యతిరాజ వింశతి – 1

శ్రీ:
శ్రీమతే శఠకోపాయ నమః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమద్వరవరమునయే నమః

యతిరాజ వింశతి

శ్రీమాధవాంఘ్రి జలజద్వయ నిత్యసేవా
ప్రేమా విలాశయ పరాంకుశ పాదభక్తం |
కామాది దోష హరమాత్మ పదస్రుతానాం
రామానుజం యతిపతిం ప్రణమామి మూర్ధ్నా ||

ప్రతి పదార్థము:

శ్రీమాధవాంఘ్రి జలజద్వయ = సమస్త సంపదలకు నిలయమైన  ” మా ” కు ధవుడైన మాధవుని, తామరలకు పొలిన శ్రీ పాదములకు చేయ తగిన

నిత్యసేవా ప్రేమా విలాశయ = నిత్య సేవా కైంకర్యములలో గల  అమిత ప్రీతి వలన మనసు ద్రవించిన

పరాంకుశ పాదభక్తం = పరాంకుశులనే నమ్మాళ్వార్ల శ్రీపాదములపై పరమ భక్తి గలవారైన

ఆత్మ పదస్రుతానాం = తమ శ్రీపాదములను చేరిన వారి

కామాది దోష హరం = కామాది దోషములను హరించ గల వారు

యతిపతిం = ఆత్మనిగ్రహము పొందిన యతులకు నాయకుడైన

రామానుజం = రామానుజులకు

మూర్ధ్నా = శిరసా

ప్రణమామి = నమస్కరిస్తున్నాను

భావము:

శ్రీ “ అనునది మాధవునికి విశేషణముగా అమరినది. శ్రీ వంటి మాధవుడని అర్థము. ” శ్రీ ” అంటే మహాలక్ష్మి. ఆమె స్వరూపము అందము, సువాసన,సౌకుమార్యము మొదలగునవి. స్వభావమనగా ప్రేమ, దయ, సౌశీల్యము, సౌలభ్యము మొదలైన ఆత్మ గుణములు. అందున తన దాసులను రక్షించు దృడవ్రతము గలది అని అర్థము. వీటన్నినంటితో పాటు శ్రీని ధరించినవాడు, ఆమెకు తగినవాడు, మాధవుడయిన శ్రీమన్నారాయణుని శ్రీపాదములని అన్వయము. శ్రీమహాలక్ష్మి నిత్యవాసము చేయు శ్రీమన్నారాయణుని శ్రీపాదములు అని కూడా అన్వయించుకోవచ్చు. అందువలననే ” శ్రీమతౌ హరిచరణౌ సమాస్రితొస్యహం” ( పిరాట్టి నిత్యనివాసము చేయు హరి శ్రీపాదములను శరణు జొచ్చాను నేను )సుందర బాహు స్తవము-1 లో కూరత్తళ్వాన్ అనుగ్రహించినట్లుగా మేల్కొటలో పిరాట్టితో కూడిన పెరుమాళ్ళను ప్రస్తావించారు. శ్రీకృష్ణునకు కైంకర్యము చేయాలని చాలా ఆశపడ్డ నమ్మళ్వార్లు ,ఆయన తానే వచ్చి చూడవలసి వుండగా తమ పారతంత్ర్యమును తొలగించుకొని ఆయన కోసము ‘ మడల్ ‘పాడు స్థితికి చేరుకున్నారు. “మాధవాంగ్రి జలజత్వయ నిత్య సేవా ప్రేమావిలాసయ పరాంకుశ ” అని పాడారు. ఎంపెరుమానార్లు కూడా అలాంటి భక్తినే కలిగి వున్నారు.  అందుకే ” మారన్ అడి పణిందుయందవన్ -ఇరామానుసన్ ” అన్నారు అముదనార్లు. వారి శ్రీపాదములను పట్టి వుండుటచే పరాంకుశ పాదభక్తం రామానుజం “అని వీరు పాడుతున్నారు.  వేదమును ప్రమాణముగా అంగీకరింపని జైన ,బౌద్ద మతవాదులు,  వేదమునకు విరుద్దముగా అర్థములను చెప్పు అద్వయితులు మొదలగు పరులకు అంకుశము వంటి వారగుట చేత రామానుజులు కూడా పరాంకుశులని పిలవ బడుతున్నారు.”ఒన్రుం దేవు “(తిరువాయిమొళి-4-10)లో  చేప్పారు.

రామానుజులు అంటే ఇక్కడ లక్ష్మణుల పునరవతారమని గ్రహించాలి. అళ్వార్లు పది మందిని కలిపి అభినవ దశావతారము అని కూడా అంటారు. వీరిలో నమ్మాళ్వార్లది రామావతారము. అందువలన అన్నావప్పంగారనే పూర్వాచార్యులు రామానుజులను లక్ష్మణుల పునరవతారమని నిర్ణయించారు. దానికి హేతువు ఏమిటంటే  రామానుజులకు ఉన్న పరమ భక్తి లక్ష్మణులకు శ్రీరాముడి మీద వున్న పరమ భక్తికి ఏమాత్రము తీసిపోదు. అంతే కాక శ్రీ రామానుజులు ముని పుంగవులు, ఇంద్రియములను జయించిన వారు. అర్థాత్ ఇంద్రియ నిగ్రహము కల వారే ఇతరుల దోషాలను పోగొట్ట్గల శక్తిని కలిగి వుంటారు. మాధవుని పాదములను తామరతో పోల్చడానికి కారణము దానికి గల మృధుత్వము, సువాసన మొదలైనవి. అందు వలన నమ్మళ్వార్లకు ఆ పాదముల మీద భక్తి ఉద్భవించినది. నమ్మళ్వార్ల పాదములను తామరతో పోల్చబడ లేదు.  వారు నమ్మళ్వార్ల శిష్యులు కావున రామానుజులకు ఆ పాదముల మీద భక్తి సహజముగానే ఏర్ప్డడినది. ఇలా సహజముగా ఏర్పడిన ఆచార్య భక్తి, భగవంతుడి గుణముల వలన ఏర్పడిన భక్తి కన్నా ఉన్నతమైనదిగా శాస్త్రములలో చెప్పబడినది.

మామునులు శ్రీ రామానుజులను ‘ఫరాంకుశ పాద భక్తం యతిపతిం రామానుజం’ అన్నారు . ఇక్కడ మామునులు  రామానుజులకు గల భక్తికి కారణమును చెపుతున్నారు.   తమ ఆచార్యులకు వారి ఆచార్యులైన నమ్మళ్వార్లు కూడా గొప్ప మునీశ్వరులు, భక్తి ఉందని చెపుతున్నారు. అందు వలననే వారిని ‘పరాంకుశ పాద భక్తం ” అని గౌరవముతో రాజా అన్నారు.” యతిపతిం ” అన్న పదానికి రెండు అర్థాలు ఉన్నాయి. ప్రాదమిదికంగా పతి(యతినం పతిహి యతిపతిహి ) అంటే శేషి అనగా రక్షింపబడువాడు. వుత్పత్యర్థములో పతి (పతి ఈతి పతిహి) అంటే రక్షించువాడు. రామానుజులు యతులకు పెద్ద, వారిని రక్షించువారు కావున వారు యతిపతి. తిరుమంత్రము ఈ అర్థాన్నే చెపుతుంది. కైoకర్యపరులకు ఆచార్యులే ఉన్నతులు వారే రక్షకులు. రామానుజుల గొప్పగుణాలను యతిరాజ వింశతిలో మామునులు వర్ణించారు.

అడియేన్ చూడామణిరామానుజదాసి

మూలము: http://divyaprabandham.koyil.org/index.php/2015/10/yathiraja-vimsathi-tamil-slokam-1/

పొందుపరిచిన స్థానము: http://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org

Leave a Comment