కణ్ణినుణ్ శిఱుత్తాంబు – 11 – అంబన్ తన్

శ్రీ:
శ్రీమతే శఠకోపాయ నమ:
శ్రీమతే రామానుజాయ నమ:
శ్రీమద్వరవరమునయే నమ:

కణ్ణినుణ్ శిరుతాంబు

<< పాశురం 10

nammazhwar-madhurakavi-paramapadham

పాశుర అవతారిక:

నంజీయర్ వ్యాఖ్యానం

చివరగా ఈ ప్రబంధము నేర్చిన వారు నమ్మాళ్వార్ల ఆధీనములోని శ్రీవైకుంఠములో స్థిరముగా ఉంటారు అని  మధురకవులు ఈ ప్రబంధము  యొక్క ఫలశ్రుతి చెపుతున్నారు.

నంపిళ్ళై,  పెరియవాచ్చాన్ పిళ్ళై,  అళగియ మణవాళ  పెరుమళ్  నాయనార్  కూడా అదే విషయాన్ని చెప్పారు. మధురకవులు ముందటి పాశురాలలో చెప్పిన ముఖ్యాంశాలను చూద్దాము:

* పాశురము -1  నమ్మాళ్వార్లు అనుభవింప దగిన వారు.

* పాశురము -2  నమ్మాళ్వార్లు తనకు స్వామి,  నాథుడు అయినందున ఆయన ప్రబంధమును పాడుతూ తిరుగుతాను.

* పాశురము -3  నమ్మాళ్వార్లతో తనకున్న సంబంధము వలన భగవంతుడు కూడా తన కృపా దృష్ఠిని ప్రసరిస్తాడు.

* పాశురము -4   నమ్మాళ్వార్లు   తనను దోషాలతో  సహా  స్వీకరిస్తాడు.

* పాశురము -5   ఆళ్వార్తిరునగరిలో అడుగు పెట్టగానే   తన   పాపాలు,  దోషాలు అన్నీ తొలగిపోతాయి.

* పాశురము -6 నమ్మాళ్వార్లు   తన పాపాలు, దోషాలు అన్నీ తొలగిపోయే విధముగా తనను సంస్కరించటమే కాక అవి  తిరిగి రాకుండా వారి గురించి కాపాడుకునేట్లుగా నియమించారు.

* పాశురము -7   నమ్మాళ్వార్ల కీర్తిని పాడుతూ నలుదిశల వ్యాపింప చేయటమే  వీరి జీవన కైంకర్యం.

* పాశురము -8 నమ్మాళ్వార్ల   ప్రీతి భగవంతుడి  ప్రీతి కన్న మిన్న.

* పాశురము -9 ఆ ప్రీతితోనే  నమ్మాళ్వార్లు ఎంతగానో కృప చేశారు.

* పాశురము -10 అంతటి మహనీయులకు దాసుడు చేయతగ్గ ప్రత్యుపకారమేమున్నది.

ప్రస్తుత పాశురములో మధురకవులు ఈ ప్రబంధమును నేర్చిన వారు   పరమపదములో  నిత్యసూరులకు  ప్రీతి పాత్రులవుతారని  చెపుతున్నారు. ఆళ్వార్తిరునగరికి వెళ్ళి నమ్మాళ్వార్ల కైంకర్యము చేయాలనుకునే వారికి నమ్మాళ్వార్లు కూడా పరమపదములో దర్శనమిస్తారు అని తెలుపుతున్నారు.

పాశురము

అంబన్ తన్నై అడైందవర్క్ కెల్లాం అన్బన్

తెన్కురుకూర్ నగర్ నంబిక్కు అన్బనాయ్

మధురకవి సొన్న సొల్ నంబువార్ పది

వైకుందం కాణ్మిన్

ప్రతిపదార్థము:

అంబన్ తన్నై = ఎవరైతే  ఆశ్రిత పక్షపాతో

అడైందవర్క్ కెల్లాం =  భాగవతులంతా ఎవరికి శరణాగతులో

అన్బన్ =  ఎవరైతే భక్తులో

తెన్కురుకూర్ నగర్ నంబిక్కు =  ఆళ్వార్తిరునగరి వాసులైన నమ్మాళ్వార్లకు

అన్బనాయ్ = భక్తుడై

మధురకవి సొన్న సొల్ =  మధురకవులు చెప్పిన  ప్రబంధమును

నంబువార్ = నమ్మినవారు

వైకుందం = శ్రీ వైకుంఠములో

పది = స్థానమును

కాణ్మిన్ = పొందుతారు

భావము:

మధురకవులు చెప్పిన  ప్రబంధమును నమ్మినవారు,  ఆళ్వార్తిరునగరి వాసులైన నమ్మాళ్వార్లకు   భక్తులైన వారు , ఎవరైతే ఆశ్రిత పక్షపాతులో,  భాగవతులంతా ఎవరికి శరణాగతులో, అట్టి పరమాత్మకు వాస స్థానమైన  శ్రీ వైకుంఠము చేరుకుంటారు.

నంజీయర్ వ్యాఖ్యానము:

* అంబన్ తన్నై… – శ్రీరామాయణము యుధ్ధ కాణ్దములో  30.56   “రిపూణం అపి వత్సల:”  అన్నట్లు రాముడికి శతృవుల మీద  కూడా వాత్సల్యము చూపు వాడు. అదే భగవత్తత్వము.

* తెన్కురుకూర్… – నమ్మాళ్వార్ల మీదే కాక వారి స్వస్థలమైన ఆళ్వార్తిరునగరి మీద కూడా   మధురకవుల  కున్న అపారమైన ప్రేమ వీరి స్వభావమును తెలియ జేస్తుంది.

* నంబువార్… – మధురకవుల ప్రబంధమును నమ్మి విశ్వసించిన వారికి ,  శ్రీవైకుణ్ఠము మాత్రమే లక్ష్యము. ఇక్కడ ఒక వ్యతిరేక భావము గోచరిస్తున్నది. ఇంతకు ముందు    నమ్మళ్వార్లే శరణన్నారు కదా! అయినప్పుడు  ఆళ్వార్తిరునగరి కదా లక్ష్యము కావాలి.  ఆళ్వార్తిరునగరి పొలిందునిన్ఱ పిరాన్, నమ్మాళ్వార్ల ఆధీనములో ఉంది. (అక్కడ దేవస్థానమును     ఆదినాతర్ ఆళ్వార్ దేవస్థానము అంటారు).   తిరువిరుత్తం 75 పాశురం లో “అడియార్ నిలాగిన్ఱ వైకుంథమో?”  అన్నారు(భక్తుల  అధీనములో ఉన్న   శ్రీవైకుణ్ఠము).

* ఈ ప్రబంధమును సేవించిన స్థలము కూడా   శ్రీవైకుణ్ఠముగా మారిపోతుంది. నంబి తిరువళుదివళనాడు దాసుడు  కూరత్తాళ్వానుకు,   పరాశర భట్టర్ జన్మించగానే  సంసారమునకు పరమపదమునకు బేధము లేదు. వీరు ఆ సరిహద్దులను చెరిపివేశారన్నారు.

నంపిళ్ళై ఈడు వ్యాఖ్యానము:

* అన్బన్ – అనర్హులపై  కూడా వాత్సల్యము చూపగల వాడు.  శ్రీరామాయణము యుధ్ధ కాణ్దములో 30.56 “రిపూణం అపి వత్సల:” అన్నారు.  అది జీవాత్మకు పరమాత్మకు ఉన్న సంబంధము. దీనినే జితంతే స్తోత్రము  2 లో  “దేవానం దానవానాం చ సామాన్యం అధి దైవతం”  (దేవ దానవులకు అందరికీ నువ్వే దైవము) అన్నారు.

* తన్నై అడైంతవర్కు  ఎల్లాం అన్బన్ – నమ్మాళ్వార్ల  ప్రీతి భగవంతుడి ప్రీతిలాంటిది కాదు. తిరువాయిమొళి 3.7.1 “పరమనైప్ పయిలుం తిరువుడైయార్ యవరేలుం అవర్ కణ్డీర్  ఎమ్మైయాళుం పరమర్”  (భగవద్భక్తి అనే ధనము గలవారెవైరైననూ నాకు దైవమే)అన్నారు.

తెన్కురుకూర్ నగర్ నమ్బిక్కు అన్బనాయ్ – భగవద్భాగవత ప్రీతితో ఆగలేదు మధురకవులు.  వారి ఆచార్య ప్రీతిని ప్రకటిస్తున్నారు.

భగవద్కైంకర్య ప్రియులు భగవంతుడి కైంకర్యమే చేస్తారు. భాగవత కైంకర్య ప్రియులు భాగవత  కైంకర్యమే చేస్తారు. కాని ఇద్దరి కైంకర్యము చేయాలనుకునే వారు దానికి సంబంధించిన ఙ్ఞానానిచ్చే ఆచార్య కైంకర్యము చేస్తే చాలు. ఆచార్యులు భగవత్తత్వము తెలిపేవారేకాక అంతిమ గమ్యమైన పరమపదమునకు చేర్చువారు,  పురుషాకార భూతులు.   పరమపదములో కూడా  భగవద్కైంకర్యము చేయించగల సమర్దులు.

* నంబువార్పతి వైకుందం కాణ్మినే – నంబి తిరువళుదివళనాడు దాసులు మధురకవుల ప్రబంధమును విశ్వసిస్తే   పరమపదము తప్పక లభిస్తుందని అన్నారు.

*  నంజీయర్ల సమకాలీనులైన పెఱ్ఱి అనే ఆచార్యులు పేర్కొన్న  విషయాలనే  నంపిళ్ళైచెప్పారని భట్టరు వారి వ్యాఖ్య.

పెరియవాచ్చాన్ పిళ్ళై  వ్యాఖ్యానము: వీరు ఎక్కువగా  నంపిళ్ళైతో ఏకీభవిస్తారు.

* అన్బన్ – జీవాత్మ పరమాత్మల సంబంధమును తెలిపే మరొక  ప్రమాణము  మహాభారతము , అరణ్య పర్వం 192.56 నుండి చూపబడింది. అది “సర్వేషామేవ లోకానాం పితా మాతా చ మాధవ:” (శ్రీమన్నారాయణుడు,  శ్రీ మహాలక్ష్మి,  సమస్త జీవులకు మాతా పితరులు).

నంబిక్కన్బనాయ్ –   గీతా 7.18 “ఙ్ఞానితు ఆత్మ ఏవ మే మతం” ( నా అభిప్రాయంలో ఙ్ఞాని అంటే నా  ఆత్మయే). మహాభారతం ఉద్యోగ పర్వము 74.27 “మమ ప్రాణా హి పాణ్దవా:” (పాణ్దవులు నా ప్రాణములు). పై విషయమును ధృవీకరిస్తూ ఈ రెండు ప్రమాణములు ఇక్కడ చూపబడినవి.

* వైకుంఠం –   పరమపదం నిత్యసూరుల  ముక్తాత్మల వాసస్థానము అనటానికి మరొక  ప్రమాణము  తిరువాయిమొళి 3.9.9  “వానవర్ నాడు”  (నిత్యసూరుల, ముక్తాత్మల వాసస్థానము. అని చెప్పబడిందే కాని భగవంతుడి వాసస్థానమని చెప్పలేదు.).

* నంబువార్పతి వైకుంతం కాణ్మినే –   ప్రమాణము  తిరువాయిమొళి 5.3.9 “ఉరైక్కవల్లార్కు వైకుంతమాగుం తమ్మూరెల్లాం” (తిరువాయిమొళిని సేవించే వారికి తమ ఊరే  పరమపదము ).

  • అన్బన్… – ఈ పాశురములో,  నమ్మాళ్వార్లు, మధురకవి ఆళ్వార్లు,  కణ్ణినుణ్ శిఱుత్తాంబు దివ్య ప్రబంధము, వీటి గురించి తెలుసు కోవటము వలన ప్రయోజనమును వివరించ బడింది.
  • అన్బన్… – భగవంతుడు అందరి పట్ల నిర్హేతుకమైన కృపను చూపించే వాడు.  స్తోత్రరత్నం 10 లో “ఏవం నిసర్గ సుహృది – న చిత్రమిదం ఆశ్రిత వత్సలత్వం” ( అర్హతలను చూడకుండా అందరిపై అపారామైన కృపను చూపేవాడవు నువ్వు.  నీ భక్తులపై నీవు చూపే వాత్సల్యములో ఎంతమాత్రము అసహజత్వము గోచరించదు.). “సర్వలోకైక  వత్సల:” అని నువ్వు కొనియాడబడ్డావు.  శ్రీరామాయణము సుందరకాణ్దము 21.20 లో, “శరణాగత వత్సల:”  అనీ,  శ్రీరామాయణము యుధ్ధ కాణ్దము 30.56లో,  “రిపూణం అపి వత్సల:”అని చెప్పబడింది. ఇంకా తన భక్తుల తప్పులను పరిగణించనని  శ్రీరామాయణము  యుధ్ధ కాణ్దము 18.3 లో,“…దోశో యత్యపి…”   అని స్పష్టము చేసాడు.

“…ప్రహిభవం అపరాధ్ధూర్ ముగ్ధ సాయుజ్యదోభూ:…”  అని స్తోత్ర రత్నం 63 లో  చెప్పినట్లుగా శిశుపాలుడు ఎన్ని తప్పులు చేశాడు, అయినా క్షమించి,  అతనికి మోక్షము ఇవ్వలేదా!

  • భగవంతుడి గుణములన్నింటిలో ఈ వాత్సల్యము  అత్యుత్తమమైనది. దీని వలననే ఆయనకు స్వామిత్వము  అబ్బింది. ఈ గుణము వలననే అందరూ భగవంతుడిని ఆశ్రయిస్తున్నారు.
  • మధురకవి ఆళ్వార్లు   “కణ్ణినుణ్ శిఱుత్తాంబినాల్ కట్టుణ్ణప్పణ్ణియ పెరుమాయన్ ఎన్నప్పన్” అని మొదలు పెట్టి  మొదటి పాశురములో   భగవంతుడి గుణములైన సౌశీల్యము , సౌలభ్యము , స్వామిత్వములను వివరించి, చివరి పాశురమును  వాత్సల్యముతో ముగించారు. ఇది భగవంతుడి గుణములన్నింటిలో ఉన్నత్తమైనది మరియు భాగవతులకు  కావలసినది, అందరు కోరుకునేది కావటము విశేషము.
  • అన్బన్ తన్నై అడైంతవర్కు ఎల్లాం అన్బన్ –  నమ్మాళ్వార్ల గురించి చెప్పడము మొదలు పెట్టి, భగవంతుడు సహజ సంబంధము వలన ప్రేమ చూపుతాడు. అలా కాక, భగవంతుడిపై  ఎవరు భక్తి చూపుతారో, వారు తన పట్ల  ప్రేమను చూపక పోయినా,  వారి జన్మ ఎలాంటిదైనా,  వారిని ప్రేమించేవారు నమ్మాళ్వార్లు అని చెప్పారు. తిరువాయిమొళి 3.7.8 లో,  “కుంబి నరకర్గళ్ ఏత్తువరేలుం … ఎం తొళు కులం తాంగళ్” ( కుంబీనరకములో ఉన్నవారైనా   భగవంతుడిని కీర్తిస్తే, వారు నాకు ప్రాతఃస్మరణీయులే) అన్నారు.  ఇంకా, తిరువాయిమొళి 3.7.9 లో “ ఎత్తనై నలం తాన్ ఇలాత చండాళ చణ్దాళర్గళాగిలుం,  మణివణ్ణాఱ్కాళెఱౄ ఉళ్ కలణారడియార్ తం అడియార్ ఎం అడిగళ్”               ( చండాళురైనా,  మరే సుగుణమూ లేని వారైనా భగవంతుడికి శరణాగతులైతే వారు నాకు యజమానులే.) అన్నారు.
  • •అన్బన్: నమ్మాళ్వార్లు భాగవతుల కోసము భగవదనుభవమును కూడా వదులుకోగలరు. తిరువాయిమొళి  8.10.7 లో “… అవనడియార్, ననిమాక్కలవి ఇన్బమే నాళుం వాయ్క”  ( వాడి భక్తులతోటి ఆనందమే నాకు లభించు గాక ).
  • తెన్ కురుకూర్… – నమ్మాళ్వార్ల  భగవ్భాగవత భక్తికి వారు అవతరించిన దివ్యదేశమే  కారణము .
  • నంబి – ఆత్మగుణ పరిపూర్ణులు ( జీవాత్మకు తప్పక ఉండవలసిన గుణము).
  • అన్బనాయ్ – మధురకవులు, నమ్మాళ్వార్ల  భక్తులై ఆత్మ గుణ పూర్తిని పొందారు.
  • అన్బనాయ్ మధురకవి ఆళ్వార్లు – తిరువాయిమొళి  2.1.1 1 లో “ఆరాత కాతల్ కురుకూర్  శఠకోపన్”  నమ్మాళ్వార్లు భగవంతుడికి ప్రియమైన వారు.  భగవంతుడి పై అపారమైన ప్రేమకల ఆల్వార్తిరునగరి వాసులైన  శఠకోపుల మీద అపారమైన ప్రేమ కలవారు,  మధురకవి ఆళ్వార్లు . నమ్మాళ్వార్లు ప్రణవము మీద దృష్ఠి సారించారు. ( ప్రణవము  స్వరూపమును (పరమాత్మకు జీవాత్మ దాసుడు).  మధురకవి ఆళ్వార్లు  ‘నమ:’ పద అర్థమును ఆచరించారు.
  • నంబిక్కు అన్బనాయ్ మధురకవి – నంబిక్కన్బనాయ్ – నమ్మాళ్వార్ల పట్ల ప్రేమ. మధురకవినమ్మాళ్వార్ల గుణములను స్మరించగానే నోరు, మాట తీయనౌతుంది.
  • ఈ ప్రబంధమును నేర్చుకొని అర్థములు తెలుసుకోనవసరము లేదు. విశ్వాసముంటే చాలు. నోరార ఎప్పుడూ పాడుతుంటే చాలు. మధురకవులు  చెప్పినట్లుగా నమ్మాళ్వార్ల వైభవమును స్మరిస్తుంటే సకల మంగళాలు ప్రాప్తిస్తాయి.
  • నంబువార్ ––ఈ ప్రబంధములో చెప్పిన నమ్మాళ్వార్ల  గుణపరిపూర్ణత  సత్యము.  అసత్యము కానే కాదు.

వీటితో కణ్ణినుణ్ శిఱుత్తాంబు పై  నంజీయర్ , నంపిళ్ళైపెరియవాచ్చాన్ పిళ్ళై  అళగియ మణవాళ పెరుమాళ్ నాయనార్లు చేసిన వ్యాఖ్యానములోని ముఖ్యాంశములు సమాప్తమయ్యాయి.

ఆళ్వార్ తిరువడిగలే శరణం

జీయర్ తిరువడిగలే శరణం

నంజీయర్ తిరువడిగలే శరణం

నంపిళ్ళై తిరువడిగలే శరణం

పెరియవాచ్చాన్ పిళ్ళై తిరువడిగలే శరణం

అళగియ మణవాళ పెరుమళ్ నాయనార్ల తిరువడిగలే శరణం

అడియేన్ చూడామణి రామానుజ దాసి

Source: http://divyaprabandham.koyil.org/index.php/2015/02/kanninun-chiruth-thambu-11-anban-thannai/

archived in http://divyaprabandham.koyil.org

pramEyam (goal) – http://koyil.org
pramANam (scriptures) – http://srivaishnavagranthams.wordpress.com
pramAthA (preceptors) – http://guruparamparai.wordpress.com
srIvaishNava education/kids portal – http://pillai.koyil.org

0 thoughts on “కణ్ణినుణ్ శిఱుత్తాంబు – 11 – అంబన్ తన్”

Leave a Comment