శ్రీః శ్రీమతే శఠగోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః

పెరియాళ్వార్ యొక్క అవతార స్థలం శ్రీవిల్లిపుత్తూరు. శ్రీమన్నారాయణుడే సర్వోత్కృష్టుడు అనే పరతత్వాన్ని ఆయన లోకానికి చాటిచెప్పారు. మధురై రాజసభలో, వేదాలలోని అనేక దివ్య మంత్రాలను ఉదహరిస్తూ, ఎంపెరుమాన్ శ్రీమన్నారాయణుని పరత్వాన్ని పెరియాళ్వార్ నిరూపించారు. తమిళ ఆని అంటే జ్యేష్ట మాసంలోని స్వాతి నక్షత్రం వారి జన్మ నక్షత్రం. పెరియాళ్వార్ ప్రసాదించిన దివ్య ప్రబంధాలలో ‘తిరుప్పల్లాండు’ మరియు ‘పెరియాళ్వార్ తిరుమొళి’ అత్యంత ముఖ్యమైనవి. వారు నిరంతరం కృష్ణావతార లీలలోనే తన్మయత్వం చెంది ఉండేవారు. పెరియాళ్వార్ తిరుమొళిలో, ఆయన యశోదా పిరాట్టి యొక్క మాతృభావనతో శ్రీకృష్ణుని లీలలను అనేక పాశురాలలో కీర్తించారు. భగవంతునికి మంగళాశాసనాలు సమర్పించడంలోని మహోన్నతమైన ప్రాధాన్యతను వారు మనకు ఆచరించి చూపారు. ఆ ఎంపెరుమాన్ను దర్శించిన వేళ, ఆయన హృదయం మాతృప్రేమతో, పరమ వాత్సల్యంతో పొంగిపొర్లి ఆశీస్సులను కురిపించింది.
పెరియాళ్వార్కు మరియు మిగిలిన ఆళ్వారులకు మధ్య ఉన్న ఒక ముఖ్యమైన వ్యత్యాసం ఏమిటంటే — మిగిలిన ఆళ్వారులు భగవంతుని దర్శించినప్పుడు, ఈ సంసార సాగరంలోని కష్టాలను భరించలేక, తమకు ఈ సంసార బంధాల నుండి విముక్తిని ప్రసాదించమని వేడుకున్నారు. కానీ పెరియాళ్వార్ మాత్రం, ఆ పరమాత్మని చూడగానే, ఇంతటి ప్రమాదకరమైన సంసార లోకంలోకి ఆ స్వామి స్వయంగా విచ్చేసాడే అని ఆరాటపడి, ఆయనకు ఎలాంటి దిష్టి తగలకుండా రక్షణగా మంగళాశాసనాలు కురిపించారు. పెరియాళ్వార్ భగవంతుని పరత్వాన్ని (సర్వాధిక్యతను) నిరూపించినప్పటికీ, ఆ స్వామి సాక్షాత్కరించినప్పుడు మాత్రం ఆయనకు భగవంతుని సుకుమారత్వం, నవయవ్వనం, ఆ దివ్య కళ్యాణ గుణాలు మరియు మన కన్నులకు అగమ్యగోచరమైన ఆ అపరూప సౌందర్యమే గుర్తుకువచ్చాయి. ఈ క్రూరమైన లోకంలో ఆ సుకుమారునికి ఎటువంటి హాని జరుగుతుందోనని కలవరపడి, ఒక తల్లిలా ఆ స్వామికి మంచి రక్షణ కలగాలని, సదా క్షేమంగా ఉండాలని మంగళాశాసనాలు పలికారు.
పెరియాళ్వార్ యొక్క వాళి తిరునామములు
నల్ల తిరుప్పల్లాండు నాన్మూన్ఱోన్ వాళియే
నానూట్రు అఱుపత్తోన్రుమ్ నమక్కురైత్తాన్ వాళియే
సొల్లరియ ఆనిదనిల్ సోది వందాన్ వాళియే
తొడై శూడిక్ కొడుత్తాళ్ తాన్ తొళుందమప్పన్ వాళియే
శెల్వనంబి తన్నైప్ పోల్ శిఱప్పుట్రాన్ వాళియే
శెన్రు కిళి అఱుత్తు మాల్ దెయ్వమ్ ఎన్ఱాన్ వాళియే
విల్లిపుత్తూర్ నగరత్తై విళంగ వైత్తాన్ వాళియే
వేదియర్కోన్ భట్టర్పిరాన్ మేదినియిల్ వాళియే
పెరియాళ్వార్ యొక్క వాళి తిరునామములు— సరళ వివరణ
నల్ల తిరుప్పల్లాండు నాన్మూన్ఱోన్ వాళియేనల్ల – విశిష్టమైన, తిరుప్పల్లాండు – తిరుప్పల్లాండు పాశురాలు, నాన్మూన్ఱోన్ – నాలుగు గుణితం మూడు (4 క్ష్ 3 = 12) పాశురాలను అనుగ్రహించిన మహానుభావుడు, వాళియే – చిరకాలం వర్ధిల్లాలి (పల్లాండు).
పెరియాళ్వార్ ఆ శ్రియఃపతియైన ఎంపెరుమాన్ సర్వోత్కృష్టతను కీర్తిస్తూ, పరమ విశిష్టమైన పన్నెండు (12) తిరుప్పల్లాండు పాశురాలను మనకు ప్రసాదించారు. ఈ తిరుప్పల్లాండు విశిష్టత ఏమిటంటే—పెరియాళ్వార్ కేవలం తాను మాత్రమే కాక, సకల జీవరాశులను, భక్తకోటిని ఏకం చేసి ఆ పరమాత్మునికి మంగళాశాసనాలు (దివ్య రక్షణ కాంక్షలు) కురిపించేలా ప్రేరేపించారు.
మహోన్నత ఆచార్యులైన శ్రీ మణవాళ మామునులు తమ “ఉపదేశ రత్తిన మాలై” అనే దివ్య గ్రంథంలో తిరుప్పల్లాండు వైభవాన్ని శ్లాఘిస్తూ—”వేదత్తుక్కు ఓమ్ ఎన్నుమ్ అదు పోల్ ఉళ్ళదుక్కెల్లామ్ సురుక్కాయ్” అని కొనియాడారు. అనగా, సమస్త వేదరాశికి ప్రణవ నాదమైన ‘ఓంకారము’ ఎలాంటి సారాంశమో, నాలాయిర దివ్య ప్రబంధాలన్నింటికీ ఈ ‘తిరుప్పల్లాండు’ అటువంటి పరమ సారాంశం. అంతేకాక, మామునులు “ఉండో తిరుప్పల్లాండుక్కు ఒప్పదోర్ కలై దాన్” (ఈ భూమండలంలో తిరుప్పల్లాండుతో సమానమైన, సరితూగగల గ్రంథం మరొకటి ఉందా? లేదు!) అని ప్రశంసించారు. అందుకే, నేటికీ శ్రీవైష్ణవ సాంప్రదాయంలో సకల సేవాకాల గోష్ఠులు (దివ్య ప్రబంధ పారాయణాలు) ఈ తిరుప్పల్లాండుతోనే ప్రారంభమై, తిరిగి తిరుప్పల్లాండుతోనే ముగింప బడతాయి. ఇంతటి అనంతమైన వైభవం కలిగిన దివ్య ప్రబంధాన్ని మనకు అనుగ్రహించిన పెరియాళ్వార్ చిరకాలం వర్ధిల్లాలి (పల్లాండు)!
నానూట్రు అఱుపత్తోన్ఱుం నమక్కురైత్తాన్ వాళియే
నానూట్రు – నాలుగు వందలు (400), అఱుపత్తోన్ఱుం – అరవై ఒకటి (61) [మొత్తం 461], మనక్కురైత్తాన్ – మన కొరకు అనుగ్రహించిన మహానుభావుడు, వాళియే – సదా వర్ధిల్లాలి.
పెరియాళ్వార్ మనకు ప్రసాదించిన మరొక మహోన్నత దివ్య ప్రబంధం “పెరియాళ్వార్ తిరుమొళి”. ఇందులో మొత్తం 461 పాశురాలు ఉన్నాయి. ఈ పాశురాలన్నీ పెరియాళ్వార్ హృదయం నుండి పొంగిపొర్లిన శ్రీకృష్ణ పరమాత్ముని దివ్య అనుభూతుల సమాహారం.
యశోదా దేవి బాలకృష్ణుని యొక్క ప్రతి ఒక్క చిన్న లీలను, ప్రతి అడుగును ఎంతటి పరవశంతో, తన్మయత్వంతో అనుభవించిందో… పెరియాళ్వార్ కూడా అదే విధమైన మాతృవాత్సల్యంతో ఆ శ్రీకృష్ణ లీలలను స్వయంగా అనుభవించి, ఈ పాశురాల రూపంలో మనకు అపరూపమైన కానుకగా అందించారు. ఇటువంటి పరమ వాత్సల్య నిధులైన పెరియాళ్వార్ చిరకాలం వర్ధిల్లాలి (పల్లాండు)!
సొల్లరియ ఆనిదనిల్ సోది వందాన్ వాళియే
సొల్లరియ – వాగతీతమైనది, ఆనిదనిల్ – మిధునమాసమందు, సోది వందాన్ – భువిలో అవతరించిన , వాళియే – చిరకాలం వర్ధిల్లుగాక (పల్లాండు)!
జ్యేష్ఠ మాసంలో స్వాతి నక్షత్రాన భువిపై అవతరించిన పెరియాళ్వార్ల దివ్య వైభవం మాటలలో చెప్పలేనిది (వాగతీతమైనది). జ్యేష్ఠ-స్వాతి సుముహూర్తాన వేంచేసిన ఆ పుణ్యమూర్తి సర్వదా వర్ధిల్లుదురు గాక (పల్లాండు)!
తొడై శూడిక్ కొడుత్తాళ్ తాన్ తొళుందమప్పన్ వాళియే
తొడై – పూలమాల , శూడిక్ – ధరించి , కొడుత్తాళ్ – సమర్పించింది , తాన్ – తానే , తొళుం – ఆరాధించే , తమప్పన్ – తండ్రి , వాళియే – చిరకాలం వర్ధిల్లుగాక (పల్లాండు)!
“తొడై” అంటే పూదండ అని అర్థం. ఆండాళ్ నాచ్చియార్ను “శూడిక్కొడుత్త నాచ్చియార్” (తాను ధరించి ఆ ఎంపెరుమాన్కు పూదండను సమర్పించినది) అని పిలుస్తారు. అటువంటి గొప్ప వైభవం గల ఆండాళ్ తల్లి, పెరియాళ్వార్ను తన తండ్రిగా ఆరాధిస్తుంది. పెరియాళ్వార్ ఆమెకు కేవలం జనకుడు మాత్రమే కాదు, ఆచార్యులు కూడా. బాల్యం నుంచే పెరియాళ్వార్ ఆమెకు కృష్ణలీలల గాథలను వినిపిస్తూ, ఎంపెరుమాన్ గురించిన సమస్త విశేషాలను బోధిస్తూ, ఆమెలో భక్తిని పెంపొందించారు. అందుకే, ఆండాళ్ నాచ్చియార్ తన తండ్రియైన పెరియాళ్వార్ను ఆచార్య భావంతో పూజిస్తుంది.కొన్ని సందర్భాలలో, ఈ వాక్యాన్ని “తొడై శూడిక్కొడుత్తాళైత్ తొళుమ్ తమప్పన్ వాళియే” అని కూడా చెబుతారు. ఇది ఆరాధించే బంధాన్ని తిరగేసి, తాను ముడిచిన మాలను ఎంపెరుమాన్కు అర్పించిన ఆండాళ్ నాచ్చియార్ను పెరియాళ్వార్ ఆరాధిస్తారని తెలియజేస్తుంది. ఆండాళ్ నాచ్చియార్ ఆ పరమాత్ముని దివ్య మహిషి కావున, అందరూ ఆమెను జగన్మాతగా పూజించాలి. ఈ పరమార్థాన్ని దృష్టిలో ఉంచుకునే, జగజ్జనని అయిన ఆండాళ్ను ఆరాధించే ధన్య జీవి ఆ తండ్రి (పెరియాళ్వార్) అని చెప్పబడింది. ఆండాళ్ నాచ్చియార్కు పితృదేవుడైన పెరియాళ్వార్ చిరకాలం వర్ధిల్లాలి (పల్లాండు)!
శెల్వనంబి తన్నైప్ పోల్ శిఱప్పుట్రాన్ వాళియే
“సెల్వనంబి మధురై మహారాజు ఆస్థానంలో మంత్రిగా ఉండేవారు. ఆయన పరమ నిష్ఠాగరుడైన శ్రీవైష్ణవులు. తిరుక్కోట్టియూర్ పెరుమాళ్పై పెరియాళ్వార్ మంగళాశాసనం చేసిన పెరియాళ్వార్ తిరుమొళి పదిగంలో (పది పాశురాల సంపుటి) సెల్వనంబి యొక్క వైభవం ప్రస్ఫుటమవుతుంది. పెరియాళ్వార్ ఆయనను “నళిరంద శీలన్, నయాసలన్” అని కీర్తించారు, అనగా నిరంతరం ప్రశాంత చిత్తంతో, కరుణా రసంతో ఉంటూ, సదా ధర్మ మార్గాన్ని అనుసరించే మహనీయుడని భావం. సెల్వనంబి మరియు ఆయన ధర్మపత్ని ఇరువురూ ఆ ఎంపెరుమాన్ భక్తుల పట్ల అమితమైన వాత్సల్యం కలిగిన మహోన్నత శ్రీవైష్ణవులు. స్వయంగా పెరియాళ్వార్ వంటి మహర్షి ఒకరిని కీర్తించారంటే, వారి గొప్పతనం ఎంతటి అచింత్యమైనదో, ఊహాతీతమైనదో మనం అర్థం చేసుకోవచ్చు. సెల్వనంబి వైభవం అటువంటిది, మరియు ఆయనను కీర్తించిన పెరియాళ్వార్ కూడా అంతటి మహిమాన్వితులు. అట్టి పరమ వైభవశాలి అయిన పెరియాళ్వార్ చిరకాలం వర్ధిల్లుగాక (పల్లాండు)!
సెన్ఱు కిళి అఱుత్తు మాల్ దైవమ్ ఎన్ఱాన్ వాళియే
శ్రీమన్నారాయణుడే సర్వోన్నతమైన ‘పరదైవం’ అని నిరూపించడానికి పెరియాళ్వార్ ఆ పాండ్యరాజు కొలువుకు విచ్చేసినప్పుడు, అక్కడ ఎంతో ఎత్తున వేలాడదీసిన సువర్ణ నాణేల సంచి (విద్యాశుల్కము), వారు శ్రీమన్నారాయణుని పరత్వాన్ని ప్రకటించినపుడు, ఆ పరమాత్ముని లీలతో స్వయంగా క్రిందికి దిగివచ్చి పెరియాళ్వార్ హస్తాలను అలంకరించింది. శ్రీమన్నారాయణుడే సమస్త కోటి బ్రహ్మాండాలకు ఏకైక పరమేశ్వరుడని, జగత్ప్రభువని నిరుపమానంగా నిరూపించిన అట్టి పరమ వైభవశాలి అయిన పెరియాళ్వార్ చిరకాలం వర్ధిల్లాలి (పల్లాండు)!
విల్లిపుత్తూర్ నగరత్తై విళంగ వైత్తాన్ వాళియే
పెరియాళ్వార్ అవతరించడం వల్లే ఆ దివ్యదేశమైన శ్రీవిల్లిపుత్తూరుకు అంతటి మహోన్నత వైభవం చేకూరింది. ఆపై, ఆండాళ్ నాచ్చియార్ సైతం పెరియాళ్వార్ పుత్రికగా శ్రీవిల్లిపుత్తూరులో ఈ భూమిపైకి అవతరించినప్పుడు, ఆ దివ్యక్షేత్రం మరింత దేదీప్యమానంగా శోభిల్లింది. శ్రీకృష్ణునికి జన్మనిచ్చింది దేవకీదేవి అయినప్పటికీ, ఆయనను పెంచి పెద్దచేసి, ఆ యశోదమ్మ ఏ విధంగానైతే సకల వైభవాలను, శాశ్వత కీర్తిని పొందిందో… అదే విధంగా శ్రీవిల్లిపుత్తూరులో ఆండాళ్ దేవిని సాకుతూ, ఆమెను పెంచి పెద్దచేసిన పెరియాళ్వార్ సమస్త వైభవాలను పొంది, ఆ శ్రీవిల్లిపుత్తూరు నగరానికే శాశ్వత కీర్తి ప్రతిష్టలను చేకూర్చారు. అట్టి పరమ ధన్యులైన పెరియాళ్వార్ చిరకాలం వర్ధిల్లాలి (పల్లాండు)!
వేదియర్కొన్ భట్టర్పిరాన్ మేదినియిల్ వాళియే
‘వేదియర్ కోన్’ అనగా సకల వేద పారంగతులైన బ్రాహ్మణోత్తములకు (వేదియర్) అగ్రగణ్యుడైన ప్రభువు (కోన్) అని అర్థం. పెరియాళ్వార్ సమస్త శాస్త్ర విశేషాలను క్షుణ్ణంగా ఆకళింపు చేసుకున్న గొప్ప విద్వాంసులు. వారు సకల శాస్త్ర కోవిదులైన పండితులందరికీ దిశా నిర్దేశం చేసిన అద్వితీయ నాయకులు కాబట్టే, ఆయనకు ‘భట్టర్పిరాన్’ అనే పరమ పవిత్రమైన బిరుదు దక్కింది. అట్టి మహనీయులైన పెరియాళ్వార్ కీర్తి ప్రతిష్టలు ఈ అవనిపై సదా వర్ధిల్లాలి (పల్లాండు)!
ఇంతటితో పెరియాళ్వార్ వారి ‘వాళి తిరునామం’ సంపూర్ణమగుచున్నది.
అడియేన్ శ్రీ తేజ రామానుజ దాసి
అడియేన్ లక్ష్మీ సేనాపతి రామానుజ దాసి
పొందుపరచిన స్థానము – https://divyaprabandham.koyil.org
ప్రమేయము (లక్ష్యము) – https://koyil.org
ప్రమాణము (గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (పూర్వాచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org