నాచ్చియార్ తిరుమొళి – సరళ వ్యాఖ్యానము – పన్నిరండాం తిరుమొళి – మఱ్ఱు ఇరుందీర్గట్కు

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

నాచ్చియార్ తిరుమొళి

<< పదినొన్ఱాం తిరుమొళి – తాం ఉగక్కుం

ఆతడు సర్వరక్షకుడని, అందరినీ రక్షిస్తాడని ఎంబెరుమానుడి మాటలను ఆమె నమ్మింది, కానీ ఫలించలేదు. పెరియాళ్వార్లతో తనకున్న సంబంధాన్ని ఆమె నమ్మింది. అది కూడా ఆమె ఆశించిన ఫలాన్ని ఇవ్వలేకపోయింది. వీటి చింతన చేస్తూ బాధని అనుభవించింది. ఎంబెరుమానుడు స్వతంత్రుడు అయినందున, ఆమె తన ఆచార్యులైన పెరియాళ్వార్ల ద్వారా ఆతనిని పొందాలని ప్రయత్నించింది. అది కూడా ఆమె ఆశించిన ఫలాన్ని ఇవ్వలేకపోయింది. ఆమె అనుకుంది “ఎంబెరుమానుడు స్వతంత్రుడు. తన భక్తులని ఆతడు కాపాడకపోతే, ఆతను అపకీర్తి పాలౌతాడు. ఆతడు ఎవరినైనా రక్షించాలను కుంటే దానిని ఆపేవారెవ్వరూ లేరు. అందువల్ల ఆతని స్వతంత్రతయే ఫలాన్ని పొందడానికి సాధనముగా పనిచేస్తుంది” అని తిరిగి అతడి వద్దకి వెళ్లడానికి ప్రయత్నించింది. ఆమె ఈ విషయంలో దృఢ నిశ్చయంగా ఉన్నప్పటికీ, ఆతను రాకపోయే సరికి, ఏమి చేయాలో తెలియక గాబరా పడింది. ప్రేమ అధికమై పొంగి ప్రవహిస్తున్న కారణంగా ఆమె ఆతను వచ్చే వరకు ఆగలేకపోయింది. భగవానుడికి పరతంత్రురాలన్న తన స్వరూపానికి విరుద్ధమైనప్పటికీ, ఏదో విధంగా అతనిని చేరుకోవాలని తాపత్రేయపడుతూ, తన చుట్టూ ఉన్న వాళ్ళని “భగవానుడు నిత్య నివాసుడై ఉండే ఉత్తర మథుర, ద్వారక వంటి స్థానాలకు చేర్చండి” అని ఆమె అభ్యర్థించింది.

మొదటి పాశురము: “ఎంబెరుమానుడు వచ్చే వరకు నువ్వు ఎదురుచూడాలి, ఇంత తాపత్రేయ పడే అవసరం లేదు” అని చుట్టూ ఉన్నవాళ్ళు అన్నారు. “నా పరిస్థి గురించి అర్థం కాని వారితో మాట్లాడి ఫలితం లేదు” అని ఆమె బదులిచ్చెను.

మఱ్ఱిరుందీర్గట్కు అఱియలాగా మాదవన్ ఎన్బదోర్ అన్బు తన్నై
ఉఱ్ఱిరుందేనుక్కు ఉరైప్పదెల్లాం ఊమైయరోడు శెవిడర్ వార్ త్తై
పెఱ్ఱిరుందాళై ఒళియవే పోయ్ ప్పేర్తొరు తాయిల్ వళర్ంద నంబి
మఱ్పొరుందామఱ్కళం అడైంద మదురై ప్పుఱత్తు ఎన్నై ఉయ్ త్తిడుమిన్

నా పరిస్థితి వేరు నీ పరిస్థితి వేరు. మాధవుడి (శ్రీ మహాలక్ష్మీకి పతి) పట్ల ప్రేమ ఎంతో ఎత్తుకి ఎదిగిన నాకు మీరు ఏమి చెప్పినా అది మూగ చెవిటి వాడి మధ్య సంభాషణ వలె వ్యర్థకరమైనది. మీరు చేయగలిగినది ఒక్కటే. తన కన్న తల్లి అయిన దేవకిని విడిచిపెట్టి యశోధ దగ్గర పెరిగిన కృష్ణుడు ఉన్న మధురకి నన్ను తీసుకెళ్లండి.

రెండవ పాశురము: “ఏది ఏమైనా, నీవు ఆతడి వెనకపడటం ఏమీ బాగోలేదు, ఆతడికి చెడ్డ పేరు వస్తుంది; నీవు నీ స్త్రీత్వాన్ని కూడా కాపాడుకోవాలి కదా?” అని చుట్టూ ఉన్న వారు అన్నారు.

నణి ఇనియోర్ కరుమం ఇల్లై నాల్ అయలారుం అఱిందొళిందార్
పాణియాదు ఎన్నై మరుందు శెయ్దు పండు పణ్డాక్క ఉఱుదిరాగిల్
మాణి ఉరువాయ్ ఉలగళంద మాయనై క్కాణిల్ తలైమఱియుం
ఆణైయాల్ నీర్ ఎన్నై క్కాక్క వేణ్డిల్ ఆయ్ ప్పాడిక్కే ఎన్నై ఉయ్ త్తిడుమిన్

సిగ్గుపడడంలో ఇక ప్రయోజనం లేదు. ఊరి జనాలకు అన్ని విషయాలు తెలుసిపోయాయి. నన్ను ఎంబెరుమానుడితో ఏకం కాక ముందు, అతని నుండి వీడి ఇలా బాధ పడక ముందు ఉన్న స్థితిలో నన్ను చూడాలనుకుంటే, ఏమాత్రం ఆలస్యం చేయకుండా, నన్ను తిరువాయర్పాడి (శ్రీ గోకులం) కి తీసుకెళ్లండి. వామనుడి రూపంలో అవతరించి సమస్థ లోకాలను కొలిచిన ఆ భగవానుడిని ఆరాధిస్తే నా రోగం మాయమౌతుంది.

మూడవ పాశురము: కృష్ణుడి విషయంలో యశోదా పిరాట్టి పెంపకాన్ని నిందించి ప్రయోజనం లేదు. తండ్రిగా కృష్ణుడిని నియంత్రించాల్సిన శ్రీ నంద గోపుడి దివ్య భవనం ముందు తనను దిగబెట్టమని ఆమె వారికి కోరుతుంది.

తందైయుం తాయుం ఉఱ్ఱరుం నిఱ్కత్తని వళి పోయినాళ్ ఎన్నుం శొల్లు
వంద పిన్నై ప్పళి కాప్పరిదు మాయవన్ వందు ఉరుక్కాట్టుగిన్ఱాన్
కొందళమాక్కి ప్పరక్కళిత్తు క్కుఱుంబు శెయ్వాన్ ఓర్ మగనై ప్పెఱ్ఱ
నందగోపాలన్ కడైత్తలైక్కే నళ్ళీరుట్కన్ ఎన్నై ఉయ్ త్తిడిమిన్

ఊరంతా ఈ విషయము పాకిపోయింది.  తల్లి తండ్రులు బంధుమిత్రులు వీధిలో ఉండగా, వాళ్ళకి కళంకం తెచ్చే పని చేయకూడదు, కానీ ఒంటరిగా కూడా వెళ్లడం సాధ్యం కాదు. దివ్య లీలలు ఆడిన ఆ శ్రీ కృష్ణుడు తన దివ్య స్వరూపంతో నా ముందుకు వచ్చి నన్ను ఆకర్షిస్తున్నాడు. ఆడపిల్లలతో జగడాలు ఆడి, అల్లరి చేసి నాకు నిందలు తెచ్చిన ఆ శ్రీ నందగోప తనయుడి దివ్య భవనము యొక్క ప్రవేశ ద్వారం వద్దకు అర్ధరాత్రి వేళ నన్ను తీసుకెళ్లండి.

నాలుగవ పాశురము: ఎంబెరుమానుడికి పూర్ణ శరణాగతురాలైన ఆమెను యమునా తీరాన వెదలమని వాళ్ళని ఆమె ప్రార్థిస్తుంది.

అంగై త్తలత్తిడై ఆళి కొండాన్ అవన్ ముగత్తన్ఱి విళియేన్ ఎన్ఱు
శెంగచ్చుక్కొండు కణ్ణాడై ఆర్ త్తుచ్చిఱు మానిడవరైక్కాణిల్
నాణుం కొంగై త్తలమివై నోక్కిక్కాణీర్ గోవిందనుక్కల్లాల్ వాయిల్ పోగా
ఇంగుత్తై వాళ్వై ఒళియవే పోయ్ యమునైక్కరైక్కు ఎన్నై ఉయ్ త్తిడుమిన్

ఓ తల్లులారా! నా స్తనములను దగ్గరగా గమనించండి. అల్పమైన వాళ్ళని చూడటానికి సిగ్గుపడుతూ తమపైన ఎర్రటి వస్త్రాన్ని కప్పుకున్నాయి. అందమైన తన హస్థములో దివ్య చక్రాన్ని ధరించిన కృష్ణుడి ముఖం తప్పా మరెవ్వరినీ చూడనంటున్నాయి. గోవిందుడి ఇంటి ద్వారము తప్పా మరెవరి ఇంటి ద్వారాన్ని చూడనంటున్నాయి. ఇక్కడ ఇక ఉండలేను, కాబట్టి ఇక్కడ జీవించే కన్నా నన్ను యమునా తీరానికి తీసుకెళ్లండి.

ఐదవ పాశురము: అక్కడ ఉన్నవారు ఆమె బాధ ఏమిటో తెలుసుకుని సరైన పరిహారమేమిటో చేయాలని భావించారు. తనతో సంబంధం ఉన్నంత మాత్రాన తన బాధ ఏమిటో తెలుసుకోలేరని ఆమె ఆగ్రహించింది.

ఆర్ క్కుం ఎన్ నోయ్ ఇదు అఱియల్ ఆగాదు అమ్మనైమీర్! తుళదిప్పడాదే
కార్ క్కడల్ వణ్ణన్ ఎన్బాన్ ఒరువన్ కైకణ్డ యోగం తడవత్తీరుం
నిర్ క్కరై నిన్ఱ కడంబై ఏఱి క్కాళియన్ ఉచ్చియిల్ నట్టం పాయ్ంద
పోర్ క్కళమాగ నిరుత్తం శెయ్ద పొయ్గైక్కరైక్కు ఎన్నై ఉయ్ త్తిడుమిన్

ఓ మాతలారా! నా బాధ మీకెవ్వరికీ అర్థం కాదు. మీరు దుఃఖించకుండా, మీరు నన్ను యమునా తీరమున వదిలి పెట్టండి.  కదంబ వృక్షము పైకి ఎక్కిన కృష్ణుడు, కాలియ అనే సర్ప రాక్షసుడి శిరస్సుపైకి దూకి నటనమాడి యమున తీరముని యుద్ద భూమిగా మార్చాడు. నల్లటి సాగరపు వర్ణతో ఉన్న అటువంటి కృష్ణుడు తన దివ్య హస్తాలతో నన్ను మెల్లగా రాసి మందలిస్తే ఈ వ్యాధి నయమవుతుంది. తక్షణ పరిహారం కావాలంటే ఇది ఒక్కటే మార్గం.

ఆరవ పాశురము: ఋషిపత్నుల చేతుల నుండి కృష్ణుడు అన్నం తిన్న ప్రదేశంలో ఆమెను దింపమని ఆమె వారిని కోరుతుంది.

కార్ త్తణ్ ముగిలుం కరువిళైయుం కాయా మలరుం కమలప్పూవుం
ఈర్ త్తిడుగిన్ఱన ఎన్నై వందిట్టు ఇరుడీకేశన్ పక్కల్ పోగే ఎన్ఱు
వేర్ త్తుప్పశిత్తు వయిఱశైందు వేణ్డడిశిల్ ఉణ్ణుంబోదు ఈదెన్ఱు
పార్ త్తిరుందు నెడునోక్కు క్కొళ్ళుం పత్తవిలోశనత్తు ఉయ్ త్తిడుమిన్

వర్షాకాలంలో ఏర్పడిన మేఘాలు, కరువిళా పుష్పాలు, కాయాంబు పుష్పాలు, తామర పుష్పాలు నా ముందు నిలబడి “నువ్వు కూడా హృశీకేశుడి దగ్గరకు వెళ్ళు, అని నన్ను బలవంతం చేశాయి“. ఆవుల కాపరిగా భక్తవిలోచనుడు, ఆవులను మేపుటకు వెళ్లి చెమటలు కార్చుకుంటూ, ఆకలితో కృంశించుకు పోయిన కడుపుతో అలసిపోయి, అన్నం పట్టుకు వచ్చే ఋషిపత్నుల రాకకై ఎదురుచూసి, వాళ్ళు రాగానే “నువ్వు కావలసినంత తిను” అని లీల ఆడిన ప్రదేశానికి నన్ను  తీసుకెళ్లండి.

ఏడవ పాశురము: ఈ దుఃఖానికి అంతు ఎప్పుడు అని అడిగినప్పుడు, ఆతడి దివ్య తుళసి మాలను ధరిస్తేనే అది ముగుస్తుంది అని ఆమె తెలిపి, ఆతడి దివ్య దండను ఉంచిన చోటికి తీసుకెళ్లమని ఆమె వారిని కోరింది.

వణ్ణం తిరివుం మనం కుళైవుం మానం ఇలామైయుం వాయ్ వెళుప్పుం
ఉణ్ణల్ ఉఱామైయుం ఉళ్ మెలివుం ఓద నీర్ వణ్ణన్ ఎన్బాన్ ఒరువన్
తణ్ణందుళాయ్ ఎన్నుం మాలై కొండు శూట్ట త్తణియుం పిలంబన్ తన్నై
పణ్ణళియ ప్పలదేవన్ వెన్ఱ పాణ్డి వడత్తు ఎన్నై ఉయ్ త్తిడుమిన్

నా ముఖచాయలో మార్పు, మనస్సులో అలసట, నిర్లజ్జ స్థితి, పాలిపోయిన నా పెదవులు, ఆహారం సహించకపోవడం, జ్ఞానము క్షీణించుట వంటి ప్రేమ సూచనము నాలో కనిపిస్తున్నాయి. ఆ నీల వర్ణుడు అద్వితీయుడైన కృష్ణుడు ధరించిన చల్లని, అందమైన దివ్య తుళసి మాలను నేను ధరించినప్పుడు ఇవన్నీ నన్ను వదిలివేస్తాయి. మీరు దానిని ఇక్కడికి తీసుకురాలేరు కాబట్టి, నన్ను బాండీరం అనే మర్రి చెట్టు ఉన్న ప్రదేశానికి తీసుకెళ్లండి. కృష్ణుడి సోదరుడైన బలరాముడు ప్రలంబాసురుడు అనే రాక్షసుడి ఎముకలు విరిచి  వధించిన ప్రదేశమది.

ఎనిమిదవ పాశురము: ఆతడు గోవులను రక్షించిన గోవర్ధనము వద్దకి తీకుకువెళ్ళమని ప్రార్థిస్తుంది.

కఱ్ఱినం  మెయ్ క్కిలుం మేయ్ క్కప్పెఱ్ఱాన్ కాడు వాళ్ శాదియుం ఆగప్పెఱ్ఱాన్
పఱ్ఱి ఉరలిడై ఆప్పుం ఉణ్డాన్ పావిగాళ్! ఉంగళుక్కు ఏచ్చుక్కొలో?
కఱ్ఱన పేశి వశవుణాదే కాలిగళ్ ఉయ్య మళై తడుత్తు
కొఱ్ఱ  కుడైయాగ ఏంది నిన్ఱ గోవర్తనత్తు ఎన్నై ఉయ్ త్తిడుమిన్

కృష్ణుడికి గోవులు, వాటి దూడల మందలని మేపుట వృత్తిగా ఉండేది. తమ ఇండ్లు వదిలి అడవులలో కాపరిగా నివసించే యాదవ వంశంలో జన్మించాడు. ఆతడు వెన్న దొంగిలిస్తూ పట్టుబడ్డాడు, రోటికి కూడా కాట్టివేయబడ్డాడు. ఆతడి గుణాలను అల్లరి పనులను తప్పుగా అర్థచేసుకునే వాళ్ళారా! నాచే మీరు తిట్టించుకోడానికి ఇవే కారణాలైనవి ! మీరు విన్నది నాకు చెప్పి నాతో తిట్టించుకునే బదులు, గొడుగులా కృష్ణుడు గోవర్ధనగిరిని ఎత్తి గోవులను ఆదుకున్న చోటికి నన్ను తీసుకెళ్లండి.

తొమ్మిదవ పాశురము: నిందల నుండి తప్పించు కోవాలనుకుంటే తనని ద్వారకకి తీకుకువెళ్ళమని ప్రార్థిస్తుంది.

కూట్టిల్ ఇరుందు కిళి ఎప్పోదుం గోవిందా! గోవిందా! ఎన్ఱు అళైక్కుం
ఊట్టు క్కొడాదు శెఱుప్పనాగిల్ ఉలగు అళందాన్ ఎన్ఱు ఉయరక్కూవుం
నాట్టిల్ తలైప్పళి ఎయ్ది ఉంగళ్ నన్మై ఇళందు తలైయిడాదే   
శూట్టుయర్ మాడంగళ్ శూళ్ందు తోన్ఱు తువరాపదిక్కు ఎన్నై ఉయ్ త్తిడుమిన్   

నేను పెంచుకుంటున్న చిలుక పంజరంలో నుండి  గోవిందా! గోవిందా !అని పిలుస్తోంది! నేను దానికి ఆహారాన్ని ఇవ్వకుండా శిక్షించినట్లయితే, అది ఉలగలంద పెరుమానే! అని అంటుంది. కానీ ఆ దివ్య నామాలను నేను వింటే మూర్చ వచ్చి పడిపోతున్నాను. అందుకే, ఈ ప్రపంచంలో పెద్ద నిందను సంపాదించి పేరు పాడుచేసుకొని, మీ తలలు వంచుకునే కంటే, ఎత్తైన భవనాలతో మెరిసిపోతున్న ద్వారకకు నన్ను తీసుకెళ్లండి.

పదవ పాశురము: ఎమ్పెరుమానుని నివాస స్థానాలకి తీసుకువెళ్లమని ప్రార్థిస్తూ ఆండాళ్ పాడిన ఈ పాశురములను పఠించిన వారు అర్చా మార్గం ద్వారా శ్రీవైకుంఠాన్ని పొందుతారని చెప్పి ఆమె ఈ పదిగాన్ని ముగించింది.

మన్ను మదురై తొడక్కమాగ వణ్ తువరాపది తన్నళవుం
తన్నై త్తమర్ ఉయ్ త్తుప్పెయ్య వేణ్డిత్తాళ్ కుళలాళ్ తుణింద తుణివై
పొన్నియల్ మాడం పొలిందు తోన్ఱుం పుదువైయర్కోన్ విట్టుశిత్తన్ కోదై
ఇన్నిశైయాల్ శొన్న శెంజొల్ మాలై ఏత్త వల్లార్ క్కు ఇడం వైగుందమే

బంగారు భవనాలతో ప్రకాశించే శ్రీవిల్లిపుత్తురుకి నాయకుడైన పెరియాళ్వార్ల దివ్య కుమార్తె ఆండాళ్, పొడగాటి శిరోజాలతో అతి సౌదర్యవతి అయిన ఆమె తన బంధువులను మధురతో ప్రారంభించి ద్వారక వరకు ఉన్న దివ్య స్థానాలకు తీసుకెళ్లమని ప్రార్థిస్తూ ఆమె ఈ పది పాశురాలను కూర్చింది. మధురమైన సంగీతాన్ని జోడించి పదాల మాల వంటి ఈ దివ్య కీర్తనలు పఠించగల సామర్థ్యం ఉన్నవారికి నివాస స్థలం ఖచ్చితంగా పరమపదమే.

అడియేన్ శ్రీదేవి రామానుజదాసి

మూలము: http://divyaprabandham.koyil.org/index.php/2020/05/nachchiyar-thirumozhi-12-simple/

పొందుపరిచిన స్థానము – http://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org

Leave a Comment