరు పాడు ఎరి కొల్లియిన్ ఉల్ ఎరుంబే పోలె’ [11.8.4] – రెండు అగ్ని శిక్షల  మధ్య చిక్కుకున్న చీమలా, ‘ఆత్తఙ్గరై వాళ్ మరమ్ పోల్’ [11.8.1] – ఎప్పుడు జల ప్రళయం ముంచుకువస్తుందోనని భయపడుతూ నది ఒడ్డున వున్న వృక్షంలా, ‘పామ్బోడొరు కూరైయిలే |పయిన్ఱాప్పోల్’ [11.8.3] – పాముతో కలిసి బ్రతుకుతున్న వాడిలా, అని ఇటువంటి ఎన్నో ఉపమానాలతో తమకున్న భయాన్ని చెప్పారు.
ఒకవేళ ధనాన్ని పట్టు వస్త్రంలో ఇచ్చినట్లయితే అది ఎంతో విలక్షణమైనదిగా భావించబడుతుంది, ఆనందం కలుగుతుంది. అలాగే, తిరుమంత్రంలో ఎంపెరుమాన్ తన గుణాన్ని, స్వరూపాన్ని, రూపాన్ని, విభూతిని చూపిస్తాడు. ఈ తిరుమంత్రం అనగా – పట్టు వస్త్రము లాంటి మంత్రం, అందులో ఎంపెరుమాన్ యొక్క గుణాన్ని, స్వరూపాన్ని, రూపాన్ని, విభూతిని దాగి ఉంటాయి. ఈ మహిమను ఆయన ఆళ్వార్లకు దర్శింపజేస్తాడు.

ఆళ్వార్లు ఆర్చావతారాన్ని, దివ్యదేశాలలో కలిగే పరమానందాన్ని ఆస్వాదించారు. వారు సంసారమూ, పరమపదమూ మధ్య తేడా కూడా గుర్తించలేనంతగా ఈ అనుభవంలో మునిగిపోయారు. అయితే, ఇది శాశ్వత స్థానం కాదని వారు గ్రహించాలని, పెరుమాళ్ళు వారికి సంసార భయాన్ని చూపించారు.  

తిరుక్కుఱున్దాణ్డకమ్

సంసారభయంతో భయపడుతూ, శరీరబంధం వల్ల బాధపడుతున్న ఆళ్వార్లును చూసి, పరమాత్మా “ఇలాంటి భయములో ఉన్నవాడు నా గుణాలను పాడలేడు. అతడిని దివ్యదేశముల సేవలో నిమగ్నం చేయాలంటే, అతనికి నా గుణాలను అనుభవించే అవకాశం ఇవ్వాలి.” అని నిర్ణయించుకున్నాడు. 

ఏ విధంగా అయితే విపరీతమైన దాహంతో ఉన్నవాడు నీటిలో దూకి, తన మీద నీళ్లు పోసుకోవడం మొదలైనవి చేస్తాడో, ఆళ్వార్లు తమ నోటితో పేరుమాళ్ళను స్తుతిస్తూ, శిరస్సుతో వందనం చేస్తూ, మనస్సుతో ధ్యానిస్తూ  తమను తాము నిలబెట్టుకోవాలని  తిరుక్కుఱున్దాణ్డకంలో ఎమ్పెరుమాన్ని శరణాగతి చేశారు.

మొదటి పాశురంలో ఆళ్వార్లు అంటారు 

నిధియినైప్ పవళత్తుణై నెఱిమైయాల్ నిజైయ వల్లార్
కధియినైక్ కంజన్ మాలక్ కండు మున్ అణ్డమాళుమ్ 
మతియినై మాలై వాళిత్తి వణంగి ఎన్ మనత్తు వంధ
విధియినై కాందు కొన్డ తొండనేన్ విడుగిలేనే

పరమాత్ముడు మనకు కష్టకాలంలో ఉపయోగ పడే నిధిలాంటివాడు, అందరికి ప్రియమైన పగడం వంటి వాడు, అందరిని ఆధారంగా నిలబెట్టే స్థంభం వంటి వాడు. భక్తుల గమ్యస్థానమూ అతనే , అందరి లోకాలకు పాలకుడు, ఆయన ఎల్లప్పుడూ భక్తుల గురించే ఆలోచిస్తూ ఉంటారు మరియు వారిని ప్రేమిస్తారు.  అలాంటి వాడు నా మనస్సులో ఒక అందమైన స్థానం ఆక్రమించుకున్నాడు. నేను స్వయంగా అతనిని చూశాను, ఇక నాకు వేరే ఎవరూ శరణం కాదు, నేను ఎవరి వద్దకూ పోను. .

19వ పాశురంలో 

పిండియార్ మండై ఏంధిప్ * పిరర్ మనై తిరిధంధు ఉణ్ణుం
ముండియాన్ శాపం తీర్థ్త * ఒరువన్ ఊర్ ** ఉలగం ఏత్తుం
కండియూర్ అరంగం మేయ్యం * కొచ్చి పేర్ మల్లై యెన్ఱు
మండినార్ * ఉయ్యల్ అల్లాల్ * మత్తైయార్కు ఉయ్యలామే?

ఆళ్వార్లు చెబుతున్నారు – పరమాత్ముని తప్ప ఏ ఇతర ఆశ్రయం లేని వారు మాత్రమే ఉజ్జీవించగలరు. .

చివరి పాశురంలో 

వానవర్ తంగళ్ కోణుమ్ * మలర్ మిసై అయనుం * నాళుం
తేమలర్ తూవి ఏత్తుమ్ * సేవడిచ్ చెంగణ్ మాలై
మానవేల్ కలియన్ సోన్న * వణ్ తమిళ్ మాలై నాలైనదుం 
ఊనమధిన్రి వల్లార్ * ఒళివిశుమ్బు ఆళ్ వర్ తామే 

కలియన్ (తిరుమంగై ఆళ్వార్లు) ఇలా అంటారు – ఈ తిరుక్కురుందాండగంలోని 20 పాశురాలను, ఏ కోరికలూ  లేకుండా, కేవలం శరణాగతి భావంతో పాడినవారు పరమపదానికి చేరుకుంటారు. ఈ పాశురాలు పరమాత్ముని గుణాలను కీర్తిస్తాయి. 

తిరునెడున్దాణ్డకమ్

తిరుమంగై ఆళ్వార్లు మొదట సంసారిక జీవితం గడుపుతుండేవారు. వారికి ఎమ్పెరుమాన్ కృప కలగడంతో వారు పూర్తిగా మారిపోయారు. తిరుమంగై ఆళ్వార్లు మొదటగా పెరియ తిరుమొళి రచించారు. ఈ ప్రబంధం చివర్లో వారు “ఈ దేహ సంబంధం తొలగడ్డానికి అనుగ్రహించమని ” ఎమ్పెరుమాన్ ను ప్రార్థించారు.

వారి  రెండవ ప్రబంధమైన తిరుక్కురుందాండగంలో, ఎమ్పెరుమాన్ వెంటనే దర్శనం ప్రసాదించకుండా మరింత తాపం కలగాలని ఉద్దేశించి ఆలస్యం చేశాడు. ఈ ఆలస్యం భరించలేని స్థితిలో,  దాహంగా ఉన్నవాడు నీళ్లు తాగుతూ, ఆ నీటిలో తాను మునిగి పోయి, తనపై చల్లుకున్నట్టు  తిరుమంగై ఆళ్వార్లు కూడా ఎమ్పెరుమాన్పై మాట్లాడుతూ, నమస్కరిస్తూ, ఆయన గురించి ఆలోచిస్తూ, తాపాన్ని తగ్గించుకునేందుకు ప్రయత్నించారు. ఈ సమయంలోనే ఎమ్పెరుమాన్ తన అద్భుతమైన గుణాలను వారికి దర్శింపచేసాడు. 

దాహంతో ఉన్నవాడు కొద్దిగా నీరు త్రాగితే, అది అతని దాహం మరింత పెంచినట్టు, తిరుమంగై ఆళ్వార్లకు కూడా ఎమ్పెరుమాన్ మీద మరింత తాపం పెరిగింది. అందుకే వారు తన మూడవ ప్రబంధమైన తిరువెళుకూర్రిరుక్కయిలో, తిరుక్కుడందై ఆరావముదన్ వద్ద తీవ్ర తాపంతో శరణాగతి చేశారు. ఇది ఓ శరణాగతి ప్రబంధం.

తిరువెళుక్కూర్ర్టిరుక్కై తరువాత తిరుమంగై ఆళ్వార్లు రెండు తిరుమడల్లు రచించారు. ఇవి నాయికా భావంతో కూడిన గాథలు —

  • శిరియ తిరుమడల్ – ఇది శ్రీకృష్ణుని గాథలతో,
  • పెరియ తిరుమడల్ – ఇది తిరునరయూరులోని నంబి (తిరునరయూరు అనే దివ్యదేశం, కుంభకోణం సమీపంలో) సంబంధంగా  ఉంటుంది.

మడలూర్దల్ అంటే, నాయిక (లేదా నాయకుడు) ప్రదర్శించే ధైర్యం. తన ప్రేమకు స్పందించని నాయకుడిని (లేదా నాయికను), ప్రజల ముందు ఆవిష్కరించి, తన మనోవ్యథను తెలియజెప్పి, అతనితో మళ్లీ కలవాలనే తాపంతో శరణు వెడడం. . తిరుమంగై ఆళ్వార్లు కూడా ఓ నాయికలా భావావేశంలోకి పొంది, ఈ రెండు మడల్ ల  ద్వారా అద్భుతమైన ధైర్యాన్ని ప్రదర్శించారు.

ఇంకా ఎమ్పెరుమాన్ ప్రత్యక్షం కాకపోవడంతో, చివరికి తిరునెడున్దాణ్డకమ్ అనే ప్రబంధాన్ని పాడారు — తద్వారా వారు ఎమ్పెరుమాన్ని చేరుకున్నారు. ఈ ప్రబంధంలో మొత్తం 30 పాశురాలు ఉన్నాయి. ఇది మూడు భాగాలుగా విభజించబడింది.

శ్రీ శుకుడు, ముదల్ ఆళ్వార్లు వంటి వారు ఎమ్పెరుమాన్లోని పరత్వం (సర్వోన్నతత్వం) లో మునిగిపోయి ఉంటారు.
సనకాదులు, తిరుమళిసైపిరాన్ వంటి వారు, వారి అంతరాత్మాగానూ (మనలో ఉండే దేవుడిగా) భావిస్తారు.
పరాశరుడు, వ్యాసుడు (పారాశర్యుడు), నమ్మాళ్వార్లు, పెరియాళ్వార్లు, ఆండాళ్ వంటి వారు శ్రీకృష్ణ అవతారంలో ఆయన వైభవాన్ని అనుభవిస్తారు.
నారదుడు, తొండరడిప్పొడి ఆళ్వార్లు, తిరుప్పాణాళ్వార్లు వంటి వారు శ్రీరంగంలోని ఎమ్పెరుమాన్ మీద ప్రేమతో నిండిపోతారు. ఈ దివ్యదేశం మిగిలిన దివ్యదేశాలకు మూలము వంటిది.
శౌనక మహర్షి, తిరుమంగై ఆళ్వార్లు వంటి వారు అర్చావతారంలో ఉన్న ఎమ్పెరుమాన్‌పై భక్తితో తలమునకలవుతారు. ఇది ఆయన సౌలభ్యం (అందరికీ సులభంగా లభించగల స్వరూపం) అనే గుణాన్ని అత్యంత స్పష్టంగా ప్రతిబింబించే రూపం.

తిరునెడున్దాణ్డకమ్ వైభవం 

భట్టర్ల జీవితంలోని గొప్ప సంఘటనలలో ఒకటి వారు తిరునారాయణపురానికి వెళ్లి నంజీయార్ ను మన సంప్రదాయంలోకి తీసుకురావడం. ఇది రామానుజాచార్యుల వారి ఆజ్ఞతో జరిగింది. అప్పట్లో నంజీయార్ ను మాధవాచార్యుడని పిలిచేవారు. భట్టర్ల గూర్చి విన్న మాధవాచార్యుడు వారితో వాదనకు సిద్ధమయ్యారు. ఈ సందర్భంగా భట్టార్ గారు తిరునెడున్దాణ్డకమ్ ని ఆధారంగా తీసుకుని ఎంపెరుమాన్ పరత్వాన్ని స్థాపించారు. శాస్త్రార్ధాలలోని అన్ని విషయాలనూ వివరించారు. చివరికి మాధవాచార్యుడు పరాజయం అంగీకరించి భట్టార్ పాదాలపై లొంగి వారిని ఆచార్యులగా అంగీకరించారు.

తరువాత భట్టర్లు  తిరిగి పెరియపెరుమాళ్ దగ్గరకు వెళ్లి ఆ సంఘటనను వివరించారు. ఇది వినగానే పెరియపెరుమాళ్ ఆనందించి భట్టర్లని  తిరునెడున్దాణ్డకమ్ అనుసంధానం చేయమని ఆజ్ఞాపించారు. అప్పటినుంచి ఇది సాంప్రదాయంగా పాటించబడుతోంది. శ్రీరంగంలో అధ్యయనోత్సవం తిరునెడున్దాణ్డకమ్ సేవించడంతో ప్రారంభమౌతుంది.

మొదటి మూడు పాశురముల సారాంశం:

ఆళ్వార్లు ఈ మూడు పాసురాల్లో అన్ని శాస్త్రాల సారాంశాన్ని తెలియజేస్తారు. ఎంపెరుమాన్ ఆంతర్యామి; ఆయనే సృష్టికర్త, పోషకుడు, లయకర్త. ఈ మూడు పాశురములు ఆయన పరత్వాన్ని చాటుతాయి. మిగతా పాశురములు ఈ విషయాన్ని వివరిస్తాయి. 

పాశురాల క్రమం

  • మొదటి పది పాశురాలలో : ఆళ్వార్లు తాము  స్వయంగా పాడుతారు 
  • తరువాత పదిలో, 11-20: పరకాల  నాయకిగా తల్లి మాటల ద్వారా — తాయార్ వాఖ్యలు
  • తరువాత పదిలో, 21-28: పరకాళ నాయకి స్వయంగా — తన అనుబంధాన్ని స్నేహితులతో (తోళి) పంచుకుంటారు.
  • చివరి రెండు పాశురాలలో,  29-30: మళ్ళీ ఆళ్వార్లు తన భావంతో ముగింపు.

ఈ రీతిలో తిరునెడున్దాణ్డకమ్భగవద్గీత 10వ అధ్యాయం 9వ శ్లోకాన్ని పోలి ఉంటుంది:

మచ్చిత్తా మద్గతప్రాణా బోధయంతః పరస్పరం |
కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ ||

తిరునెడున్దాణ్డకమ్ లోని:

  • మచ్చిత్తా: నా మీద మనస్సును మగ్నమ్ చేసిన వారు, మొదటి 10 పాసురాల్లొ ఆళ్వార్లు ఎంపెరుమాన్‌ను తలచుకుంటారు.
  • మద్గతప్రాణా: నా మీదనే ఆలోచనలు పెట్టినవారు, ఆళ్వార్లు ఆత్మను ఎంపెరుమాన్‌ పాదాలపై నిలిపిన స్థితి.
  • బోధయంతః పరస్పరం: భక్తులు తమలో తాము భగవత్ విషయాలు మాట్లాడుకుంటున్నారు, అనుభవాలను పంచుకుంటారు,కేవలం సంభాషణలో సంతృప్తి చెందుతారు,వినడం వల్ల వారిలో ప్రేమ కలిగి వారు సంతోషిస్తారు. పరకాల నాయకి స్నేహితులతో ఎంపెరుమాన్ గుణాలు చెప్పుకుంటారు.

ఆ విధంగా ,  మొదటి పది పాశురాలలో, ఆళ్వార్లు –
ఆత్మ యొక్క స్వరూపాన్ని,  పరమాత్మ యొక్క స్వరూపాన్ని,  ఆత్మ యొక్క స్వభావానికి అనుగుణమైన ప్రయోజనాన్ని,  ఆ ప్రయోజనాన్ని పొందడంలో ఉన్న అడ్డంకులను,
ఆ అడ్డంకులను తొలగించి,  ప్రయోజనాన్ని కలిగించే సాధనాన్ని,  ఇవి ఐదింటినీ తెలియజేసే “తిరుమంత్రం” నే  విషయంగా చేసుకొని — ఈ ఐదు విషయాల సమాహారమైన “అర్థపంచకాన్ని” సుస్పష్టంగా గ్రహించి, దానికి అనుగుణంగా తన సమయాన్ని గడిపారు. 

మధ్య దశకంలో – ఈ పాశురాలు పరకాల నాయిక తల్లి తన కుమార్తె గురించి చెప్పినట్లుగా రూపొందించబడ్డాయి. ఆమె కుమార్తె (పరకాల నాయకి) తన మనసులో పెరుమాళ్ళను తలచుకుంటూ కాలం గడపడం మానలేదు, అతని మీద ఉన్న అధికమైన ప్రేమ వల్ల మూర్చపోయింది, అతడిని కన్నులతో చూడాలనే తపన పెంచుకుంది, కాని ఆశించినట్టుగా ప్రత్యక్షంగా చూడలేక మళ్ళీ మూర్ఛపోయింది. ఆమె మిత్రులు (తోళి) ఈ మూర్ఛ స్థితిని గమనించి చెప్పగా, తల్లి ఈ మాటలు అన్నట్లు ఈ పాశురాలు.

మూడవ దశకంలో – ఆమె స్థితిని చూసిన తోటి స్నేహితురాలు ఆమెను ఓదార్చాలని ప్రయత్నించింది. దానికోసం ఆమెతో ఏమైంది అని అడిగింది. ఇది పరకాల నాయికకి జరిగిందని గుర్తొచ్చి, ఆమె కొంతకాలం తట్టుకుని, తనతోటి స్నేహితురాలితో మాట్లాడింది. ఆపై ప్రశ్నలు-సమాధానాలు లేకపోయినా, విరహంతో  మళ్లీ ఉవ్వెత్తున ఎగిసింది. అప్పుడతడిని చూడాలని దూతల్ని పంపించడం మొదలుపెట్టింది. అయినా అతడు రాకపోవడంతో, ప్రేమలో వచ్చే ఉడల్ (ప్రేమ కలహం) అగ్రస్థాయికి చేరింది. ఇది నమ్మాళ్వారు తరహాలో ఎక్కువకాలం కొనసాగి ఉంటే, ఆయన వచ్చి ప్రత్యక్షమయ్యేవాడేమో. కానీ తిరుమంగై ఆళ్వార్ల  హృదయ సంస్కారంతో కోపాన్ని వదిలిపెట్టి, మళ్ళీ నిస్సహాయ స్థితిలోకి వెళ్లిపోయారు.  ఈ స్థితిలో కూడా ఆయన ప్రత్యక్షమైతే మాత్రమే ఆమె తట్టుకునేది. అలా జరగకపోవడంతో, నమ్మాళ్వారికి తిరువాయిమొళి 10.10 – మునియే నాన్ముగనే లో జనించిన పరమభక్తి, ఈ దశలో తిరుమంగై ఆళ్వార్లో జనించింది. అందువల్ల, ఆయన తప్ప మరొక మార్గం లేనిది (అనన్యగతిత్వం) అని చెప్పి, తనలో ఎలాంటి పుణ్యం లేదని, తనలో నిందలే ఉన్నాయని తెలిపాడు. ఈ పాశురంలో ఆళ్వార్లు వేదనతో విలపిస్తూ ఇలా అంటాడు –
“ప్రేమ కలిగిన నీవు, ఇంత స్థితిలో కూడా ప్రత్యక్షం కావడంలేదంటే, ఇక నేనేమి చేయాలి!”

పాసురం 29:

అన్ఱాయర్ కులమగళుక్కరై యన్దన్నై|
అలైకడలైక్కడైన్దడైత్త అమ్మాన్దనై|
కున్ఱాదవలియరక్కర్ కోనై మాళ|
క్కొడుం శిలైవాయ్ చ్చరన్దురన్దుకులఙ్గళైన్దు

వెన్ఱానై| కున్ఱెడుత్త తోళినానై|
విరితిరైనీర్ విణ్ణగరమ్ మరువినాళుమ్
నిన్ఱానై| తరుణ్ కుడన్దై క్కిడన్ద మాలై
నెడియానై అడినాయేన్ నినైన్దిట్టేనే||

ఈ పాశురంలో తిరుక్కుదంథై ఎంపెరుమాన్‌ను ప్రార్థిస్తూ, “నీ నుండి విడిగా ఉండలేను- దయచూపు” అని వేడుకుంటారు.

పాసురం 30:

మిన్ను మామళై తవళుమ్ మేగవణ్ణా|
విణ్ణవర్ దమ్ పెరుమానే అరుళాయెన్ఱు|
అన్న మాయ్ మునివరోడమరరేత్త|
అరుమఱైయై వెళిప్పడుత్త అమ్మాన్దన్నై|
మన్ను మామణిమాడ మంగై వేన్దన్|
మానవేల్ పరకాలన్ కలియన్ శొన్న|
పన్నియనూల్ తమిళ్ మాలై వల్లార్| తొల్లై
ప్పళవినైయై ముదలరియవల్లార్తామే||

ఆళ్వార్లు పెరుమాళ్ళను అతిశయమైన కోరికతో పిలిచి, వారు శ్రీవైకుంఠం చేరుకుని తృప్తి పడడం గురించి వివరించి “అవావర్ట్రు వీడు పెర్ట్ర”  (తిరువాయిమొళి – 10. 10. 11)” అని చెప్పినట్టు ముగిస్తారు.

ఈ విధంగా ముదల్ ఆయిరం లోని అన్ని ప్రబంధాలను అనుభవించాము.

ఆధారం: https://youtu.be/nUInuo9g6Lk

ఆంగ్లం లో: https://divyaprabandham.koyil.org/index.php/2023/11/simple-guide-to-dhivyaprabandham-part-4/

మూలము :https://youtu.be/r_AU-bU3kys

ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org