శ్రీ:
శ్రీమతే శఠకోపాయ నమ:
శ్రీమతే రామానుజాయ నమ:
శ్రీమద్ వరవరమునయే నమ:
తనియన్లు సంగ్రహ శ్లోకాలు. ప్రతి ప్రబంధమునకు ముందు తనియన్లు ఉంటాయి. కొన్ని నిత్య(పొదు)తనియన్లు ఉంటాయి.వీటిని సేవాకాలమునకు ముందుగాకోవెలలలోను,మఠములందు,శ్రీవైష్ణవ గృహములందు సేవించుట సంప్రదాయముగా ఉన్నది. ఇక్కడ వాటి అర్థములను చూద్దాము.
ఈ తనియన్ శ్రీరంగ నాధులచే అనుగ్రహింపబడినది. ఇందు మణవాళమామునులను ప్రస్తుతించారు.
*శ్రీశైలేశ దయా పాత్రం ధీ భక్త్యాది గుణార్ణవం |
యతీంద్ర ప్రవణం వన్దే రమ్య జామాతరం మునిం ||
భావము: శ్రీశైలాంశ సంభూతులై ‘తిరుమలై ఆళ్వార్’ అని ప్రసిద్దిచెందిన ‘తిరువాయ్ మొజి పిళ్ళై’ అను శ్రీశైలనాధుల దివ్య నిర్మల కరుణాపూరమునకు ఉత్తమ పాత్రభూతులును, ఙ్ఞాన భక్తి వైరాగ్యాది పరమ కల్యాణ గుణ గణ పరిపూర్ణులగు శ్రీ భగవత్ రామానుజ సంయమింద్రుల దివ్యమంగళచరణ పంకేరుహములందు అత్యన్త ప్రవణులై, తదేకాన్తికాత్యన్తిక పరభక్తి యోగ నిష్ఠులై, ఏకలవ్యునివలె వారికి అనన్యార్హ శిశ్యభూతులైయుండు శ్రీ అజగియ మణవాళమహామునులకు సర్వదేశ సర్వకాల సర్వావస్థలయందును త్రికరణశుద్దిగా నమస్కరించుచు సేవించుచున్నాను.
శ్రీ ప్రతివాది భయంకర అణ్ణంగరాచార్యుల వ్యాఖ్యానము.
“ఇప్పువియిల్ అరంగేసఱుక్కు ఈదళిత్తాన్ వాళియే”(ఈ భువిలో శ్రీరంగనాధులకు ఈడు వ్యాఖ్యానము చేసినవారు వర్థిల్లుగాక) మణవాళమామునులు శ్రీరంగనాధులకు నమ్మాళ్వార్ల “తిరువాయిమొళి”కి వ్యాఖ్యానము చెప్పారు.దానినేఈడు వ్యాఖ్యానము అంటారు.శాత్తుముఱై నాడు(ముగింపురోజున)శ్రీరంగనాధులు మామునులున్న సభలోనికి ఒక చిన్న పిల్లవాడిలాగ వచ్చి ఈ తనియనును చెప్పారు. వేదమునకు ఓం కారములాగా దివ్యప్రబంధము ప్రారంభములోను, ముగింపునందు ఈ తనియనును అందరు తప్పక సేవించాలని శ్రీరంగనాధులు శ్రీవైష్ణవులందరిని ఆఙ్ఞాపించారు.
* కూరత్తాళ్వాన్ అనుగ్రహించిన ఈ తనియనులో మన గురుపరంపర ప్రస్తుతించబడింది.
లక్ష్మీ: నాధ సమారంభామ్ నాధ యామున మధ్యమామ్
అస్మదాచార్య పర్యంతామ్ వందే గురు పరంపరాం
లక్ష్మీనాథ సమారంభాముగా నాధయామున మధ్యవారికీ
స్వాచార్య పర్యంతమున్న గురుపరంపరకు వందనములు
భావము:
తిరుమంత్ర ద్వయ చరమశ్లోకాదుల ప్రప్రధముగా ఉపదేశించుటచే ప్రథమాచార్యులగు శ్రీమన్నారాయణుని మొదటగా,శ్రీమన్నాధ యామునులను మద్యమునను,అస్మదాచార్యవర్యుల అంత్యమునందు కలిగి,నిత్య నిరవద్యమై తేజరిల్లు మన అచార్యపరంపరా రత్నమాలికను సర్వదేశ సర్వావస్థలయందు త్రికరణశుద్దితో సేవించుదును
*.కూరత్తాళ్వాన్ అనుగ్రహించిన ఈ తనియనులో శ్రీమద్రామానుజాచార్యుల వైభవము ప్రస్తుతించబడింది.
యోనిత్య మచ్యుత పదామ్భుజ యుగ్మ రుక్మ
వ్యామోహతః స్తధితరాణి తృణాయ మేనే
అస్మద్గురోః భగవతోస్య దయైకసింధోః
రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే
ఎవరైతే అచ్యుతుని పాదాంభుజయుగ్మములను ఆశ్రయించారో
సమస్త వ్యామోహాదులను త్రుణముగా భావించారో అట్టి
దయాసింధువైన మా ఆచార్యులైన రామానుజచార్యుల చరణములే నాకు శరణ్యము
భావము:
భగద్వ్యతిరిక్త సమస్త విషయములు నిస్సారములని తీర్మానించి వానినన్నిటినీ తృణీకరించి,సర్వ దేశ సర్వకాల సర్వావస్థలయందు శ్రీమన్నారాయణుని శ్రీమచ్చరణనళినయుగమను దివ్య సువర్ణ నిధియందు నిరవదిక ప్రావణ్యము కలిగినవారలును,నిఖిలహేయ ప్రత్యనీక కళ్యాణగుణగణ మహార్ణవులును,కారుణ్యామృతదుగ్దసింధువులును,శ్రీ వైష్ణవ బృందములకెల్ల నిరుపాధిక పరమ విలక్షణాచార్య సార్వభౌములునగు శ్రీ భగవత్ రామానుజులు పాదపద్మములను,నేననన్య శరణ్యుడనై శరణుజొచ్చుచున్నాను.
*.ఆళవందార్లు అనుగ్రహించిన ఈ తనియన్ నమ్మాళ్వార్ల ఔన్నత్యమును తెలుపుతున్నది.
మాతా పితా యువతయ స్థనయా విభూతి:
సర్వం య దేవ నియమేన మదన్వయానాం
ఆద్యస్యన: కులపతేర: వకుళాభిరామం
శ్రీమత్తదంఘ్రియుగళం ప్రణమామి మూర్ధ్నా
భావము:
ఎవరైతే తల్లి,తండ్రి,సంతానము, సంపద మరియు సమస్తమో ,శ్రీవైష్ణవ కులభూషణమో,ప్రపన్నజనకూటస్థులగు అట్టి నమ్మాళ్వార్లకు మరియు వకుళమాలికానిత్యాలంకృతమగు శ్రీమత్పాదారవింద యుళమునకు శిరస్సాష్టాంగ దండవత్ప్రణామములను సమర్పించుచున్నాను శిరసు వంచి నమస్కరిస్తున్నాను.
*.పరాశర భట్టర్ అనుగ్రహించిన ఈ తనియనులో ఆళ్వార్లు ఎంపెరుమానార్లు స్తుతించబడ్డారు. ఈశ్లోకమును ఒకసారి నంజీయరు కోరికమేరకు భట్టరువారు అనుగ్రహించారు.
భూతం సరశ్చ మహదాహ్వయ భట్టనాథ
శ్రీ భక్తిసార కులశేకర యోగివాహాన్
భక్తాంఘ్రి రేణు పరకాల యతీంధ్ర మిశ్రాన్
శ్రీమత్ పరాంకుశ మునిం ప్రణతోస్మి నిత్యం
భావము:
నేను నిరంతరము నమ్మాళ్వార్, భూదత్తాళ్వార్, పొయిగై ఆళ్వార్, పేయాళ్వార్, పెరియాళ్వార్, తిరుమళిసై ఆళ్వార్, కులశేకర ఆళ్వార్,తిరుప్పాణాళ్వార్, తొందరడిప్పొడి ఆళ్వార్, తిరుమంగై ఆళ్వార్ మరియు ఎంపెరుమానార్లనుసేవిస్తాను.
శ్రీ ప్రతివాది భయంకర అణ్ణంగరాచార్యుల వ్యాఖ్యానము.
పది మంది ఆళ్వార్లను,ఎంపెరుమానార్లను ప్రస్తుతించే ఈ శ్లోకమును ప్రతిదినము శ్రీవైష్ణవులందరు సేవించుకోవాలి.కొందరు ఈ శ్లోకములో ఆళ్వార్ల నామములు క్రమముగా లేదని భావించవచ్చు.
“కాసార భూత మహధాహ్వయ భక్తిసారాన్ శ్రీమచ్చతారి కులశేకర భట్టనాతాన్, భక్తాంగ్రిరేణు మునివాహన కార్తికేయాన్ రామానుజంచ యమినం ప్రణతోస్మి నిత్యం“అని కూర్చటమేమి కష్టము కాదు. భట్టరు వారు”భూతం సరస్చ….” అని ప్రాంభించటములో ఒక విశేషమున్నది.
నమ్మాళ్వార్లు తక్కిన ఆళ్వార్లందరికి నాయకులుగా మన పూర్వాచార్యులు కొన్ని శ్లోకాములలో కీర్తించివున్నారు.వీరిని “అవయవి”(శరీరము)అంటారు.తక్కిన ఆళ్వార్లందరు వీరి అవయవము అనగా తల, కళ్ళు, చెవులు…ఈ శ్లోకములో భూదత్తాళ్వార్లను– తలగాను, పొయిగైఆళ్వార్లను,పేయాళ్వార్-కళ్ళుగాను, పెరియాళ్వార్లను- ముఖముగాను, తిరుమళిసై ఆళ్వార్లను-కంఠముగాను, కులశేకర ఆళ్వార్లను,తిరుప్పాణాళ్వార్లను-కరములుగాను, తొండరడిప్పొడి ఆళ్వార్లను-హృదయముగాను, తిరుమంగై ఆళ్వార్లను-నాభిగాను మరియు ఎంపెరుమానార్లను-శ్రీచరణములుగాను వర్ణించారు.
పై శ్లోకము వలన ప్రపన్నజన కూటస్థులైన నమ్మాళ్వార్లను శరీరముగాను తక్కిన ఆళ్వార్లను వారి అవయవములుగాను భట్టరు వర్ణించారని గ్రహించాలి
( ఇది కాంచీపురము ప్రతివాది భయంకరం అణ్ణంగరాచార్యస్వామి అనుగ్రహించిన నిత్యానుసంధానము వ్యాఖ్యానము ఆధారముగా రాసినది.)
*.దొడ్డైయ్యంగార్ అప్పై ఈ తనియన్ పొన్నడిక్కల్ జీయరును ప్రస్తుతించి అనుగ్రహించారు.(వీరు పొన్నడిక్కల్ జీయర్ శిష్యులైన అష్టధిగ్గజములలో ఒకరు.)
రమ్యజామాతృ యోగీంద్ర పాదరేఖా మయం సదా
తతా యతాత్మ సత్తాధిం రామానుజ మునిం భజే
భావము:
మణవాళమామునుల పాదరేఖవంటి వారు,దాసులు,వారి పరికరమువంటివారు అయిన వానమామలై జీయర్(పొన్నడిక్కాల్ జీయర్) శ్రీపాదములను ఆశ్రయిస్తాను.
పొన్నడిక్కాల్ జీయరు (మామునుల శిష్యులు,శ్రీరంగనాధుల మరియు మామునుల ఆనతి మేరకు వానమామలై/తోతాద్రి మఠములను స్థాపించినవారు.)తనియన్ వానమామలై దివ్యదేశమునందును,నవ తిరుపతులలోను, వానమామలై మఠములలోను వారి శిష్యుల గృహములందును సేవిస్తారు. శ్రీశైలేస దయాపాత్రం తనియన్ సేవించగానే ఈ తనియన్ సేవిస్తారు.ఈ తనియన్ ఆచార్య పురుషుల తిరుమాళిగైలలో కూడా సేవించుదురు ఆత్తాన్ తిరుమాళిగై (ఆళ్వార్ తిరునగరి), ముదలియాణ్డాన్ తిరుమాళిగై (అప్పాచియారణ్ణా – అణ్ణవిలప్పన్ వారసులు), మొదలగు, వారియొక్క మొదటి ఆచార్యులు పొన్నడిక్కాల్ జీయర్ శిష్యులు.
అడియేన్ చూడామని రామానుజదాసి
Source: http://divyaprabandham.koyil.org/?page_id=11
Divyamyna pashura arthamulu maku Jeevansai Sapalyamu
Plz sri sotra ratnam translation in telugu and hindi very very helpfull to all sri vaishnava s
Adiyan ramanuja dasan