శ్రీ శ్రీమతే శఠగోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః
ఎమ్పెరుమాన్ కొందరు జీవులని ఎంచుకుని వారిని “మయర్వర మదినలం” అన్నట్టుగా వారికి నిజమైన జ్ఞానం, భక్తి ప్రసాదించి, వారి అజ్ఞానాన్ని తొలగించి అనుగ్రహించాడు. వారు పొంగి పొరలుతున్న తమ జ్ఞానాన్నీ, భక్తినీ కలబోసి పాశురాలుగా పాడారు. వాటినే దివ్యప్రబంధం, అరుళిచెయల్ అంటారు.
నమ్మాళ్వార్లు అనుగ్రహించిన ప్రబంధం నాలుగు వేదాలతో సమానం.
- తిరువాయిమొళి – 1102 పాశురాలు- సామవేదం తో సమానం
- తిరువిరుత్తం – 100 పాశురాలు- ఋగ్వేదం తో సమానం
- పెరియ తిరువందాది – 87 పాశురాలు- అథర్వణవేదం తో సమానం
- తిరువాసిరియమ్ – 7 పాశురాలు- యజుర్వేదం తో సమానం
తిరుమంగై ఆళ్వార్లు అనుగ్రహించిన పెరియ తిరుమొళి, తిరుక్కురుంతాండగం, తిరువెళుకూట్టిరుక్కై , శిరియ తిరుమడల్ , పెరియ తిరుమడల్ , మరియు తిరునెడుంతాండగం నమ్మాళ్వార్ల ప్రబంధానికి అంగములు.
మిగతా ఆళ్వార్ల ప్రబంధాలు ఉపాంగములు. వేదములు అర్ధం చేసుకోవడం, కష్టం, చదవడానికి నియమాలూ, నిబంధనలూ చాలా ఉంటాయి, కానీ దివ్యప్రబంధానికి అటువంటివి ఏమి లేవు.
అర్థ పంచకం అంటే ఏమిటి?
అరుళిచెయల్ యొక్క ముఖ్య సందేశం ఏమిటి? అతి ముఖ్యమైన అయిదు విషయాలని (అర్థ పంచకం) దివ్య ప్రబంధం చాలా అందంగా అందిస్తుంది.
- నేను ఎవరిని ? (స్వ-స్వరూప జ్ఞానం)
- నా స్వామి ఎవరు?(పర స్వరూప జ్ఞానం)
- నేను పొందవలసిన లక్ష్యం ఏమిటి? (పురుషార్థ స్వరూప జ్ఞానం)
- అది పొందడానికి మార్గం ఏమిటి? (ఉపాయ స్వరూప జ్ఞానం)
- దానిని పొందకుండా ఆపుతున్న అడ్డు ఏమిటి? (విరోధి స్వరూప జ్ఞానం)
ఈ పాశురాలు చదువుతున్న కొద్దీ మనలో వైరాగ్యం పెరిగి, భగవత్ గుణముల, కైంకర్యం పట్ల అనురక్తి పెరుగుతుంది. భగవంతుడి కళ్యాణ గుణములూ, అవతార లీలలూ అనుభవిస్తుంటే ఆనందము, మనము ఆయనకు కింకరులమని అర్ధం అవుతుంది.
పేయాళ్వార్ల పాశురం ఇదే విషయాన్ని తెలియ చేస్తుంది.
మార్పాయి మనం సూళిప్ప మంగైయారు తోళ్ కై విట్టు
నూరుపాయి మనమ్ వైక్క నొయివిదాం – నార్పాల
వేదత్తాన్ వేంగడత్తాన్ విన్నోర్ ముడి తోయుమ్
పాదత్తాన్ పాథం పణ్ణిందు – మూన్ఱమ్ తిరువందాది -14
ఉపదేశ రత్తినమాలై 34వ పాశురం లో మనవాళ మామునులు ఇలా అంటారు:
ఆళ్వార్గళ్ ఎఱ్ఱం అరుళిచెయల్ ఎఱ్ఱం
తాళ్వాదు, ఇంర్రి ఆవై తాం వల్లరిత్తోర్ ఎల్పారం
అయ్యా వర్గల్ సేయఁద వైక్కియైగల్ ఉల్లదేళ్లం
వైయమ్ అఱియాప్ పగర్వోమ్ వాయన్దు
(ఆళ్వార్ల గొప్పతనం జనులకు తెలియజేయడం నా కర్తవ్యం. వారు అనుగ్రహించిన దివ్య ప్రబంధం గొప్పదనాన్ని తక్కువ చేయలేము/ దివ్యప్రబంధానికి వ్యాఖ్యానం అనుగ్రహించి సప్తలోకాల్లో ఉన్న వారి ఉద్ధరణకై ప్రసాదించిన ఆచార్యుల వైభవాన్ని చెప్పడం కూడా నా కర్తవ్యం.)
35వ పాశురం లో మామునులు ఇలా అంటున్నారు:
అల్వార్గాళ్ళైయుమ్ అరుళిచెయల్గాళ్ళైయుమ్
తాలవా నినైప్పవర్దామ్ నరగిల్- వీలార్గళ
ఎన్ఱు నినైత్తు నెంజీ ఎప్పోళ్లుదుము
నీ అవర్ పాఈ సెంఱ్ఱనుగాక కూసిత్థిర్రి ఎన్ఱు నినైత్తు నెంజీ
(“ఓ మనసా! దివ్యప్రబంధాలను తక్కువచేసి వారు నరకమును పొందుతారు అని గ్రహించు. ఓ మనసా! అట్టి వారి సాంగత్యాన్ని ఎప్పుడూ పొందకు!)
తిరుప్పల్లాండు / పెరియాళ్వార్ తిరుమొళి:
తిరుప్పల్లాండులో, పెరియాళ్వార్ ఎమ్పెరుమాన్కు మంగళాశాసనం చేశారు. ఆయన విష్ణు పరత్వాన్ని స్థాపించేందుకు మధురై (దక్షిణభారత దేశంలోని రాజధాని) లోని రాజ సభకు వెళ్లారు. ఎమ్పెరుమాన్ కృపతో ఆయన ఆ కార్యాన్ని విజయవంతంగా పూర్తిచేశారు. దీనికి ప్రతిగా, రాజు ఆయనను సత్కరించాడు.
అప్పుడు, స్వయంగా ఎమ్పెరుమాన్ గరుడవాహనంపై అక్కడకు పెరియాళ్వార్ల సత్కారం తిలకించేందుకు వేంచేసాడు. ఇంతవరకు విష్ణువు పరమదైవమని నిరూపించిన ఆళ్వార్లు పరమాత్మ కు ఏదైనా కీడు జరుగుతుందేమోనని భయపడ్డారు. వారిలోని వాత్సల్యం ఆయన జ్ఞానం కంటే అధికమై వారు పెరుమాళ్ళకు మంగళాశాసనం చేస్తూ తిరుప్పల్లాండు లో 12 పాశురాలు ఆలపించారు.
వేద పారాయణం ప్రారంభంలో ప్రణవం (ఓం) ఉచ్చరించేటట్టు తిరుప్పల్లాండు దివ్యప్రబంథానికి ముందు తప్పకుండా సేవించాలి. ప్రణవం ఏవిధంగా అయితే వేదాసారమో, మంగళాశాసన రూపమైన తిరుప్పల్లాండు దివ్య ప్రబంధ సారం. మంగళాశాసనం అంటే పరమాత్మకి అన్ని రకాల మంగళాలూ కలగాలని కోరడం.
తిరుప్పల్లాండులో:
మొదటి రెండు పాశురాలలో, ఆళ్వార్ ఎమ్పెరుమాన్కు మంగళాశాసనం చేస్తారు.
తర్వాతి మూడు పాశురాలలో, ఆళ్వార్ –
- భగవత్ ప్రాప్తికాములు (భగవంతుని సేవ చేయాలని ఆకాంక్షించేవారు),
- కైవల్యార్థులు (ఆత్మానందాన్ని కోరేవారు),
- ఐశ్వర్యార్థులు (కొత్తగా సంపద కోరేవారు, లేక కోల్పోయిన ఐశ్వర్యాన్ని తిరిగి పొందాలనుకునేవారు) —
- అని పిలుస్తారు.
తదుపరి మూడు పాశురాలలో, వారు పెరియాళ్వార్ దగ్గరకు వచ్చి కలుస్తారు.
అనంతర మూడు పాశురాలలో, పెరియాళ్వార్ వీరితో కలిసి తిరుప్పల్లాండు పాడడం కనిపిస్తుంది.
చివరి పాశురం ఈ ప్రబంధ పారాయణం వల్ల కలిగే ఫలితాన్ని — ఫలశృతి — వివరిస్తుంది.
పెరియాళ్వార్ తిరుమొళిలో:
పెరియాళ్వార్ తల్లి భావాన్ని పొంది, బాలకృష్ణుడి బాల్యలీలలను, అద్భుత అనుభూతులను గొప్పగా కీర్తిస్తారు.
పెరియవాచ్ఛాన్ పిళ్ళై ఈ ప్రబంధంలోని అన్ని పాశురాలకు వ్యాఖ్యానం చేశారు. అయితే, ఆయన రాసిన వ్యాఖ్యానాల్లోకొన్ని మాత్రమే అందుబాటులో ఉన్నాయి.
మామునిగళ్ శ్రీరంగానికి వచ్చినప్పుడు, ఆచార్య సంప్రదాయాన్ని పునఃప్రతిష్టించాలనే సంకల్పంతో, గ్రంథాలను సమీకరించి పరిరక్షించేందుకు ప్రయత్నించారు. అందులో భాగంగా, పెరియవాచ్ఛాన్ పిళ్ళై వ్యాఖ్యానం అందుబాటులో లేని పాశురాలపై, మామునిగళ్ స్వయంగా వ్యాఖ్యానం చేశారు.
పెరియాళ్వార్ తిరుమొళి కూడా మంగళాశాసన పాశురాలే:
శ్రీమన్నారాయణుడు, సర్వేశ్వరుడు, శ్రీమహాలక్ష్మీపతి, అందరికీ రక్షకుడు. ఇది జ్ఞానం వలన తెలిసే విషయం. కానీ భక్తి ఉప్పొంగినప్పుడు, ఆళ్వార్ల భావం పూర్తిగా మారిపోయింది – “మనమే పెరుమాళ్ళను కాపాడాలి” అనే భావన పెరియాళ్వార్లకు కలిగింది. ఇది ఉప్పొంగిన భక్తి వల్ల కలిగింది.
పెరియాళ్వార్లు ఆలోచించారు – “ఎమ్పెరుమాన్ వైకుంఠంలో ఉన్నప్పుడు ఎలాంటి ప్రమాదమూ ఉండదు. కానీ సంసారంలోకి దిగితే, ఎందరో అసురులు ఆయనను హానిచేయాలని చూస్తారు. ఆ భయంతోనే ఆయన తిరుప్పల్లాండులో మంగళాశాసనం చేశారు.”
తిరుప్పల్లాండులో పెరియాళ్వార్ నరసింహావతారాన్ని ఇలా మంగళాశాసనం చేశారు:
“అంధియం పోతిల్ అరి ఉరువాగి అరియై అళిత్తవనై”
రామావతారాన్ని ఇలా కీర్తించారు: ఇల్లంగై పాజల్లాగప్పడై పోరుదానుక్కు
కృష్ణావతారాన్ని ఇలా కీర్తించారు : “మాయప్పరు పటై వాణనై, ఆయిరం తోళుం పొళి కురుద్ది పాయ”
ఎందుకు అందరూ ఆళ్వార్లు కృష్ణుడిపైనే ప్రత్యేకమైన ప్రేమ చూపించారు?
ఎందుకంటే కృష్ణావతారం అత్యంత సమీప కాలంలో జరిగిన అవతారం. అది ద్వాపరయుగంలో జరిగింది కాబట్టి, అది ఆళ్వార్లకు సులభంగా గుర్తుండిపోయింది. నమ్మాళ్వార్లు — “మనం కొద్దిగా ముందే పుట్టి ఉంటే కృష్ణావతారాన్ని ప్రత్యక్షంగా చూసి ఆనందించగలిగేవాళ్లం!” అన్నారు. ఆయన కలియుగ ప్రారంభానికి 42వ రోజు జన్మించారు.
మరొక విషయం ఏమంటే — రామావతారంలో ఎమ్పెరుమాన్ రాజుగా ఉన్నాడు కానీ కృష్ణావతారంలో ఒక సాధారణ గోపబాలుడిగా ఉన్నాడు. .
రామావతారంలో నలుగురు అన్నదమ్ములూ గుణవంతులు, తండ్రి శత్రువుల్ని సంహరించే వీరుడు, గురువు వసిష్ఠుడు, పట్టణం అయోధ్య వంటి మహానగరం, యుగం త్రేతాయుగం- అన్నీ అనుకూలంగా ఉన్నాయి. భయం అవసరం లేదు.
కృష్ణావతారంలో ఎమ్పెరుమాన్ శత్రువైన కంసుని కోటలోని బందిఖానాలో జన్మించాడు. కంసుడు నిర్దయుడు- ఎప్పటికప్పుడు అసురులను పంపి కృష్ణుడిని హానిచేయాలని ప్రయత్నించాడు. తండ్రి గోపుడు, నివాసం గోపకుల కాలనీ, స్వయంగా కృష్ణుడు అల్లరి పిల్లవాడు, యుగం ద్వాపరయుగం — కలియుగానికి సమీపం. అందుకే ఆళ్వార్లు కృష్ణుడిపైనే అత్యంత ప్రేమతో, మక్కువతో ఉన్నారు.
పెరియాళ్వార్ కృష్ణానుభవంలో తడిసిముద్దయ్యారు
ఆయన కృష్ణావతారాన్ని ఎంతో ప్రేమగా అనుభవించారు. .
“విష్ణుచిత్తన్ మనత్తే కోయిల్ కొండాన్” అని అనిపించేలా…
శ్రీకృష్ణుడు అంతటి దివ్యానుభవాన్ని ఇచ్చాడు, అందువల్ల పెరియాళ్వార్ ఎప్పుడూ ఆయన గురించి ఆలోచించేవారు.
భగవంతుని లీలలు పురాణాల్లాగే కేవలం జ్ఞాపకాలు కాదు.
ఆ లీలలు పెరియాళ్వార్ కన్నుల ముందే జరిగినట్టు అనుభవించారు. ఆయన యశోదా పిరాట్టి వలే మాతృభావంలో కృష్ణుడిని అనుభవిస్తున్నారు.
వణ్ణ మాడంగళ్ పాశురాలలో ఒక ప్రశ్న తలెత్తవచ్చు:
“కృష్ణుడు మథురలో పుట్టాడిగానీ, తిరుక్కోష్టియూర్లో కాదు కదా?” అనే సందేహం వస్తుంది.
అయితే తిరుక్కోష్టియూర్ ఆళ్వార్కి ఎంతో ఇష్టమైన స్థలం. వారికి ఎంతో ఆదరణీయులైన శెల్వ నంబి ఇక్కడే వేంచేసి ఉండేవారు. ఎమ్పెరుమాన్ ఆ ఆలయంలో శ్రీకృష్ణుడిగా తన స్వరూపాన్ని దర్శింపచేసాడు.
ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి — అర్చావతారం అనేది విభవావతారంకు ప్రతినిధి. అలా ఆళ్వార్కి నరసింహుడు, రాముడు, వామనుడు, కృష్ణుడు మొదలైన అవతారాలలో ఎమ్పెరుమాన్ దర్శనమిచ్చేవాడు. ఆ అనుభవంలోనే పెరియాళ్వార్ తన పాశురాలలో గానం చేశారు.
శ్రీ వచన భూషణంలో చెప్పబడినట్లు, పెరియాళ్వార్ తనను తానే యశోదగా భావించారు ఆండాళ్ తనను, తన సహచరులనూ గోపికలుగా భావించింది. ఇలా వారు కృష్ణానుభవంలో తడిసిపోయారు.
పెరియాళ్వార్, శ్రీకృష్ణుడి జీవితంలోని వివిధ దశలను స్తుతించారు.
మొదటి పదిగంలో ఆయన జననం,
రెండవ పదిగంలో ఆయన అందం- తల మొదలు పాదాల వరకు,
మూడవ పదిగంలో ఆయన్ని తల్లి లాలించేలా పాడిన జోలపాటలు
ఇలా ఒక్కొక్క దశను ఒకొక్క పదిగంలో గానం చేశాడు.
అలా యశోదా భావంలో కృష్ణుడి బాల్యాన్ని మంగళాశాసనం చేశారు.
తర్వాత పెరియాళ్వార్ తిరుమాలిరుంచోళై, తిరుక్కోష్టియూర్, తిరువెళ్లరై, తిరువరంగం వంటి దివ్యదేశాలను మంగళాశాసనం చేశారు.
పెరియాళ్వార్ తిరుమొళి (5-4 పదిగం) శెన్నియోంగు పదిగంలో తిరువేంకటముడయాన్ను ఇలా స్తుతించారు –
పనిక్కడలిల్ పళ్ఱికోలై పలఘవిట్టు ఒడివందు ఎన్
మనక్కడలిల్ వాజవల్ల మాయమణాళ నంబీ!
తనిక్కడలే తనిచ్చుడరే తనియులగే*
ఎన్నై ఒనక్కిదమాయ్ ఇరుక్కా* ఒనక్కురిత్థాకినయే!**
ఎమ్పెరుమాన్ విశాలమైన సముద్రం, సూర్యుడు, స్వర్గం వంటి అద్భుత స్థలాల్ని వదిలి, తన మనస్సులో ప్రవేశించి నివసించాడని ఆనందంతో :
ఆనందన్ పాళుం, గరుడన్ పాళుం ఐదు నోయ్దాగా వత్తి
ఎన్ మనందనుల్లే వంధు వైగి వాజచ్చైథాయ్ ఎజ్హిరాన్!
నినైందు ఎన్నుల్లే నిన్రు నెక్కుక్క కన్నగళ్ అసుం పొళుగ,
నినైందిరుందే సిరమం తీర్ధేన్ నేమి నెడియవనే!
ఇక్కడ ఆళ్వార్, ఎమ్పెరుమాన్ తన మనస్సులోకి వచ్చి నివసించి తన కష్టాలను తొలగించి ఒక కొత్త జీవితాన్ని ఇచ్చాడని ఆనందంగా చెప్పారు.
పరుప్పధత్తుక్కయల్పొరిథ్త పాండ్యర్ కులపతిపోల్,
తిరుప్పొలింద సేవడిఎన్ శెన్నియిన్ మేల్ పొరిథ్తాయ్!
మరుప్పొసిత్తాయ్! మల్లదర్త్తాయ్! ఎన్ రెన్ ఱు ఒన్ వాసగమే,
ఊరుప్పొలింద నావినేన్ఐ ఒనక్కురిత్థాకినయే!
పాండ్య రాజు తన జెండాను పర్వతంపై ఎగరేసినట్లు, నీవు నీ దివ్య శ్రీ పాదాలను నా తలపై ఉంచావు, నా నోరు నీ నామస్మరణతో నిండి పోయింది అని అన్నారు .
ఈ ఉపమానం ఎంతో అందంగా ఉంది — పర్వతం రాజును పిలవలేదు, కానీ రాజు తన ఇష్టంతో వచ్చి జెండా ఎగురవేసాడు. అలాగే ఎమ్పెరుమాన్ తన స్వచ్ఛందంతోనే ఆళ్వార్ను ఆశీర్వదించి తన శ్రీ పాదాలను అతని తలపై ఉంచాడు. ఆ కృతజ్ఞత, కైంకర్య భావంలో ఆళ్వార్ ఆ అనుగ్రహాన్ని ఆస్వాదించారు.
వేయర్ తంగళ్ కులత్తుదిత్త విట్టుచిత్తన్ మనత్తే
కోయిల్ కొండ కోవలనై, కొళుంగుళిర్ ముఖిల్వణ్ణనై,
ఆయరేఱ్రై అమరర్ కోవై, అందణర్తమముధత్తినై,
సాయై పోలప్ పాడవల్లార్ తాముం అనుక్కర్గళే!
ఎవరు ఈ కృష్ణానుభవ పాశురాలను భక్తీభావంతో పాడగలరో వారు ఎప్పటికీ ఎమ్పెరుమాన్కు దగ్గరగా ఉండే భాగవతులు అవుతారు- ఆయన నీడలాగా ఎప్పుడూ ఆయనతోనే ఉంటారు.
అదీలా పెరియాళ్వార్ తిరుమొళిలో, కృష్ణుడి జననాన్ని, బాల్య క్రీడలను అనుభవించారు. అనేక దివ్యదేశాల్లోని ఎమ్పెరుమాన్లకు మంగళాశాసనం చేశారు. మనకు మరణ సమయం వచ్చినప్పుడు ఏమి చేయాలో కూడా తెలిపారు .
“నాకు మరణ సమయంలో నిన్ను గుర్తు పెట్టుకునే శక్తి లేకపోవచ్చు. అందుకే ఇప్పుడే ముందుగానే ప్రార్థిస్తున్నాను.” అని.
ఇప్పుడు ఒక సందేహం రావచ్చు- “పెరియాళ్వార్ తిరుమొళి ఎలా మంగళాశాసన పాశురాలు అవుతాయి?”
అయితే, ఆయన కృష్ణావతారాన్ని ఎందుకు ఆస్వాదించారు అంటే, కృష్ణుడు సుఖంగా, సురక్షితంగా ఉండాలని. “నీవు మా రక్షణ కలిగించినప్పుడే నేను నీ మహిమను గానం చేయగలను, మంగళాశాసనం చేయగలను” అని అన్నారు.
అందుచేతే, పెరియాళ్వార్ యొక్క పాశురాలు ఎమ్పెరుమాన్ కు మంగళాశాసనంగా నిలిచాయి.
తిరుప్పావై
ఉపదేశ రత్నమాలై – పాశురం 22:
ఇందో తిరువాడి పూరం ఎమక్కాగ
అంరో ఇంగు ఆండాళ్ అవతరిద్దాళ్ – కున్రాద
వాళ వాన వైకుంఠ వాన్భోగం తన్ని ఇగజ్ంధు
ఆళ్వార్ తిరుమగళార్ ఆయ్
ఈ పాశురంలో, మన కోసం తిరువాడి మాసంలో పూరం నక్షత్రాన అవతరించిన ఆండాళ్ పరమానందభోగాలను పక్కనబెట్టి, వైకుంఠాన్నే వదిలిపెట్టి, మన ఉద్దరణ కోసం, మన శ్రేయస్సుకోసం ఈ భూమిపై అవతరించారు.పెరియాళ్వారుకు పుట్టిన కుమార్తెగా అవతరించి, భక్తులకు మోక్ష మార్గాన్ని చూపారు.
ఆండాళ్ వైభవం – తిరుప్పావై
తిరుప్పావై — ఇది అన్ని వేదాల సారంగా భావించబడుతుంది. అందువల్ల దీనిని వేదమన్నైత్తుక్కుమ్ విత్తు అని పిలుస్తారు.
మార్గశిర మాసంలో ముప్పై రోజుల పాటు, ఆండాళ్ తిరుప్పావై పేరుతో ముప్పై పాశురాలను రచించింది. ఈ పాశురాలలో ఆమె నోము చేయాలని సంకల్పిస్తుంది, తన స్నేహితురాళ్లను కూడగట్టి నందగోపుని తిరుమాళిగకి వెళ్లి, నందగోపుడు మరియు ఇతరులను మేల్కొలుపుతుంది. అనంతరం కృష్ణుని భార్య అయిన నీళాదేవిని (నప్పిన్నై) మేల్కొలిపి, చివరికి స్వయంగా కృష్ణుడినే మేల్కొలుపుతుంది. చివరగా, ఆండాళ్ కృష్ణుడిని మోక్షాన్ని ప్రసాదించాలని మరియు తాను ఆయన సేవలో ఎప్పటికీ ఉండే అవకాశం కలగాలని ప్రార్థిస్తుంది- అదీ కేవలం ఆయన ఆనందం కోసమే, తన కోసం కాదని స్పష్టంగా తెలియజేస్తుంది.
మార్గళిత్ తింగళ్ (మార్గశిర మాసం) పాశురంలో “నారాయణనే నమక్కే పరై తరువాన్” అనే వాక్యంలోని అర్థపంచకం ని చక్కగా వివరించబడుతుంది:
అర్థపంచకం (అనుభవించాల్సిన ఐదు విషయాలు):
- పర స్వరూపం – పరమాత్ముడు ఎవరు? (నారాయణన్)
- స్వస్వరూపం – మనం ఎవరం? (జీవాత్మ స్వరూపం – ఆయన సుఖార్థమే మనకు ఉనికి)
- పురుషార్థ స్వరూపం – మన గమ్యం ఏమిటి? (కైంకర్యం – సేవ)
- ఉపాయ స్వరూపం – ఆ గమ్యాన్ని సాధించడానికి మార్గం ఏమిటి? (నారాయణుడే మార్గం)
- విరోధి స్వరూపం – ఆ గమ్యాన్ని పొందటానికి అడ్డంకులు ఏమిటి?
ఈ పాశురంలో, ఈ ఐదు విషయాలను గంభీరంగా చూపబడుతుంది:
- నారాయణ – పరమాత్మ
- నమక్కే – జీవాత్మలు (పరమాత్మానికే ఉనికిలు)
- పరై – కైంకర్య ఫలం
- తరువాన్ – ఆయనే మనకు ఫలాన్ని ప్రసాదిస్తాడు
ఇంత చిన్న వాక్యంలోనే ఆమె మొత్తం శాస్త్రసారాన్ని మనకు అందించారు!
తిరుప్పావై పాశురాల పరంపర:
1 – 5: నోము యొక్క ప్రతిజ్ఞలు
6 – 15: గోపికలను మేల్కొలపడం
16 – 20: నందగోప గృహానికి చేరుకోవడం
21 – 25: కృష్ణుడిని చేరేందుకు సరైన మార్గాన్ని అనుసరించడం
26 – 30: కృష్ణుడిని చేరటం, కైంకర్యం కోరటం
ఆండాళ్ పాశురాల్లో ముఖ్యాంశాలు:
- కైంకర్యమే గమ్యం, కైంకర్యమే మార్గం అని స్పష్టం చేశారు
- శ్రీవైష్ణవులకు కర్తవ్యాలు, నిషిద్ధాలు తెలిపారు
- భగవదనుభవం సమూహంగా చేయాలని చెప్పి 10 మందిని మేల్కొలుపుతుంది
- భగవంతుని చేరేందుకు ముందు ఆయన భక్తులను ఆశ్రయించాలి అని చెప్తుంది (బలరాముడు, యశోద, నందగోప మొదలైన వారు)
- పిరాట్టి ఆశ్రయం తప్పక తీసుకోవాలి
- ఎల్లప్పుడూ భగవంతునికి మంగళాశాసనాలు చేయాలి
- కైంకర్యం కోరాలి- ఎందుకంటే అది జీవాత్మ స్వరూపం
- కైంకర్యం ఆయన ఆనందార్థం మాత్రమే చేయాలి, మన స్వార్ధం కోసం కాదు
నాచ్చియార్ తిరుమొళి
ఆండాళ్, నాచ్చియార్ తిరుమొళిలో మన సంప్రదాయంలోని అనేక గొప్ప తత్త్వాలను వివరంగా తెలియజేస్తుంది. ఈ గ్రంథంలోని భావాలను చదవాలంటే లేదా వినాలంటే కూడ భక్తిలో ప్రౌఢత అవసరం అంటారు. మామునిగళ్ తమ ఉపదేశ రత్నమాలైలో 24వ శ్లోకంలో ఇలా అంటారు:
“అంజు కుళిక్కు ఓరు సంతతియాయ్ ఆళ్వార్గళ్
తళ సేయలై విన్జి నిల్కుమ్ తన్మైయలాయ్ – పింజాయ్
పళుత్తాళై ఆండాళై భక్తియుడన్ నాళుం
వళుత్తాయ్ మనమే మగిళ்ధు”
అంటే, ఆళ్వార్ల ప్రపన్న కులంలో అవతరించిన ఆండాళ్ బాల్యంలోనే విపరీతమైన జ్ఞానం, భక్తి, లోకబంధాల పట్ల అసక్తి చూపింది. “పింజాయ్ పళుత్తాళై” అని అంటే, ఐదేళ్ళ చిన్న వయసులోనే పండిన పండు వంటి పరిపక్వతను ప్రదర్శించింది. కాబట్టి, ఓ మనస్సా! ఆమె పట్ల భక్తితో ఉండు అంటూ మామునిగళ్ మనసు ఉపదేశిస్తారు.
నాచ్చియార్ తిరుమొళిలో ఆండాళ్, “మానిడవర్క్కెన్ఱు పెచ్చుప్పడిల్ వళగిల్లెన్ ” అని అంటే, “ఎవరైనా నన్ను కృష్ణుడికాక మరెవరికైనా పెళ్లి చేసేస్తామని మాట్లాడితేనే నేను బ్రతకలేను” అని ప్రకటిస్తుంది. ఈ స్థాయిలో భక్తిని పెరియాళ్వార్ ఆమెలో చిన్ననాటి నుంచే నాటిన ప్రేమ భావం వలన కలిగింది.
ఆమె రచించిన తిరుప్పావైలో, ఆండాళ్ శ్రీమన్నారాయణుడే ఉపాయం (మరియు ఉపేయం (ఆత్మ పొందాల్సిన ఫలితం) అని స్థిరంగా నిర్ణయించింది. అయినప్పటికీ, శ్రీమన్నారాయణుడు వచ్చి ఆమెను అంగీకరించకపోవడంతో ఆమె బాధపడింది. అలా ఆత్మ యొక్క తపనను వ్యక్తీకరిస్తూ, ఆండాళ్ నాచ్చియార్ తిరుమొళి అనే అపురూపమైన ప్రబంధాన్ని రచించింది.
ప్రతి పదిగంలోని చివర్లో ఆమె తనను విట్టుచిత్తన్ కోదై, భట్టర్పిరాన్ కోదై అని తనని తాను సంబోధించుకుంటుంది. పెరియాళ్వార్ల పట్ల ఉన్న ఆచార్యాభిమానం ప్రకటించింది. భూమిపిరాట్టి అవతారం అయిన ఆండాళ్ శ్రీమన్నారాయణుడితో తన అనుబంధాన్ని ప్రకటిస్తూ మనకీ భక్తి పారవశ్యం ప్రసాదించింది.
తిరుప్పావైలో ప్రాప్యము (లక్ష్యం) మరియు ప్రాపకము (ఆలక్ష్యానికి దారితీయడం) రెండింటినీ ఆండాళ్ స్పష్టంగా వివరించింది. అయితే, వెంటనే ఫలితం రాకపోవడంతో నాచ్చియార్ తిరుమొళి ఆమె మొదట ప్రేమ దేవత అయిన మాన్మధుడిని ఆశ్రయిస్తుంది. ఆ తరువాత పానీనీరాట్టం, కోయిల పాటలు, కలలలో శ్రీకృష్ణుని దర్శనాలు, పాంచజన్యుడిని ప్రశ్నించడం, మేఘాలను దూతలుగా పంపించడం, పువ్వులను చూసి బాధపడడం, తనపై ఆయన దయ చూపకపోవడాన్ని తట్టుకోలేక బాధపడడం వంటి అనేక మార్గాల్లో తన భక్తిని వ్యక్తం చేస్తుంది. చివరగా, శ్రీకృష్ణుడు పెరియాళ్వార్ కోసమైనా తనను అంగీకరిస్తాడని ఆశ పెట్టుకొని తన స్థితిని వివరించుకుంటుంది. కానీ స్వామి అప్పటికీ రాకవపోడంతో తన చుట్టుపక్కల వారితో స్వామి సంచరించిన ప్రదేశానికి తీసుకువెళ్ళమని, ఆయన శేష మాల ,శేష వస్త్రమైన ఇచ్చి తన ప్రాణాలు నిలబెట్టుకునే ప్రయత్నం చేసింది, కానీ ఎమ్పెరుమాన్ అప్పటికీ రాలేదు.
నాచ్చియార్ తిరుమొళి చివరి పదిగంలో, ఆ పదిగాన్ని ధ్యానించే వారికి కలిగే ఫలితం – శ్రీమన్నారాయణుని సేవలో నిరంతరం ఉండే అవకాశం – అని చెబుతుంది.
ఈ లోకం లోని బృందావనం లో గజేంద్రుని అనుగ్రహించిన పరమాత్మని ఆరాధించియే భాగ్యం పొందిన ఆండాళ్ అనుగ్రహించినవే ఈ పాశురాలు. ఆమె రచించిన ఈ పాశురాలను ఎవరైతే జనన-మరణ చక్రానికి ఔషధంగా అనుసంధానం చేస్తారో వారు శాశ్వతంగా ఎమ్పెరుమాన్ దివ్య శ్రీ చరణ కైంకర్యం చేసే భాగ్యం పొందుతారు.
ఈ విధంగా మనం తిరుప్పల్లాండు, పెరియాళ్వార్ తిరుమొళి, తిరుప్పావై మరియు నాచ్చియార్ తిరుమొళిల విశేషాలను చూశాము.
అడియేన్ ఉషా రామానుజ దాసి
అడియేన్ శ్రీకాంత్ రామానుజాదాసన్
ఆధారం: https://www.youtube.com/watch?v=kuXeAIqLzk4&list=PLcJLpGJlP9mo0F6_Uo0G6u6Ey5KRBbc2w&index=3
ఆంగ్లం లో: https://divyaprabandham.koyil.org/index.php/2023/11/simple-guide-to-dhivyaprabandham-part-2/
మూలము : https://divyaprabandham.koyil.org
ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org