జ్ఞానసారము – తనియన్

శ్రీః
శ్రీమతే శఠకోపాయ నమః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమత్ వరవరమునయే నమః

జ్ఞానసారము

తనియన్

కార్తికే భరణిజాతమ్ యతీంద్రాచార్యమ్ ఆశ్రయే
జ్ఞాన ప్రమేయ సారాభి వక్తారమ్ వరదమ్ మునిమ్

భావం: కార్తిక మాసము, భరణి నక్షత్రములో అవతరించినవారు, యతీంద్రులైన భగవద్రామానుజులను ఆశ్రయించినవారు, తమ జ్ఞానసార, ప్రమేయసారములలో ఆచార్యుల ఔన్నత్యమును చాటినవారు అయిన అరుళాళ మామునులను ఆశ్రయిస్తున్నాను.

రామానుజార్య సచ్చిష్యం వేద శాస్త్రార్థ సంపదం
చతుర్దాశ్రమ సంపన్నం దేవరాజ మునిం భజే

భావం: రామానుజాచార్యులకు మంచి శిష్యులు, వేదాది సకలశాస్త్ర పారంగతులు, నాలుగవ ఆశ్రమమైన సన్యాశాస్రమును స్వీకరించిన  అరుళాళ మామునులను ఆశ్రయిస్తున్నాను.

సూచిక – (రామానుజార్య సచ్చిష్యం)   పూర్వాశ్రమలో  వీరు యఙ్ఞమూర్తి అనే తిరునామముతో ఉన్నప్పుడు పద్దెనిమిది రోజులు  తర్కం మొదలగు వేదాంత భాగములపై రామానుజాచార్యులతో  వాద వివాదం చేసి వారిని సంప్రదాయం ఎట్లు కాపాడవలెనో అని చింతామగ్నులుగా చేసారు.అప్పుడు , పరమ కృపాసాగరులు హస్తిగిరి  వరదరాజులు రామానుజాచార్యులకు స్వప్నములో కనపడి ఎంబెరుమానారే మీరు  అలసిపోవలదు. మీకు ఒక ఉత్తమ శిష్యులను అనుగ్రహిస్తున్నాను, అతడి పైగెలుస్తారు అని అన్నారని గురుపరంపర ప్రభావములో ఉన్న విషయమును ఇక్కడ గుర్తు చేసుకోవాలి.

(వేద శాస్త్రార్థ సంపదం) –       రామానుజాచార్యులతో పద్దెనిమిది రోజులు వేదాంత చర్చ చేసిన ప్రజ్ఞ వలన  ,ఙ్ఞానసార ప్రమేయసార గ్రంథములలో వేదము మొదలగు శాస్రములలోని సారవంతమైన అంశములను చక్కని వెణపా  అనే ఛందస్సులో కూర్చడము వలన వీరి ప్రజ్ఞా పాటవములు బోధపడుతున్నది.

(దేవరాజ మునిం) – కృపాసాగరుడైన దేవరాజ పెరుమాళ్ళ వలన రామానుజాచార్యులకు శిష్యులైన ఔన్నత్యము, జ్ఞాన, భక్తి ,వైరాగ్యముల పరాకాష్ట కావటము , రామానుజమునికి సమానముగా ప్రకాశించటము వలన  వీరు అరుళాళముని అన్న తిరునామమును పొందారు.

ఙ్ఞానసార తనియన్-

సురుళార్ కరుంకుళల్ తోగైయార్ వేల్ విళియిల్ తువళుమ్
మరుళామ్ వినై కెడుమ్ మార్గం  పెత్తేన్ మఱైనాన్గుమ్ శొన్న
పొరుళ్ ఙ్ఞాన సారత్తై పుందియిల్ తందవన్  పొంగొళిశేర్
అరుళాళ మామునియమ్ పొఱ్కళల్ గళ్ అడైంద పిన్నే

భావము – నాలుగు వేదములనుండి అంతరార్థములను వెలికితీసి ,తిరుమంత్రములోని సారమును చేర్చి, జ్ఞానసారము, ప్రమేయసారములను గ్రంథములను చేసి లోకములో జ్ఞానమును పెంచి జ్ఞానజ్యోతిగా ప్రకాశించిన వారు  అరుళాళ మాముని అనే నామధేయులైన ఆచార్యులు.   అందమైన, అందరు పొంద దగిన వారి శ్రీపాదములను చేరిన తరువాత  ఆత్మ స్వరూపమును తెలుసుకొనే మార్గమును కనుగొన్నాను.

అనాది కాలములందు చేయు కర్మముల వలన, ఆత్మ నిజ స్వరూపం యొక్క జ్ఞానము తగ్గుతుంది. అలా తగ్గడం వలన స్త్రీ విషయములో మోహమును పెంచుతున్నది.  ఆ మోహమునకు కారణమైన ఉంగరములు తిరిగిన కురులు, బాణముల వంటి చూపులలో చిక్కిన మనసు జారిపోతున్నది.  అరుళాళ మామునుల శ్రీపాదములనాశ్రయించిన తరువాత కామము వంటి తుచ్చమైన కోరికల నుండి విముక్తి దొరికింది.

అరుళాళ పెరుమాళ్  శ్రీపాదములనాశ్రయించిన తరువాత వారనుగ్రహించిన జ్ఞానసారము, ప్రమేయసారము అనే ప్రబంధముల వలన బుద్ది వికసించింది.  స్త్రీ వ్యామోహముతో పాటు కోపము, లోభము, మోహము, మదము, ఈర్ష్య, అసూయ, మొదలగు దోషములు కూడా తొలగి పోతాయి.  కామము, అజ్ఞానము,  మొహము ఆజీవితము వరకు ఉండే రోగాలు అని తిరుక్కురళ్ లో చెప్పినట్లు  మనుష్యుల సంస్కారానికి హాని కలిగించే దోషములు అయినప్పటికీ ఆచార్యులను ఆశ్రయించటము వలన తొలగిపోతాయి అని గ్రహించాలి. ఈ తనియన్ వలన ఆచార్య వైభవం తెలుసుకున్నాము.

అడియేన్ ఇందుమతి రామానుజదాసి

మూలము : http://divyaprabandham.koyil.org/index.php/2014/11/gyana-saram-thaniyan-invocation/

పొందుపరిచిన స్థానము – http://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org

Leave a Comment