కోయిల్ తిరువాయ్మొళి – 6.10 – ఉలగముణ్డ

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

కోయిల్ తిరువాయ్మొళి

<< 5.8 – ఆరావముదే

srinivasan -ahzwar

శరణాగతి చేయునపుడు, భగవానుడికి ప్రాధాన్యత ఇస్తూ వారి దివ్య మంగళ గుణాలను కీర్తిస్తూ నొక్కిచెప్పాలి, ఉపాయాంతరములను ఎంచుకోక మరే ఇతర ఆశ్రయం లేక తమ నిస్సహాయతని నొక్కి చూపిస్తూ  పిరాట్టి యొక్క పురుషాకారము (శిఫార్సు) తో భగవానుడి దివ్య చరణాల యందు శరణాగతి చేయాలి. అటువంటి పరిపూర్ణమైన శరణాగతి  తిరువేంగడముడైయానుడి యందు ఆళ్వారు ఈ పదిగములో చేశారు.

మొదటి పాశురము: “అన్ని లోకాలను రక్షించగలిగే లక్షణము ఉన్న నీవు తిరుమలలో వెలసి ఉన్నావు. నీవు కృపతో, నీ దాసుడినైన నాకు నిన్ను పొందే మార్గాన్ని చూపించుము”, అని ఆళ్వారు ప్రార్థిస్తున్నారు.

ఉలగం ఉండ పెరువాయా ఉలప్పిల్‌ కీర్తి అమ్మానే
నిలవుం శుడర్‌ శూళ్‌ ఒళి మూర్తి నెడియాయ్‌ అడియేన్‌ ఆరుయిరే!
తిలదం ఉలగుక్కాయ్‌ నిన్ఱ తిరువేంగడత్తు ఎమ్పెరుమానే!
కుల తొల్‌ అడియేన్‌ ఉన పాదం కూడుమాఱు కూఱాయే

ప్రళయకాలములో గొప్ప ఆత్రుతతో సమస్థ లోకాలను తనలో దాచుకునేందు సాధనముగా వాడిన దివ్య అదరములు / నోరు కలిగి ఉన్న ఓ భగవానుడా!  అంతులేని కీర్తిప్రతిష్ఠ, సహజ స్వామిత్వము ఉన్న ఓ భగవానుడా!  దివ్య శోభతో నిండిన దివ్య స్వరూపము ఉన్నవాడా!  సౌందర్యము మొదలైన వాటితో నిత్యము ప్రకాశిస్తూ అపరిమితమైన కీర్తి ఉన్నవాడా! నాకు సంపూర్ణ ప్రాణాధారమైన ప్రాణ వాయువా!  నుదిటిపైన  తిలక రూపములో మొత్తము ప్రపంచానికే ఉర్ద్వాపుండ్రముల రూపంగా నీ స్వామిత్వాన్ని నాకు వెల్లడిచేస్తూ తిరుమలలో నిలుచొని ఉన్న ఓ నా భగవానుడా! అతి ప్రాచీన పరంపర నుండి వస్తున్న ఈ దాసుడికి నీ దివ్య పాదాలను చేరుకునే మార్గాన్ని అనుగ్రహించుము.

రెండవ పాశురము: “ఏమైనా అడ్డంకులు ఉంటే వాటిని నీవు తొలగించి, ని దివ్య పాదాల యందు నన్ను స్వీకరించాలి”, అని ఆళ్వారు అభ్యర్థిస్తున్నారు.

కూఱాయ్‌ నీఱాయ్‌ నిలనాగి, కొడువల్‌ అశుర ర్కులం ఎల్లాం
శీఱా ఎరియుం తిరునేమి వలవా తెయ్వ క్కోమానే
శేఱార్‌ శునై త్తామరై శెందీ మలరుం తిరువేంగడత్తానే!
ఆఱా అన్బిల్ అడియేన్‌ ఉన్‌ అడిశేర్‌ వణ్ణం అరుళాయే

అతి బలమైన క్రూర రాక్షసులను ముక్కలు ముక్కలుగా నరికి మట్టిలో కలిపి, ఇంత చేసిన తరువాత కూడా తన కోపము చల్లారని శౌర్య సంపద ఉన్న దివ్య తేజోమయమైన చక్రాయుధాన్ని నియంత్రించు చున్న సర్వశక్తి సంపన్నుడవైన ఓ భగవానుడా! ఓ నిత్యసూరులకు ప్రభువా! ఎర్రటి జ్వాల వర్ణముతో వికసించిన తామర పువ్వుల మడుగులు  ఉన్న తిరుమలలో కొలువై ఉన్న ఓ భగవానుడా! నీ దివ్య పాదాలను చేరుకోవాలని తపించిపోతూ నీపై అంతులేని ప్రేమను పెంచుకున్న ఈ దాసుడిని దయగా అనుగ్రహించుము.

మూడవ పాశురము: “నీవు ఎటువంటి ప్రయత్నం చేయనప్పుడు, నీవు అడిగినదల్లా నేను ఎలా ఇవ్వగలను?” అని ఎంబెరుమాన్లు పలుకగా, ఆళ్వారు సమాధానమిస్తూ ఇలా అన్నారు, “ఎంతో మంది విశిష్ట వ్యక్తులు నిన్ను ఆరాధిస్తూ ఆనందిస్తుండగా,   నీవు నన్ను ఎంచుకున్నావు; అదేవిధంగా, దయతో నీవు నా కోరికను తీర్చాలి”, అని వేడుకుంటున్నారు.

వణ్ణ మరుళ్‌ కొళణి మేగ వణ్జా! మాయ వమ్మానే!
ఎణ్జం పుగుందు తిత్తిక్కుం అముదే! ఇమైయోర్‌ అదిపదియే!
తెణ్ణల్‌ అరువి మణి పొన్‌ ముత్తలైక్కుం  తిరువేంగడత్తానే !
అణ్ఞలే! ఉన్‌ అడిశేర అడియేఱ్కు ఆవావెన్నాయే!

సర్వోన్నతుడైన భగవానుడు అత్యద్భుత గుణాలకు నిలయుడు, మేఘ వర్ణముతో చూసేవారిని మైమరిపించే స్వరూపము కలిగి ఉంటాడు; ఆతడు హృదయాలలోకి ప్రవేశించే తీపి తేనె లాంటివాడు; నిత్యసూరులను తన స్వరూపంతో ఆనందింపజేయువాడు; స్పష్టమైన మణి మాణిక్యాలు, రత్నాలు, ముత్యాలు, బంగారము పొంగి పొరలుతున్న ఆకర్షణీయమైన జలపాతాలు ఉన్న తిరుమాలలో  సర్వోన్నత భగవానిడిగా వెలసి ఉన్నాడు; నీ స్వామిత్వాన్ని అతి సునాయాసముగా తిరుమలలో వ్యక్తపరుస్తున్న ఓ భగవానుడా! మాపై జాలిపడి, మాకు తగిన గమ్యమైన నీ దివ్య పాదాలను చేరుకునేలా దయతో మమ్మల్ని అనుగ్రహించుము!

నాలుగవ పాశురము:  “నిన్ను చేరుకునే సాధనములు నాలో లేవు; కావున నీవొక సాధనాన్ని ఇచ్చి నన్ను దయతో అనుగ్రహించాలి”. “ఎటువంటి భేదము చూపకుండా ప్రతి ఒక్కరి అడ్డంకులను తొలగించే నీవు కృపతో,

నేను నీ దివ్య పాదాలను చేరుకునేలా చూడాలి” అని కూడా ఆళ్వారు ప్రార్థించినట్లు వివరించబడింది.

ఆవా! ఎన్నాదులగత్తె అలైక్కుం అశురర్‌ వాణాళ్మేల్‌
తీవాయ్‌ వాళి మళై పొళింద శిలైయా! తిరుమా మగళ్‌ కేళ్వా
తేవా! శురర్గళ్‌ ముని క్కణంగళ్‌ విరుంబుం తిరువేంగడత్తానే !
పూవార్‌ కళల్గళ్  అరువినైయేన్‌  పొరుందుమాఱు పుణరాయే

ప్రపంచాన్ని దగదగలాడించిన కౄర రాక్షసులపై అగ్ని ధరించిన బాణాల వర్షం కురిపించే శ్రీ సారఙ్గము ధరించిన ఓ భగవానుడా! పరాక్రమవంతుడు, అతిలోక సుందరుడు తనకు తగిన భర్తగా పొందినది శ్రీమహాలక్ష్మి, అలాంటి శత్రువులను వధించిన తరువాత సంతృప్తిపడుతూ దివ్య ముఖ కాంతిని వెదజల్లువాడా! సకల దేవతలు, ఋషులు కోరుకునేవాడు తిరుమాలలో కొలువై ఉన్నాడు. జయించలేని నా పాపాలెన్నో,  పుష్పాలతో దివ్యంగా అలంరించి ఉన్న నీ దివ్య పాదాలను చేరకుండా నన్ను ఆపుతున్నాయి; దయతో నీ దివ్య పాదాలను చేరుకునే మార్గాలను నాకు నేర్పుము.

ఐదవ పాశురము: “భక్తుల రక్షణ సునాయాసముగా నిర్వర్తించే నీ దివ్య పాదాలను నేను ఎప్పుడు చేరుకుంటాను?”, అని ఆళ్వారు ప్రశ్నిస్తున్నారు.

పుణరా నిన్ఱ మరమేళ్ అన్ఱెయ్ద ఒరువిల్‌ వలవావో!
పుణరేయ్‌ నిన్ఱ మరమిరండిన్ నడువే పోన ముదల్వావో!
తిణరార్‌ మేగమెన క్కళిఱు శేరుం తిరువేంగడత్తానే!
తిణరార్‌ శార్ఙ్గత్తున పాదం శేర్వదడియేన్‌ ఎన్నాళే?

సర్వ శ్రేష్ఠ ధనుర్ధారి అయిన భగవానుడు ఆ రోజు ఏడు మారామరములను వధించాడు; విశ్వ కారకుడైన అతడు చిన్న పసివాడిగా రెండు మహావృక్షముల మధ్యనుండి ప్రాకి వెళ్ళాడు;  దట్టమైన మేఘాల మాదిరిగా ఏనుగుల సమూహాలున్న తిరుమలలో విరాజిల్లి ఉన్న ఓ భగవానుడా! దివ్య శ్రీ సారఙ్గము ధనుస్సుని ధరించి ఉన్న నిన్ను నీ దివ్య పాదాలను ఈ సేవకుడు ఎప్పుడు చేరుకుంటాడో?

ఆరవ పాశురము:  “శ్రీవైకుంఠములో నాకు కైంకర్యము చేయాలనుకోవడం అందరికీ లక్ష్యమే, కాదా?” అని భగవానుడు అడుగుతున్నారు. దానికి ఆళ్వారు స్పందిస్తూ “ఎంతో కోరికతో కొందరు శ్రీవైకుంఠము నుండి తిరుమలకు దిగి వచ్చి నీకు సేవలందిస్తున్నారు కదా? తిరుమలలో నిన్ను సేవించే భాగ్యము నాకెప్పుడు కలుగుతుంది?” అని అభ్యర్థిస్తున్నారు. “నీపై భక్తిలేని దేవతలు కూడా సేవించాలనుకునే ఆకర్షణీయమైన నీ దివ్య చరణాలను నేను ఎప్పుడు పొందుతాను?”, అని కూడా ఆళ్వారు ప్రార్థించినట్లు వివరించబడింది.

ఎన్నాళే నాం మణ్ణళంద  ఇణై త్తామరైగళ్‌ కాణ్బదఱ్కెన్ఱు
ఎన్నాళుం నిన్టిమైయోర్గళ్‌ ఏత్తి ఇఱైంజి ఇనమినమాయ్
మెయ్న్నా మనత్తాల్‌ వళిపాడు శెయ్యుం తిరువేంగడత్తానే!
మెయ్ న్నా ఎయ్ది ఎన్నాళ్ ఉన్‌ అడిక్కణ్‌ అడియేన్‌ మేవువదే?

“అతి సులభుడివి, సమస్థ లోకాలను కొలిచిన నీ దివ్య పాదయుగళిని మేము ఎప్పుడు చూస్తామో? అని నిత్యాసూరుల సమూహాలు నిత్యమూ భక్తితో నిలబడి భగవానుడిని స్తుతిస్తూ ఉంటారు. తిరుమలలో ఉండి  వారిచే ఈ విధిగా ఆరాధించబడుతూ  సేవించబడుతున్న ఓ భగవానుడా! నీ విశేష సేవకుడినైన నేను నీ దివ్య పాదాలను ఎప్పుడు చేరుకుంటానో?

ఏడవ పాశురము: “నిన్ను చేరడానికి ఏ విధమైన ఇతర మార్గాలను అనుసరించలేదు, నీ పరమానందాన్ని అనుభవించకుండా నేను ఇక ఒక్క క్షణం కూడా ఉండలేను” అని ఆళ్వారు అంటున్నారు.

అడియేన్‌ మేవి అమర్గిన్ఱ అముదే! ఇమైయోర్‌ అదిబదియే!
కొడియా అడు పుళ్‌ ఉడైయానే !కోల క్కనివాయ్‌ ప్పెరుమానే!
శెడియార్‌ వినైగళ్‌ తీర్‌ మరుందే ! తిరువేంగడత్తు ఎమ్పెరుమానే!
నొడియార్‌ పొళుదుం ఉన పాదం కాణ నోలాదాఱ్ఱేనే

భగవానుడిని చేరి అనుభవించడం నాకు నిత్యము పరమానందకరమైనది; అతను నిత్యసూరులను నియంత్రించే ఆధిపత్యాన్ని కలవాడు; గరుడాళ్వాన్ నిత్యము భగవానుడి వద్ద ఉండి, ధ్వజ రూపముగా భక్తుల శత్రువులను పారద్రోలుతాడు; ఎర్రగా పండిన పండువలే అందమైన అధరములతో నిత్యానందాన్ని కలిగించే గొప్పతనము కలిగి ఉన్నవాడు అతడు;  దట్టమైన పొదలలా పెరిగిన నా పాపాలను తొలగించగల ఉత్తమ ఔషధములా తిరుమలలో కొలువై ఉన్న ఓ భగవానుడా! నన్ను దాసునిగా స్వీకరించగల వాడవు నీవొక్కడివే. నీ దివ్య చరణాలను దర్శించుకోవాలని నేను ఎటువంటి ప్రయత్నం చేయకపోయినా, వాటిని చూడకుండా ఒక్క క్షణం కూడా నేను ఉండలేకపోతున్నాను.

ఎనిమిదవ పాశురము: “నీవు ఎటువంటి ప్రయత్నం చేయనప్పుడు, ‘నేను ఇక భరించలేను’” అని చెబితే ఫలితం దొరుకునా?” అని భగవానుడు ప్రశ్నిస్తున్నారు.  ఆళ్వారు స్పందిస్తూ “మిత సామర్థ్యములు ఉన్న బ్రహ్మ మరియు ఇతరులు వారి అకించన్యం (వారిలో ఏమీ లేకపోవడం) ను ఉదహరించి వారి వారి కోరికలు నెరవేర్చుకోవట్లేదా? దయచేసి వచ్చి నా బాధలను తొలగింపుము”.

నోలాదాఱ్ఱేన్‌ ఉన పాదం కాణవెన్ఱు నుణ్ణుణర్విన్
నీలార్‌ కండత్తమ్మానుం నిఱై నాన్ముగనుం ఇందిరనుం
శేలేయ్‌ కణ్ఞార్‌ పలర్‌ శూళ విరుంబుం తిరువేంగడత్తానే!
మాలాయ్ మయక్కి అడియేన్‌ పాల్, వందాయ్‌ పోలే వారాయే

సర్వజ్ఞుడు, సూక్ష్మమైన విషయాలను కూడా గమనించగలిగేవాడు కాబట్టి ఈ విశ్వంలో ప్రాముఖ్యత పొంది నీలకంఠుడు అయ్యాడు, సృష్టించగల పరిజ్ఞానము ఉన్న చతుర్ముఖ బ్రహ్మ వీరికి తండ్రి, ముల్లోకాల ఐశ్వర్యము తన యందు ఉన్న ఇంద్రుడు, వీరందరూ ఆ భగవానుడిని “నీ దివ్య చరణాలను దర్శించుకోవాలని మేము ఎటువంటి ప్రయత్నం చేయకపోయినా, వాటిని చూడకుండా ఒక్క క్షణం కూడా ఉండలేకపోతున్నాము” అని ప్రార్థిస్తున్నారు. ఇటువంటి దేవతలు మీనము వంటి నేత్రము ఉన్న వారి పత్నులు (పార్వతి, సరస్వతి, సచి మొదలైన) లతో పాటు వారు అర్పిస్తున్న శరణాగతిని, ప్రార్థనలను అందుకుంటున్న ఓ తిరుమలవాసా! నల్లని కృష్ణుడిగా వచ్చి నీ లీలలతో ప్రతి ఒక్కరినీ మంత్రముగ్దులను చేసినట్లే, నీకే అంకితమై నీవు లేకుండా ఉండలేని నా వైపు నీవు ఒక చూపు చూడాలి!

తొమ్మిదవ పాశురము: “అతి సుందరమైన ఆకర్షణ కలిగి ఉన్న నీ దివ్య పాదాలను నేనెప్పటికీ వదిలిపెట్టను” అని ఆళ్వారు చెబుతున్నారు.

వందాయ్‌ పోలే వారాదాయ్‌ వారాదాయ్‌ పోల్‌ వరువానే
శెన్‌ తామరై క్కణ్‌ శెంగని వాయ్‌ నాఱ్ఱోళముదే ఎనదుయిరే
శిందామణిగళ్‌ పగరల్లెప్పగల్‌ శెయ్‌  తిరువేంగడత్తానే
అందో అడియేన్‌ ఉన పాదం అగలగిల్లేన్‌ ఇఱైయుమే

నీవు దగ్గరకు వచ్చినట్టే వచ్చి మాయమౌతావు, నా అకించన్యం (ఏ సామర్థ్యం లేకుండుట) తో “నీవు ఇక రావు, సాధ్యం కాదు” అని భావించిన వెంటనే వచ్చి వినయంగా ముందు నిలుచుంటావు. నీ దివ్య ఆకర్షణతో ఎర్రటి దివ్య కమల నేత్రాలతో, నిండుగా పండిన ఎర్రటి పండులా ఆనందపరచే నీ పెదవులతో “మామేకం శరణం వ్రజ” అని పలుకుతున్న నీ దివ్య అదరములు, “సుగాడం పరిషస్వజే” అని నీ భక్తులను ఆలింగనం చేసుకునే నీ దివ్య చతుర్భుజములతో నాకిప్పుడు స్పష్టముగా వ్యక్తమగుతున్నావు, నిరంతరము నాకు శక్తినిచ్చి నన్ను నిలబెట్టావు. కోరికలను ఫలింపజేసి తమ మెరుపుతో రాత్రిని పగలుగా మార్చే మణి మాణిక్య రాసులతో సుసంప్పన్నముగా వెలుగుతున్న తిరుమలలో నివాసుడై ఉన్న ఓ నా భగవానుడా!  అయ్యో! వేరే ఏ ఆశ్రయాన్ని అశించని నేను, నీకు సంపూర్ణ శరణాగతి చేసి, నీ దివ్య పాదాలను ఒక్క క్షణం కూడా వదలలేకపోతున్నాను. ‘అంధో’ అనగా ఆళ్వారు ఆశ్చర్యపోతున్నట్లు సూచన “విరహ వేదనలో ఇంత తపిస్తున్నా కానీ, నా కోరికను నీకు ఇంత విడమరచి చెప్పాల్సి వస్తుంది!”

పదవ పాశురము: “వేరే ఎక్కడ శరణు వేడకుండా, పురుషాకరము (పిరాట్టి) మరియు తగిన గుణాలున్న నీ దివ్య పాదాలకు నేను శరణాగతి చేస్తున్నాను”, అని ఆళ్వారు తిరువేంగడముడైయానుడికి సంపూర్ణముగా శరణాగతులైనారు.

అగలగిల్లేన్‌ ఇఱైయుం ఎన్ఱు అలర్మేల్‌ మంగై ఉఱై మార్బా!
నిగరిల్‌ పుగళాయ్‌ ! ఉలగం మూన్ఱుడైయాయ్‌ ! ఎన్నై ఆళ్వానే!
నిగరిల్‌ అమరర్‌ ముని క్కణంగళ్‌ విరుంబుం తిరువేంగడత్తానే!
పుగల్‌ ఒన్ఱిల్లా అడియేన్ ఉన్‌ అడిక్కీళ్‌ అమర్ న్దు పుగుందేనే

పద్మము నుండి జన్మించుటచే అతి కోమలమైన నీ దివ్య పట్ట మనిషి శ్రీమహాలక్ష్మి నీ దివ్య వక్ష స్థలములో నివాసమై ఉన్న ఓ భగవానుడా! లక్ష్మి  ఒక్క క్షణం కూడా నీ వక్ష స్థలముని విడిచి ఉండని ఓ భగవానుడా!  సాటిలేని వత్సల్యం కలవాడా! మూడు రకాల చేతనములు, అచేతనములకు స్వామిత్వం కలవాడా! ఎన్నో లోపాలున్న నన్ను కూడా స్వీకరించగల సౌశీల్యము ఉన్నవాడా! సాటిలేని ఋషులు మరియు అమరులు గొప్ప కోరికతో ఆరాధించే  తిరుమలలో పరిపూర్ణ సౌలాభ్యముతో కొలువై ఉన్నవాడా! ఉపాయాంతరములు, ఏ ఇతర రక్షణ లేకుండా అనన్యశరణుడిగా ఉన్న నేను, నీ దివ్య పాదాల యందు శరణాగతి చేసి, కేవలము కైంకార్య సంకల్పముతో వాటి క్రింద కూర్చున్నాను.

పదకొండవ పాశురము: “ఈ పదిగాన్ని నేర్చుకొని పఠించిన వారందరూ పరమపదానికి చేరుకొని, కైంకర్యముతో పట్టాభిషేకితులై నిత్య సేవలో పాల్గొంటారు” అని ఆళ్వారు తెలుపుతున్నారు.

అడిక్కీళ్‌ అమర్ న్దు పుగుందు అడియీర్‌ ! వాళ్మిన్‌ ఎన్ఱెన్ఱరుళ్‌ కొడుక్కుం
పడిక్కేళ్‌ ఇల్లా ప్పెరుమానై  ప్పళన క్కురుగూర్‌ చ్చడగోపన్‌
ముడిప్పాన్‌ శొన్న ఆయిరత్తు తిరువేంగడత్తుక్కివై పత్తుం
పిడిత్తార్‌ పిడిత్తార్‌ వీఱ్ఱిరుందు పెరియ వానుళ్‌ నిలావువరే

సర్వోన్నతుడైన భగవానుడు  సాటిలేని రీతిలో, “భక్తులారా! నా దివ్య చరణాల క్రింద చేరండి, అనన్యసాదనులు మరియు అనన్య ప్రయోజనులై నిత్యానందాన్ని పొందండి” అని ఎంతో కృపను అనుగ్రహిస్తున్నారు; సుసంపన్నమైన నీటి వనరులతో అలరాడే ఆళ్వార్తిరునగరికి స్వామి అయిన నమ్మాళ్వర్లు, తాను పాడిన వెయ్యి పాశురములలో,  తన కోరికలన్నిటినీ నెరవేర్చమని కోరుతూ ఆ తిరుమలవాసుడి గురించి ఈ పది పాసురములలో పాడారు; ఈ పాశురములను వాటి అర్ధాలతో సహా అనుసంధానము చేసినవారు, “పరమవ్యోమ” అనే పదాన్ని సూచిస్తూ అనంతమైన పరమపదమును పొంది పరమానందాన్ని అనుభవిస్తారు అని చెప్పబడింది.

అడియేన్ శ్రీదేవి రామానుజదాసి

మూలము : http://divyaprabandham.koyil.org/index.php/2020/05/thiruvaimozhi-6-10-simple/

పొందుపరిచిన స్థానము – http://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org

Leave a Comment