ఉపదేశ రత్తినమాలై – సరళ వ్యాఖ్యానము – పాశురము 25 – 26

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

ఉపదేశ రత్తినమాలై

<<గతశీర్షిక

పాశురం 25

ఇరవదైదవ పాశురములో మధురకవి అళ్వారుల వైభవమును కృపచేయుచున్నారు. తన మనస్సునకు మధురకవి ఆళ్వార్లు ఈ భూమండలము మీద అవతరించిన చైత్ర మాసము చిత్తా నక్షత్రము రోజు మిగిలిన ఆళ్వార్లు అవతరించిన రోజులకన్నా ఎంత గొప్పనైనదో పరిశీలించి చూడమని చెప్పుచున్నారు.

ఏరార్ మధురకవి ఇవ్వులగిల్ వన్దుదిత్త! శీరారుమ్ శిత్తిరైయిల్ శిత్తిరైనాళ్* పారులగిల్ మత్తుళ్ళ ఆళ్వార్ గళ్ వన్దుదిత్త నాళ్ గళిలుమ్! ఉత్త దమక్కెన్ఱు నెఞ్జే ఓర్!!

ఓ మనసా! గొప్ప కీర్తిగల మధురకవి ఆళ్వార్లు ఈ లోకంలో అవతరించిన చైత్ర మాస చిత్తా నక్షత్ర ప్రాశస్త్యమును గుర్తింపుము. ఈ భూమి మీద అవతరించిన మిగతా ఆళ్వార్ల తిరువవతార దినముల కంటే మన స్వరూపమునకు తగినట్లుగానున్నది ఈ ఆళ్వార్ల అవతారమని యోచించి చూడు. మధురకవి ఆళ్వార్ల విశిష్టతను పిళ్ళలోకాచార్యులనే మన పూర్వాచార్యులు శ్రీ వచన భూషణమనే దివ్య శాస్త్రములో అందముగా వివరించినారు. మిగిలిన ఆళ్వార్లు పరమాత్మతో కొంత కాలము విశ్లేష పునః సంశ్లేషం పొంది పాశురములను కృపచేయగా మన మధురకవి ఆళ్వార్లో సర్వకాల సర్వావస్థలయందు తమ ఆచార్యులైన నమ్మాళ్వార్లే సర్వస్వమని తలచి సర్వ విధ కైఞ్జ్కర్యము/కైంకర్యములను సమర్పించి సర్వకాలములయందు ఆనందమునే పొంది ఇతరలను కూడా దీనినే ఆచరించమని ఉపదేశించినారు. ఇట్టి గొప్పతనము ఇతరులకెక్కడిది? “శీరారుం శిత్తిరైయిల్ శిత్తిరైనాళ్” అను వాక్యము చైత్ర మాసమునకును చిత్తా నక్షత్రమునకునూ అన్వయింపబడును. మన స్వరూపమేమనగా ఆచార్య కృపకై ఎదురు చూడడం. ఈ ఆళ్వార్ల స్థితే అందుకు నిదర్శనము.

పాశురం 26

ఇరవై ఆరవ పాశురములో మామునులు పూర్వాచార్యులు, ఏ ఆళ్వార్లు కృప చేసిన పాశురార్థములను ఉదాహరణ పూర్వకముగా వివరిస్తూ మధురకవి ఆళ్వార్ల ప్రబంధమును కూడా జతచేసినారు.

వాయ్ త్త తిరుమన్దిరత్తిన్ మత్తిమమామ్ పదమ్ పోల్! శీర్త మధురకవి శెయ్ కలైయై* ఆర్తపుగళ్ ఆరియర్ గళ్ తాజ్ఞ్గళ్ అరుళిచ్చెయల్ నడువే!! శేర్విత్తార్ తాఱ్పరియం తేర్ న్దు!!

ఎనిమిది అక్షరములతో కూడిన తిరుమంత్రం అక్షర పూర్తి మరియు అర్థ పూర్తిని కలిగినదై ఉన్నదని శాస్త్ర వచనము. ఆ మంత్రము మధ్యలో గల “నమః” అనే పదము ఎంత గొప్పదో అదే విధముగా మధురకవి ఆళ్వార్ల “కణ్ణినుణ్ శిరుత్తామ్బు” ప్రబంధము అంత ప్రాధాన్యమైనదిగా పూర్వాచార్యులు భావించినారు. అందుచేతనే ఈ ఆళ్వార్ల ప్రబంధమును మిగిలిన ఆళ్వార్లు కృపచేసిన ప్రబంధములతో పాటు చేర్చుటయేకాక అనుసంధించే విధముగా నిర్ణయించినారు.
నమః శబ్దము భాగవత శేషత్వమును – ఎంబెరుమాన్ భక్తుల దాస్యమును – సూచిస్తుంది. మధురకవి ఆళ్వార్లు దేవమత్తరియేన్ (నాకు ఏ ఇతర దేవతలు తెలియదు) నమ్మాళ్వార్లనే తన దైవముగా భావించినారని వారి ప్రబంధములో అనుట ద్వారా, పూర్వాచార్యులు దీనిని అంతరార్థముగా భావించుట ద్వారా ఈ ప్రబంధమును మిగిలిన ఆళ్వార్ల ప్రబంధములతో చేర్చి ఆదరించి గౌరవించినారు.

అడియేన్ వీ.వీ.ఎల్.ఎన్. ఆచార్యులు రామానుజ దాసన్

మూలము : http://divyaprabandham.koyil.org/index.php/2020/06/upadhesa-raththina-malai-25-26-simple/

ఇక్కడ భద్రపరచబడి ఉన్నాయి : http://divyaprabandham.koyil.org

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org

Leave a Comment